Image Credits: Vivekananda International Foundation
x

సమాచార హక్కు కమిషన్: ఆంధ్రాలో ఉన్నా లేనట్లే , తెలంగాణలో అసలే లేదు

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో సమాచార హక్కును రక్షించుకోవలసిన అవసరం వచ్చింది. ఏపీలో సుమారు 10 వేల ఆర్టీఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సమాచారం ఎప్పుడొస్తుందో తెలియదు.


భారత రాజ్యాంగం తరువాత అంతటి ప్రాధాన్యత ఉన్నది సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ). ఈ చట్టం 2005లో వచ్చింది. 12.10.2024నాటికి 19 ఏళ్లు పూర్తవుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీఐ గందరగోళంలో ఉంది. తెలంగాణలో అసలు సమాచార కమిషన్ (ఆర్టీఐ) ఇంకా భర్తీ చేయలేదు. హైకోర్టు చెప్పినా వినే తీరిక లేదు. ఆంధ్రప్రదేశ్ లో సమాచార హక్కును రక్షించుకోవలసిన అవసరం వచ్చింది. ఏపీలో సుమారు 10 వేల ఆర్టీఐ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. సమాచారం ఎప్పుడొస్తుందో తెలియదు.

మొత్తం మీద మన దేశంలో అసలు ఈ చట్టం అమలవుతుందా అనే సందేహం వస్తుంది. దేశం మొత్తం మీద 2023 జులై 30 నాటికి పెండింగ్ లో 3 లక్షల 88 వేల886 కేసులకు సమాచారం రావాల్సి ఉంది. అది దొరుకుతుందో లేదో తెలియదు. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు, ప్రజాస్వామ్య ప్రియులకు, సమాచార హక్కు చట్టం 2005 పరిరక్షణ కోసం పాటు పడుతున్న పౌరులకు ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు తెలంగాణ లో ఒక్క సమాచార కమిషనర్ కూడా లేరు. జవాబుదారీ తనం, పారదర్శకత కాపాడే విధి, బాధ్యత అందరికీ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ కమిషనర్ ఆర్.మహబూబ్ బాష, ఇతర కమిషనర్లు శామ్యూల్ జోనాథన్, సీ.సునీల్, రెహానా బేగం, ఏ.ఉదయభాస్కర రెడ్డి మధ్య రకరకాల మాటలు చర్చనీయాంశం అయ్యాయి.

కమిషనర్ల మధ్య సయోధ్య సాధ్యమా..

ఏపీలో కమిషనర్ల మధ్య సహాయ నిరాకరణ కనపడుతోంది. సాక్షాత్తూ చీఫ్ కమిషనర్ ఆర్.మహబూబ్ బాష ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కు ఈ నెల 3వ తేదీన సమగ్రంగా 48 పేజీల నివేదికను సమర్పించే వరకూ వ్యవహారం వెళ్లింది. అది సంచలనమైంది. సమాచార హక్కు చట్టం 2005 పరిధిలో సమాచారం కోరుతూ తమ వద్దకు వచ్చే రెండో అప్పీళ్లను, ఫిర్యాదులను విచారించి తీర్పులివ్వాల్సిన బాధ్యతలను కమిషనర్లు నిర్వహించాలి. భేదాలకు విభేదాలకు ఆస్కారం ఏది? ఉండవలసింది సంస్కారం అనేది అసలు సారం. గవర్నర్ కు చీఫ్ కమిషనర్ సమర్పించిన నివేదికను పరిశీలిస్తే కమిషన్ లో జరుగుతున్నదేమిటో కనిపిస్తుంది.

ఎటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలు చేసే విధానాన్ని, ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని పాటించడం లేదని, విచారణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు కెమెరాలు ఏర్పాటును నిరాకరించడాన్నీ, విధిగా ప్రతి రోజూ పనివేళలకు కార్యాలయానికి ఠంచనుగా వచ్చి అందుకు అనుగుణంగా ఎటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేసి, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ లో తమ హాజరును నమోదు చేసుకుని విధులకు రావాలనే కనీస నిబంధనలు పాటించడం లేదని అర్థమవుతుంది. అందుకు ఆర్డర్లు వేయవలసింది ఉంటుందా? ఆ అవసరం రావడమే దారుణం. ఎటెండెన్స్ రిజిస్టర్ లో చేసే సంతకాల ప్రాతిపదికగా వారి నెలవారీ జీత, భత్యాల బిల్లులను రూపొందించడానికి కార్యాలయ ఉంటుంది. ఎక్కడా లేని విధంగా తమను ఎటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలని ఆదేశించడం ఏమిటి? ఉదయం పదిన్నర గంటలకు కూడా రెండో అప్పీల్ విచారణ చేయడానికి కమిషనర్లు తప్పకుండా రావాలనీ, రాకపోతే సెలవు పెట్టుకోవాలని, రోజూ ఎన్నో కొన్ని కేసులైనా విచారణ చేయాలని చీఫ్ కమిషనర్ అడుగుతున్నారు. కనీసం ఆరుగంటలు పనిచేయండి అని బతిమాలుకోవలసి వస్తున్నది. ఆర్డర్లు వేయాల్సి వస్తున్నది. గవర్నర్ కే ఫిర్యాదు చేయాల్సి వస్తున్నది. ఇక కేసులు ఎప్పుడు ముగిసిపోతాయి?

వ్యక్తిగత సమాచారమా కాదా

ఓ ప్రభుత్వ అధికారి ఆస్తులు వ్యక్తిగత సమాచారం కాదని , అది వెల్లడించ దగినదేనని అనేక తీర్పులు ఉన్నాయి. ఆస్తులు వెల్లడిస్తే పారదర్శకత మరింతగా పెంపొందుతుంది. దానికి అనుగుణంగా చీఫ్ కమిషనర్ బాష తన ఆస్తులను బహిరంగంగా వెల్లడించారు. అధికారిక వెబ్ సైట్లో ఉంచారు. అందరూ వెల్లడించాలి.

జీతభత్యాల సమస్య

సెప్టెంబర్ 26, 2024వ తేదీన నలుగురు సమాచార కమిషనర్లు తమ కార్యాలయ సూపరిటెండెంట్ ఆఫీసుకు వెళ్లి తమ జీత, భత్యాల కోసం అడిగేపరిస్థితి వచ్చింది. సమాచార కమిషనర్లు కార్యాలయానికి వచ్చి, హాజరు నమోదు చేయకపోతే వారి జీతాలు విడుదల చేయకూడదని ఇచ్చిన ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ బిల్లులు ఇవ్వవలసి ఉంది. కాని చేయలేదు. ఒక దశలో నెలజీతాలు ఆపేయాలని ఒక ఆర్డర్ వేయడం, ఆ తరువాత పై అధికారి అంతకుముందున్నా నిలుపుదల ఆ నెలజీతాలను కమిషనర్లకు చెల్లించాలని సాధారణ పరిపాలన శాఖ నుంచి కమిషన్ అధికారిని ఆదేశించినట్లు ఒక ప్రముఖ దిన పత్రికలో వార్త వచ్చింది. తమకు సెప్టెంబర్ నెల జీతాలు చెల్లించని విషయాన్ని కమిషనర్లు సాధారణ పరిపాలన శాఖ అధికారికి ఫిర్యాదు చేసినట్లు, కమిషనర్ల సెప్టెంబర్ నెల జీతాలు నిలిపి వేయడానికి కారణాలేమిటో తెలియజేయాలంటూ సమాచార కమిషన్ డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారికి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్ 8.10.2024 న ఉత్తర్వులు జారీ చేసినట్లు మరో పత్రికలో వార్త వచ్చాయి.

పర్యవేక్షణాధికారాలు ఎవరివి?

సమాచార హక్కు చట్టం 2005 లో సెక్షన్ 15(4) ద్వారా కమిషన్ పాలన, పర్యవేక్షణాధికారాలు చీఫ్ కమిషనర్ కు ఉన్నాయి. మొత్తం కమిషనర్లు, ఒకవ్యక్తిగా మొత్తం కమిషన్ కూడా బాద్యత గా ఉంటూ అధికారాలు కూడా వ్యవహరించవలసి ఉంటుంది.

