ఇండియా-ఇంగ్లండ్  5 మ్యాచ్ టెస్ట్ సీరీస్ రేపే ప్రారంభం
x

ఇండియా-ఇంగ్లండ్ 5 మ్యాచ్ టెస్ట్ సీరీస్ రేపే ప్రారంభం

క్రికెట్ అభిమానుల‌కు మ‌రో కిక్‌


-రాజశేఖరం

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెస్టు సిరీస్ మ‌రికొన్ని గంట‌ల్లో మొదలు కానుంది. భార‌త్ ఇంగ్లండ్ జ‌ట్లు త‌ల‌ప‌డేందుకు స‌మాయ‌త్తం అవుతున్నాయి. ఐదు టెస్టుల సిరీస్ లో మొద‌టి టెస్టు మ్యాచ్ హెడింగ్లేలో జ‌ర‌గ‌నుంది.

అంద‌రి చూపు గిల్ వైపు

భార‌త ఇంగ్లండ్ జట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న తొలి టెస్టు మ్యాచ్ అనేక విశేషాల‌ను క‌లిగిఉంది. దిగ్గ‌జ ప్లేయ‌ర్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లేకుండా భార‌త జ‌ట్టు బ‌రిలో దిగుతోంది. తొలిసారి జ‌ట్టుకు సార‌ధ్యం వహిస్తున్న శుభ్మ‌న్ గిల్ త‌న నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌ను చాటుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. గిల్ కు ఎదురౌతున్న తొలి స‌వాలు జ‌ట్టు ఎంపిక‌. ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టులో 19 మంది ప్లేయ‌ర్లు ఉన్నారు. వారిలో 11 మందిని ఎంపిక చేయ‌డం క‌త్తిమీద సాములా త‌యార‌యింది. తుది జట్టులో ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నే విష‌యంలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ర‌వీంద్ర జ‌డేజాను కూడా ప‌క్క‌న పెట్టే అవ‌కాశం ఉంద‌ని కూడా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ ప్ర‌చారాల నేప‌థ్యంలో ఎవ‌రికి స్థానం క‌ల్పిస్తారు? ఎవ‌రిని ప‌క్క‌న పెడ‌తార‌నే విష‌యంలో క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

జ‌స్మ్రీత్ బుమ్రా మాత్రం మొత్తం 5 టెస్టుల్లో 3 టెస్టులే ఆడ‌తాడ‌ని తెలుస్తోంది. త‌న ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని త‌న‌ను కీల‌క‌మైన మూడు మ్యాచుల్లో ఆడించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌హ్మ‌ద్ సిరాజ్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండ‌నున్నాడు. ప్ర‌సిద్ధ కృష్ణ‌, శార్ధుల్ ఠాకుర్ కూడా భార‌త బౌలింగ్ భారాన్ని మోసేందుకు సిద్ధంగా ఉన్నారు.

రాహుల్ స‌త్తా చాటేనా?

కేఎల్ రాహుల్ త‌న సీనియారిటీని ఉప‌యోగించాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌ని అభిమానులు భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల వంటి సీనియ‌ర్ల‌తో క‌లిసి ఆడుతూ వ‌చ్చిన రాహుల్ ...ప్ర‌స్తుతం త‌న స‌త్తా చాటేందుకు సిద్ధ‌మౌతున్నాడు. ఇంగ్లండ్ జ‌ట్టుపై మంచి ట్రాక్ రికార్డు క‌లిగిన రాహుల్...ఈ టెస్టు సిరీస్‌లో కూడా త‌న స‌త్తా చాటుతాడ‌ని అభిమానులు ఆశిస్తున్నారు. య‌శ‌స్వి జైస్వాల్‌తో క‌లిసి భార‌త ఇన్నింగ్స్ ఆరంభించ‌నున్నాడు. టెస్టు మ్యాచుల్లో ఓపెన‌ర్‌గా కేఎల్ రాహుల్ మంచి రికార్డునే క‌లిగి ఉన్నాడు. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్ల‌పై సెంచ‌రీలు చేసిన ఘ‌న‌త కేఎల్ రాహుల్ సొంతం. ప్ర‌స్తుతం ఉన్న జ‌ట్టు స‌భ్యుల్లో ఇంగ్లండ్‌లో ఎక్కువ మ్యాచులు ఆడిన వారిలో ర‌వీంద్ర జ‌డేజా త‌ర్వాత కేఎల్ రాహులే ముందున్నాడు.

రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లేని లోటును భ‌ర్తీ చేయాల్సిన బాధ్య‌త కేఎల్ రాహుల్‌పై ఉంద‌ని భార‌త మాజీ క్రికెటర్ హేమంగ్ బ‌దానీ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్‌కి టెక్నిక్, టెంప‌ర‌మెంట్ స‌రిగ్గా ఉన్నాయ‌ని, ఎంతో స‌హ‌నంతో ఆడ‌గ‌ల‌డ‌ని క్రికెట్ దిగ్గ‌జాలు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. వికెట్ కోల్పోకుండా సంయ‌మ‌నంతో ఆడ‌డం రాహుల్ ప్ర‌త్యేక‌త‌ని హేమంగ్ బ‌దానీ గుర్తుచేసుకున్నాడు. ఇంగ్లండ్‌లో ఆడిన అనుభ‌వం లేని కుర్ర ఆట‌గాళ్ల‌కు కేఎల్ రాహుల్ స‌రైన రీతిలో గైడ్ చేయ‌గ‌ల‌డ‌ని కూడా హేమంగ్ బ‌దానీ అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఒక‌సారి భార‌త బ్యాటింగ్ లైన‌ప్ చూసిన‌ట్ల‌యితే మొద‌టి రెండు స్థానాల్లో య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. నాల్గ‌వ స్థానంలో శుభ్మ‌న్ గిల్, ఐదో స్థానంలో రిష‌న్ పంత్ దిగ‌నున్నారు. మూడో స్థానంలో సాయి సుద‌ర్శ‌న్ దిగే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి.

క‌రుణ్ నాయ‌ర్‌కు గాయం

నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో భార‌త బ్యాట‌ర్ క‌రుణ్ నాయ‌ర్ గాయ‌ప‌డ్డాడు. ప్ర‌సిద్ధ కృష్ణ వేసిన ఓ బంతిని స‌రిగ్గా ఆడ‌లేక‌పోవ‌డంతో గాయ‌ప‌డ్డాడు. 2017 త‌ర్వాత మ‌ళ్లీ జ‌ట్టులో స్థానం ద‌క్కించుకున్న క‌రుణ్ నాయ‌ర్ గాయం కార‌ణంగా తుది జ‌ట్టులో స్థానం కోల్పోయే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. గ‌త కొన్ని నెల‌లుగా డొమెస్టిక్ క్రికెట్ మ్యాచుల్లో అద్భుతంగా రాణిస్తూ...ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న క‌రుణ్ నాయ‌ర్‌కు సెల‌క్ల‌ర్లు అవ‌కాశం క‌ల్పించారు. గాయం కార‌ణంగా ఆ అవ‌కాశం కాస్త దూర‌మైన‌ట్లు క‌నిపిస్తోంది.

వీరి మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్త‌రం

ఛాంపియ‌న్స్ ట్రోఫీ మిస్ అయిన మ‌హ్మ‌ద్ సిరాజ్...ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే టెస్టు సిరీస్‌లో త‌న స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంగ్లండ్ కీల‌క ఆట‌గాడు హ్యారీ బ్రూక్‌ను టార్గెట్ చేసే అవ‌కాశాలు ఎక్కువుగా క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు జో రూట్‌ను నిలువ‌రించ‌డానికి బుమ్రాను అస్త్రంగా ప్ర‌యోగించే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఇంగ్లండ్ కండిష‌న్ల‌లో అద్భుతంగా ఆడ‌గ‌లిగే రిష‌న్ పంత్‌...ఇంగ్లండ్ స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ నుంచి ప్ర‌తిఘ‌ట‌న ఎదుర్కొనే అవ‌కాశం క‌నిపిస్తోంది.

