
ఐపీఎల్కు తొలి రెండు వారాలు ధోని దూరం..కారణమేంటి?
అధికారికంగా ప్రకటించిన చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ
పిక్క కండరాల గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2026కి తొలి రెండు వారాల పాటు దూరం కానున్నారు. ఈ విషయాన్ని సీఎస్కే ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
“ఎంఎస్ ధోనీ ప్రస్తుతం పిక్క కండరాల గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ కారణంగా టాటా ఐపీఎల్ 2026 ప్రారంభ రెండు వారాల మ్యాచ్లకు ఆయన అందుబాటులో ఉండరు,” అని ఫ్రాంచైజీ వెల్లడించింది.
2020లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ధోనీ, అప్పటి నుంచి కేవలం ఐపీఎల్లోనే ఆడుతున్నాడు. ప్రతి సీజన్ తర్వాత ఆయన భవిష్యత్తుపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. వయసు పెరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్ ఫిట్నెస్ను నిలుపుకోవడం ఆయనకు సవాలుగా మారుతోంది.
ఇప్పుడున్న పరిస్థితిలో రుతురాజ్ గైక్వాడ్ జట్టు కెప్టెన్గా ఉన్నప్పటికీ, 2008 నుంచి జట్టుతో కొనసాగుతున్న ధోనీనే సీఎస్కేకు అసలు మార్గదర్శకుడిగా భావిస్తారు.
గత ఐపీఎల్ సీజన్లో ధోనీ మొత్తం 14 మ్యాచ్లు ఆడారు. ఎక్కువగా దిగువ వరుసలో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు చివర్లో మెరుగైన స్కోరు అందించే బాధ్యతను నిర్వర్తించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత ఆయనకు మోకాలి సమస్యలు పునరావృతమవుతున్నాయి. 2023లో ఆ సమస్యకు శస్త్రచికిత్స కూడా చేయించుకున్నాడు.
ఇదిలా ఉండగా, సీఎస్కే తన ఐపీఎల్ 2026 ప్రచారాన్ని మార్చి 30న గౌహతిలో రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్తో ప్రారంభించనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో తొలి మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7 గంటలకు టాస్ అనంతరం 7.30 గంటల నుంచి ఆట మొదలవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 24న కోల్కతాలో జరగనుంది.

