
నంబాల కేశవరావు మృత దేహం ఎందుకు కుటుంబానికి ఇవ్వడం లేదు..?
ఆర్భాటంగా అంత్యక్రియలు ప్రభుత్వానికి ఇష్టం లేదా?
నారాయణపూర్ నుండి మావోయిస్టుల మృత దేహాలను తెచ్చుకోవడం కోసం వెళ్లిన బంధువుల ఓపిక నశించింది. ఈరోజు 26-5-2025 సోమవారం పరాయి నేలపై నిరసన ప్రదర్శనకు దిగారు. తెలియని సుదూర ప్రాంతమైన నారాయణపూర్ పుర వీధుల్లో ధర్మాగ్రహంతో అనేక మంది చేపట్టిన నిరసనకు దిగారు.
"మా అన్నయ్య కేశవరావు మృతదేహం మాకు ఇవ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడంలేదు. హైకోర్టు కూడా ఇవ్వమని చెప్పింది. పేపర్ వర్క్ అంటూ ఆలస్యం చేయడంలో అర్థం లేదు.మళ్లీ కోర్టుకు వెళతాం" కేశవరావు తమ్ముడు రాంప్రసాద్
నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ గా వున్న ఈయన ఛత్తీస్ ఘఢ్ నారాయణ్ పూర్ అడవులలో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో మృతి చెందాడు. మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో వున్న నంబాల మృతి పోలీసుల విజయంగా భావిస్తుంటే, కనీసం మృతదేహాన్ని తమకు అప్పగించాలంటూ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఛత్తీస్ ఘఢ్ పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు.ఎన్ కౌంటర్ జరిగి వారం రోజులు అవుతున్నా, పోస్ట్ మార్టం పూర్తయినా, నంబాల కేశవరావు తో పాటు మరో ఇద్దరి మావో నేతల మృతదేహాలను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారు. నంబాల స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ప్రాంతం కోటబొమ్మాళి మండలం జీయన్నపేట.తమ అన్న మృతదేహాన్ని అప్పగిస్తే స్వస్థలం తీసుకెళ్లి సాంప్రదాయంగా అంత్యక్రియలు జరుపుకుంటాం, మా వారందరికీ ఆఖరి చూపులు దక్కుతాయన్నది కేశవరావు సోదరుడు రాంప్రసాద్ ఆవేదన.
అసలేం జరిగింది.. మృతదేహం అప్పగింతలో హైకోర్టు ఏమి చెప్పింది?
మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో, భద్రతా దళాల చేతుల్లో మరణించినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మే 21న ప్రకటించారు.
ఆ సమాచారం తో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డిఎస్పీ సూచనలతో ఛత్తీస్ ఘడ్ నారాయణ్ పూర్ వెళ్లిన కంబాల కేశవరావు సోదరుడు రాంప్రసాద్ కు చేదు అనుభవం ఎదురైంది. కేశవరావు మృతదేహం అప్పగించడానికి అక్కడి పోలీసులు నిరాకరించారు. దానికితోడు తమకు ఎదురైన సమస్యను రాంప్రసాద్ మీడియా కు తెలిపారు.
" అన్నయ్య కేశవరావు మృతదేహం కోసం22న శ్రీకాకుళం నుంచి అంబులెన్స్ తీసుకుని మా బంధువు జియన్నపేట ఎంపీటీసీ నంబాల రాజశేఖర్ ను వెంటబెట్టుకొని నారాయణ్ పూర్ వెళ్లాము. అక్కడి కి వెళ్లిన వెంటనే శ్రీకాకుళం ఎస్పీ మాతో వచ్చిన మా బంధువు ఎంపీటీసీ రాజశేఖర్ కు ఫోన్ చేసి తిరిగి వచ్చేయమని హెచ్చరించారు. ఆ తరువాత మంత్రి అచ్చన్నాయుడు కూడా రాజశేఖర్ కు ఫోన్ చేసి వచ్చేయమన్నారు. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వత్తిడి అంటున్నారు. ఇంక చేసేది లేక మొదటి సారి తిరిగి వెళ్లిపోయాం.