ఫిర్యాదులో చేసిన ఆరోపణలో ‘‘రాష్ట్ర సమాచార కమిషనరు మినహాయింపులు పోనూ నెలకు రూ.3.50 లక్షల వరకు వేతనం చెల్లిస్తున్నారు. అంటే, రోజుకు దాదాపు రూ.11 వేలు. నెలలో వీరు పని చేయాల్సింది 22 రోజులు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఈ స్థాయిలో వేతనాలు పొందుతూ కూడా కార్యాలయాలకు సరిగ్గా రావడం లేదు. ఆర్టీఐ అమలులోనూ లోపాలపై స్వచ్ఛంద సంఘాల నుంచి ఫిర్యాదులు అందాయనీ వీరి ప్రవర్తనలో మార్పు కోసం ఏడాదిగా ఎదురుచూసిన సీఐసీ మహబూబ్ బాషా చివరకు గవర్నర్ కు నివేదిక పంపినారని’’ వివరించారు. వారి రోజువారీ విచారణలను వీడియో రికార్డింగ్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారని, జిల్లా కలెక్టర్లతో పాటు ఇతర అధికారులను విచారించేందుకూ ఇష్టపడటం అనే అనేక అంశాలు బహిర్గతమైనాయి. సుప్రీంకోర్టు విచారణలు కూడా వీడియోలో అధికారికంగా ఇవ్వడం గొప్పతనం. అందుకు సమాచార కమిషన్లు కూడా వీడియోలో ప్రజలకు తెలియజేయాలి.

సెక్షన్ 6(1) అమలు ఎవరు చేస్తారు?

ఆ దశలో అక్టోబర్ 8న ఒక ప్రకటనను సిఐసి ‘‘సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 6(1) కింద దరఖాస్తుదారులు నిర్దేశించిన విధంగా నియమిత కాలవ్యవధిలో సమాచారం అందజేసేలా చర్యలు తీసుకోవాలనేది పాతదే. చట్టం ప్రకారం నియమిత కాలవ్యవధిలో అంటే 30 రోజుల్లోగా 6(1) దరఖాస్తులకు సమాచారం ఇస్తే దరఖాస్తు దారులకు అప్పీలుకు రావాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోతుంది’. సెక్షన్ 4(1)బి కింద ఆయా కార్యాలయాల్లో స్వచ్ఛందంగా తమ కార్యాలయాల సమాచారాన్ని సాధ్యమైనంతగా వెల్లడిస్తే చట్టంలోని కీలకమైన నియమాలు అమలవుతాయి.

గవర్నర్ కు పనితీరుపై నివేదిక

అమరావతి నుంచి వస్తున్న మీడియా వార్తల ప్రకారం, ‘'రాష్ట్ర సమాచార కమిషన్ తన విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించేలా, నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించేలా, కార్యాలయంలో పారదర్శకతను పాటించేలా అన్ని చర్యలూ తీసుకున్నాం. కానీ నిరాకరణ ధోరణి, ప్రవర్తన వల్ల ఆ లక్ష్యానికి విఘాతం కలుగుతోంది. కమిషనర్ల ప్రవర్తన. ప్రమాణ (ఓత్ టేకింగ్) ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సమాచార హక్కు చట్టం-2005 స్ఫూర్తిని కాపాడండి'’ అని రాష్ట్ర సీఐసీ గవర్నర్ కి నివేదించారు. సహాయ నిరాకరణ ధోరణి, ఆ ప్రవర్తన వల్ల సమాచార హక్కుకు, తెలిసే హక్కు, వాక్ స్వాతంత్ర్యం హక్కుకు ప్రమాదం వస్తున్నది. ఇది ప్రమాణ (ఓత్ టేకింగ్) ఉల్లంఘన కిందకు వస్తుంది. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుని సమాచార హక్కు చట్టం 2005 స్ఫూర్తిని కాపాడండి’’ లని స్వయంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నివేదిక ఇచ్చారు.

సమాచార కమిషన్ కార్యాలయంలోని అంతర్గత వ్యవహారాలు, కమిషనర్ల పనితీరుపై గవర్నర్ కార్యాలయానికి 2023 జూన్ 7న సీఐసీకి పంపించారు. ఈ వివరాలను రాష్ట్ర గవర్నర్ కు పంపించారు. ఐసీ గా ఉన్న పి శామ్యూల్, చావలి సునీల్, రెహనా బేగం, డాక్టర్ అల్లారెడ్డి ఉదయభాస్కర్ రెడ్డి పేర్లను ఈ నివేదిక లో ప్రస్తావించారు. సహ చట్టం నివేదికలో సెక్షన్ 15 (4) ప్రకారం ప్రధాన సమాచార కమిషన్ కి రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే అధికారముంది.