5 మ్యాచులు ఎక్కడ జరగనున్నాయంటే....

భారత్ ఇంగ్లండ్ జట్ల జరిగే టెస్టు సిరీస్ లో 5 టెస్టు మ్యాచులు జరగనున్నాయి. మొదటి మ్యాచ్ జూన్ 20 నుంచి జూన్ 25 వరకు హెడింగ్లేలో జరగనుండగా... రెండవ మ్యాచ్ బర్మింగ్ హమ్ లో జూలై 2 నుంచి జూలై 6 వరకు జరగనుంది. మూడో మ్యాచ్ లార్డ్స్ లో జూలై 10 నుంచి జూలై 14 వరకు జరగనుంది. జూలై 23 నుంచి జూలై 27 వరకు మాంచెస్టర్ లో నాల్గవ టెస్టు మ్యాచ్ జరగనుండగా చివరిదైన ఐదో టెస్టు మ్యాచ్ కెన్నింగ్ టన్ ఓవల్లో జూలై 31న ప్రారంభం కానుంది. ఆగ‌స్టు 4తో ముగియ‌నుంది.

జ‌ట్టును ప్ర‌క‌టించిన ఇంగ్లండ్

భార‌త్‌తో జ‌రిగే తొలి టెస్టు మ్యాచ్‌కి త‌మ టీమ్‌ను ప్ర‌క‌టించింది ఇంగ్లండ్. ఆల్ రౌండ‌ర్ బెన్‌స్టోక్స్ ఇంగ్లండ్ జ‌ట్టుకు సార‌ధ్యం వ‌హించ‌నున్నాడు. జామీ స్మిత్ వికెట్ కీప‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. బెన్ డ‌కెట్, జాక్ క్రాలీలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరంభించ‌నున్నారు. మూడో స్థానంలో ఓలీ పోప్ ఆడ‌నున్నాడు. ఇక నాల్గ‌వ స్థానంలో జో రూట్ త‌న స‌త్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. హ్యారీ బ్రూక్స్, స్టోక్స్, జామీ స్మిత్ మిడిలార్డ‌ర్ భారాన్ని మోయ‌నున్నారు. మ‌రోవైపు క్రిస్ ఓక్స్ బౌలింగ్ భారం మోయ‌నున్నాడు. జోస్ టంగ్, బ్రైడ‌న్ క‌ర్స్, షోయ‌బ్ బ‌షీర్‌లు కూడా త‌మ అదృష్ఠం ప‌రీక్షించుకోనున్నారు. జేమ్స్ ఆండ‌ర్స‌న్, స్టువ‌ర్ట్ బ్రాడ్ వంటి దిగ్గ‌జ బౌల‌ర్లు ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టులో లేరు. దీంతో భార‌త బ్యాట‌ర్ల‌కు కాస్త రిలీఫ్ దొరికిన‌ట్ల‌యింది.

భార‌త్, ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న టెస్టు సిరీస్‌తో వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ సైకిల్ మ‌రోసారి ఫ్రెష్‌గా ప్రారంభం కానుంది.

5 టెస్టు మ్యాచుల షెడ్యూల్

మొదటి మ్యాచ్ - హెడింగ్లేలో - జూన్ 20 నుంచి జూన్ 24 వరకు

రెండవ మ్యాచ్ - బర్మింగ్ హమ్ లో - జూలై 2 నుంచి జూలై 6 వరకు

మూడో మ్యాచ్ - లార్డ్స్ లో- జూలై 10 నుంచి జూలై 14 వరకు జరగనుంది.

నాల్గవ టెస్టు - మాంచెస్టర్ లో - జూలై 23 నుంచి జూలై 27 వరకు

ఐదో టెస్టు మ్యాచ్ - కెన్నింగ్ టన్ ఓవల్లో- జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు

Read More
Next Story