ఆ తరువాత మా అమ్మ తరపున 23 న హైకోర్టు లో పిటీషన్ వేశాం. మృతదేహాన్ని అప్పగించాలని హైకోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. ఆ ఆర్డర్ పట్టుకొని 24 న మళ్లీ నారాయణ్ పూర్ వచ్చాం,అయినా పోలీసు స్టేషన్ కు ఆసుపత్రికి తిప్పుతున్నారు. ఏంటంటే పేపర్ వర్క్ రెండు మూడు రోజులు ఆగాలంటున్నారు. మాపైన చికాకు గా ,కోపంగా మాట్లాడుతున్నారు. చెకోర పక్షులులా మృతదేహం కోసం ఎదురు చూస్తున్నాం" ఇది కేశవరావు సోదరుడి అవేదన.
మృతదేహాన్ని ఎందుకు అప్పగించడం లేదు? పోలీసులు చెబుతున్న కారణం ఏంటి?
మావోయిస్టు ముఖ్యనేతల మృతదేహాలను అప్పగింత విషయంలో పోలీసుల వైఖరి మారింది. చిన్న స్థాయి మావోల విషయం ఎలావున్నా ముఖ్యనేతలు చనిపోయినప్పుడు పోలీసులు మృతదేహాలను స్వగ్రామాలకు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులకు ఇవ్వడం లేదు. దీని వెనుక బలమైన కారణమే వుందంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. మృతదేహాలను కుటుంబ సభ్యులనమకు అప్పగించిన తరువాత వారు స్వగ్రామానికి తీసుకెళ్లి పెద్ద ఎత్తున అంత్యక్రియలు నిర్వహించడం, భారీగా జన సమీకరణ, పౌర సంఘాల నేతలు హడావుడి చేస్తూ చనిపోయిన వారిని హీరోలుగా చేస్తున్నారు. అమరవీరులంటూ స్దూపాలు నిర్మించిన ఘటనలు వుండటంతో ప్రభుత్వాల వైఖరి మారింది. సంఘ విద్రోహులుగానే వారిని పరిగణించాలని భావిస్తున్న పోలీసులు ఎన్ కౌంటర్ల లో చనిపోయిన మావోయిస్టు నేతలకు అంత్యక్రియలు కొందరు బంధువుల సమక్షంలో సాదాసీదాగా కానిచ్చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లు ఎన్ కౌంటర్ లలో మరణించిన ఉగ్రవాదుల విషయంలో వ్యవహరించినట్లే , మావోల విషయంలోనూ జరగాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకే కంబాల కేశవరావు మృతదేహాన్ని బంధువులు స్వగ్రామానికి తీసుకెళేందుకు చేస్తున్న ప్రయత్నాలకు పోలీసులు పలు కారణాలతో అడ్డు తగులుతున్నాట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆర్డర్ తెచ్చిన మృతదేహాన్ని కంబాల కుటుంబ సభ్యులకు అప్పగించడంలో ఆలస్యం చేస్తున్న ఛత్తీస్ ఘఢ్ పోలీసులు, మృతదేహానికి అక్కడే కొద్దిమంది బంధువుల సమక్షంలో అంత్యక్రియలు జరపడానికి అభ్యంతరం లేదంటున్నారు.
ఏదైనా మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు మృతదేహం అప్పగింత విషయంలో జాప్యం జరుగుతూనే వుంది. మరోమారు హైకోర్టు ను ఆశ్రయించేందుకు కుటుంబ సభ్యులు సిద్దమవుతున్నారు. కేశవరావు ఎన్ కౌంటర్ ను గొప్పగా చెప్పుకున్న పోలీసులు, ప్రభుత్వం మృతదేహాన్ని బంధువులకు ఇచ్చి స్వగ్రామం పంపడం కాకుండా అక్కడే అంత్యక్రియలు చేస్తారేమో చూడాలి. కుటుంబ సభ్యుల పోరాటానికి ఎలా స్పందిస్తారో చూడాలి