సమాచార హక్కు చట్టం 2005లోని సెక్షన్ 6(1) కింద దరఖాస్తుదారులు చేసుకునే దరఖాస్తులకు ఆయా శాఖల పీఐఓలు కాలవ్యవధిలో సమాచారం అందజేసేలా చర్యలు తీసుకోవాలి. దానికి కూడా ఏ ఆర్డర్ కూడా అవసరం లేదు.

ముఖ గుర్తింపు

‘‘ముఖ గుర్తింపు విధానం (ఫేసియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఎస్ఆర్ఎస్)లో హాజరు నమోదు చేయాలి. అది అవసరమని లేఖ ఇస్తే, ఆ అవసరం లేదని మరికొందరు అంటున్నారు. తెలుగులో తీర్పులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. ఇది ఒక్కరు మాత్రమే ఇది పాటిస్తున్నారంటున్నారు. ‘‘కమిషనర్ కార్యాలయంలో సీసీ కెమెరాలు అమర్చి, కార్యకలాపాలన్నీ రికార్డు చేయాలని ఐటీ విభాగానికి తెలియజేయగా, 2024 జనవరి నుంచి ఆ ఏర్పాట్లు చేశారు. సమాచార కమిషన్ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు రోస్టర్ ప్రకారం విచారణలు చేపట్టి, తర్వాత గంట పాటు మధ్యాహ్న భోజన విరామం తీసుకోవాలి. తిరిగి 2.30 నుంచి 5.30 వరకు మళ్లీ రోస్టర్ ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. సీసీ కెమెరాల పుటేజీలు పరిశీలించినప్పుడు కమిషనర్లు ఈ సమయ పాలన పాటించలేదన్నా’’రు. రాష్ట్ర సీఐసీ ఆదేశాలతో వారితో కలిసి పనిచేయవలసిన రాష్ట్ర ఐసీలు విభేదించడంవల్ల అసలు సమస్య.

ప్రధమ అప్పెల్లేట్ అధికారి

చాలో చోట్ల ప్రథమ అప్పిలేట్ అధికారి ప్రత్యక్షంగా రావలసి అవసరం లేదు. అడిగిన సమాచారం ఇవ్వడంతో చాలని, ఆన్ లైన్ విధానాన్ని వినియోగించు కోవాలి. ‘‘సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి సమాచార కమిషన్ లో ఈ విధానం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్నామని అప్పీలుదారులు, ఫిర్యాదుదారులతో పాటుగా అధికారులకు కూడా ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆన్ లైన్ (వర్చువల్) విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. అధికారులకు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించే బాధ తప్పుతుందన్నారు. అంతే కాక కమిషన్ ముందు విచారణకు హాజరు కావడానికి అయ్యే ప్రయాణ ఖర్చులు, భత్యాలు ప్రభుత్వానికి మిగిల్చిన వారవుతారనీ అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల అనే మారు మూల గ్రామంలో ఆదివాసీ గిరిజన యువతను ఉద్దేశించి తాను ఇటీవల ప్రసంగించానని వారి నుంచి తాను, తన నుంచి వారు సమాచార హక్కు చట్టంపై అభిప్రాయాలు తెలుసుకున్నామనీ, అదే తాను కనుక అధికార పర్యటనకు వందల కిలోమీటర్ల దూరంలోని కొండకర్లకు వెళ్లి ఉంటే ప్రొటోకాల్ పేరుతో అధికారులు హడావుడి, వ్యయం జరిగి ఉండేదని, అలాంటి వాటిని నివారించేందుకే తాను ఆన్ లైన్ (వర్చువల్) విధానాన్ని ఎంచుకున్నారు’’ అని ఛీఫ్ కమిషనర్ వివరించారు.

ప్రథమ అప్పిలేట్ అధికారులే కనుక దరఖాస్తుదారు ప్రథమ అప్పీలు చేసుకున్నపుడు ఇరు పక్షాలకు నోటీసులు ఇచ్చి కేసును విచారించి సహేతుకమైన రీతిలో ఉత్తర్వులు జారీ చేయాలనేది, డీ ఆర్ ఓ లకు కేసులను విచారించి తీర్పులు ఇచ్చే ప్రక్రియ కొత్తేమీ కాదని, రెవెన్యూ కేసుల్లో ఎలా విచారించి తీర్పులు ఇస్తారో అలాగే ఈ ప్రక్రియ కూడానని, అవసరమైనప్పుడే పీఐఓ, ఎఫ్ఎఏలు ప్రత్యక్షంగా కమిషన్ ముందుకు రావాల్సి ఉంటుందని, జటిలమైన కేసుల్లో కమిషన్ ఆదేశాల మేరకు రికార్డులతో సహా అధికారులు రావాల్సి ఉంటుందని రాష్ట్ర సీఐసి వివరించారు. ప్రతి మంగళవారం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకూ ఒక గంట సేపు రాష్ట్రంలోని 26 జిల్లాల సమాచార హక్కు చట్టం నోడల్ అధికారుల (డీ ఆర్ ఓల) సమావేశంలో మాట్లాడారు. రోజు వారీ కార్యాలయ పనివేళలకు అంతరాయం కలుగకుండా కార్యాలయ పని వేళలకు ముందే ఆయన ఈ సమయాన్ని ఎంపిక చేసుకున్నారు.

లంచాలు అడిగితే ...

సమాచార కమిషన్ లో జరిగే విచారణల్లో తీర్పులు చట్టం ప్రకారం సమాచార హక్కుకు అనుకూలంగా ఉండాలి. కాని ఆ విధంగా చేయిస్తాం అని డబ్బులు ఇవ్వాలని కమిషన్ సిబ్బంది ఎవరైనా ఫోన్ల ద్వారా డిమాండ్ చేస్తే తక్షణమే తన దృష్టికి తీసుకు రావాలని అలాంటి వాటిపై చర్యలు కూడా ఉంటాయని నోడల్ అధికారులతో అన్నారు. సిఐసి పేషీ అధికారిక నెంబర్ కు 833380072 గాని, తన ఈ మెయిల్ కు గాని ఫిర్యాదు చేయాలని కూడా వెల్లడిచేసారు. కమిషన్ విచారణకు ప్రత్యక్షంగా హాజరయితేనే అనుకూల ఆదేశాలు వెలువడతాయనే అపోహలు వద్దని, ప్రత్యక్షంగా వచ్చినా, వర్చువల్ విధానంలో హాజరైనా కేసులో మెరిట్స్ ఆధారంగానే తీర్పులు వస్తాయని ఆయన అన్నారు. అధికారులు ప్రత్యక్షంగా హాజరై సెల్యూట్ లు చేయాలన్న అహం ఎంత మాత్రం తమకు లేదన్నారని సిఐసి ప్రకటించారు.

దరఖాస్తుదారులు తెలుగులో సమాచారం ఇవ్వాలని కోరినప్పుడు తెలుగులోనే ఖచ్చితంగా ఇవ్వాలని, తెలుగులో ప్రథమ అప్పిలేట్ అధికారులు తీర్పులు ఇవ్వాలని కూడా పేర్కొన్నారు.

సమాచార హక్కు చట్టం 2005 కింద ప్రభుత్వ సమాచారం కోసం పౌరుల అభ్యర్థనలకు సకాలంలో స్పందించడం తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వంలో ‘‘సిబ్బంది తో సహా శిక్షణ విభాగం, ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల మంత్రిత్వ శాఖ’’ ద్వారా మొదటి అప్పీలేట్ అథారిటీలు, PIOల కు ఇతర వివరాలపై వీలైనంత తొందరగా సమాచారం కోసం పౌరులకు RTI పోర్టల్ గేట్‌వేని అందించడానికి కూడా ఇవ్వాలని ప్రభుత్వం విధానం అమలు చేస్తున్నారని వెబ్‌లో కూడా ఇవ్వాలి. సమాచార హక్కు చట్టం ప్రాథమిక లక్ష్యం పౌరులకు సాధికారత కల్పించడమే. ప్రభుత్వ పనిలో పారదర్శకత జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికే చట్టం అమలు చేస్తున్నారు. అవినీతిని అరికట్టడం మన ప్రజాస్వామ్యాన్ని నిజమైన పరమార్థంలో ప్రజల కోసం పనిచేసేవిగా చేయించాలని, పాలనా సాధనాలపై అవసరమైన నిఘా ఉంచేందుకు, పాలించిన వారికి ప్రభుత్వం మరింత జవాబుదారీగా ఉండేవిధంగా మెరుగ్గా సాధ్యం కావాలి. ప్రభుత్వ కార్యకలాపాల గురించి పౌరులకు తెలియజేయడానికే ఈ చట్టం. ఎవరు, ఎప్పుడు అమలు చేస్తారో కదా?

Read More
Next Story