
పెను ప్రమాదంలో శ్రీశైలం రిజర్వాయర్
నాగార్జున సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంక్ గా మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్ ఉపయోగపడుతోంది.
- అరుణ్
మనవాళ్ళకు ముఖ్యంగా పాలక పార్టీలకు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం సహజమైన ప్రక్రియ. అయితే, ఇక్కడ కాలే చేతులు ప్రజలవి, ఆకులు పట్టుకునేది మాత్రం పాలకులు. శ్రీశైలం రిజర్వాయర్ నేడున్న దుస్థితి చూస్తే.. పై సామెత ఎంత చక్కగా అన్వయిస్తుందో తెలుస్తుంది. రూ.2 వేల 300 కోట్ల ఖర్చుతో, ఆధునిక దేవాలయం అని పిలవబడ్డ ఈ శ్రీశైలం రిజర్వాయర్ 1960లో నిర్మాణం ప్రారంభమయి.. 1981లో పూర్తయింది. ఇది 25లక్షల ఎకరాలకు సాగు నీరు, వేలాది గ్రామాలకు తాగు నీరు అందిస్తుంది.
ఈ రిజర్వాయర్ ను ఆధునిక దేవాలయం అని మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పిలవడం వెనుక రిజర్వాయర్, దేవాలయాల మధ్య సారూప్యత చూడాలేమో? దేవాలయ నిర్మాణంలో తమ శారీరక శ్రమతో ఒళ్లు గుల్ల చేసుకున్న బహుజన దళిత వర్గాల ప్రజలకు దేవాలయ ప్రవేశం లేనట్టుగా, ఆ శ్రీశైలం రిజర్వాయర్ కోసం 80 వేల ఎకరాలను, అది కూడా కేసి కాలువ కింద ముక్కారు పంటలు పండే భూమిని త్యాగం చేసి, స్వగ్రామలను వదిలి కాందశీకులుగా మిగిలిన కర్నూలు జిల్లా వాసులకు గానీ, దాదాపు 48 వేల ఎకరాలను త్యాగం చేసిన దక్షిణ తెలంగాణా ప్రజలకు గానీ,ఈ ఆధునిక దేవాలయం ఏమాత్రం లబ్ది చేకూర్చడంలేదు. వారికి ఇంత వరకు సరైన నష్టపరిహారం లభించలేదు. వీరిని అభివృద్ధి అస్పృశ్యులు అనవచ్చునేమో! కేవలం నాగార్జున సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంక్ గా మాత్రమే శ్రీశైలం రిజర్వాయర్ ఉపయోగపడుతోంది. పొతే, ప్రజాందోళనవల్ల మిగులు జలాల పేరుతో కొన్ని ఎంగిలి మెతుకులు మాత్రం పై రెండు ప్రాంతాల వారికి లభిస్తున్నాయి. త్యాగం ఒకరిది. సంపద మరొకరిది.
సరే, మా సీమవాసుల గోల వదిలేద్దాం. అది మాయని గాయం. నిత్యం సలుపుతున్న రాచపుండు. శ్రీబాగ్ ఒప్పందం అమలు విషయంలో అన్ని పార్టీలు చేసిన ద్రోహం అటుంచి, సీమను సస్యశ్యామలం జేసే కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు, వరుస యుద్ధాల మూలంగా బ్రిటీషర్లు మూలన పడవేసారనుకున్నా... ఆతర్వాత 1951 లోనే ప్రణాళిక సంఘం ఆమోదించిన, కోస్లా కమిటీ సిఫారసు చేసిన సిద్దేశ్వరం ప్రాజెక్టు, పెద్దన్నల కుట్రకు బలయ్యాయి. తమ నాగార్జున సాగర్ కు, అవసరమైనపుడల్లా నీరందించేందుకు శ్రీశైలం రిజర్వాయర్ అవసరం అయ్యింది. ఇంకేం కే ఎల్ రావు గారి సిఫారసు, రాజకీయ అవకాశవాది సంజీవరెడ్డి తలూపుడు , నాగార్జున సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం అయ్యింది.
ఇప్పుడు ఆ శ్రీశైలం రిజర్వాయర్ పెను ప్రమాదం ఎదుర్కొంటున్నది. అయితే ఈ ప్రమాద ఘంటికలు ఇప్పుడే మోగుతున్నాయనుకోవడం మన అమాయకత్వం. 1985-94 ల మధ్యకాలం నుండే అనేక అధ్యయనాలు ప్రాజెక్టు 6,7 గేట్ల కింద అరవై అడుగుల గొయ్యి (ప్లంజ్ పూల్ ) ఏర్పడిందని తేల్చాయి. 2009లో వచ్చిన భారీ వరద ఉద్ధృతి వల్ల డ్యాం మరింత దెబ్బతినిoది. 2012 నాటికి 98 అడుగులకు, ఇప్పుడు 140 అడుగులకు విస్తరించిందని నిపుణుల కమిటీ నివేదికలిచ్చాయి..దీనివల్ల డ్యాం పునాదులకు ప్రమాదమని నిపుణులు ఆనాడే చెప్పారు.(పాపం, నేటి ఏపి ముఖ్యమంత్రి గారు ఈ విషయం తనకెందుకు తెలపలేదని అధికారులను నిలదీసారట. 1995-99, ఆ తర్వాత కూడా 2014-19 ప్రభుత్వాధినేతగా తానున్నట్టు ఆయన కెవరు గుర్తు చేయాలో? అయినా అమరావతి-పోలవరం రెండు కళ్లుగా ఉండే వ్యక్తికి మిగతా ప్రాంతాల సమస్యల చూసేందుకు మూడో కన్ను ఎవరివ్వగలరు? ). ఇక జగన్ సరే సరి, రిపేర్లకై రూ.730 కోట్లతో ప్రతిపాదనలు కేంద్రానికి పంపితే మరోసారి సర్వే జరపమని కేంద్ర జలవనరుల కమీషన్ ఆ ప్రతిపాదనల తిప్పి పంపింది.
కేవలం సర్వే కోసం 10 కోట్ల నిధులు లేక, ప్రపంచ బ్యాంక్ సహాయం అర్థింoచాడట ఆనాటి మన యువ ముఖ్యమంత్రి. ఇక ఇప్పుడు ఈ మే నెలలో, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ సిఫారసు మేరకు, చీఫ్ ఇంజనీర్ విజయభాష్కర్ ఆధ్వర్యంలో కేంద్ర డిజైన్ సంస్థ రిజర్వాయర్ ను తనిఖీ చేసి నివేదికను తయారు చేసింది. అంతకు ముందు జాతీయ జల కమీషన్ భాధ్యులు పాండే ఒక నివేదికను సమర్పించారు. వారే గాక, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ, కేంద్ర జల కమీషన్, కేంద్ర శక్తి మరియు జల సంబంధ పరిశోధన స్టేషన్ లాంటి సంస్థలూ శ్రీశైలం రిజర్వాయర్ పరిస్థితులపై అధ్యయనం చేశాయి.
ఆ నివేదికలోని అంశాలు,( ప్లంజ్ పూల్ సమస్యతో పాటు)
1). శ్రీశైలం ఆనకట్ట దిగువ భాగాన అప్రోచ్ రోడ్డు కోతకు గురయ్యింది.
2). ఆనకట్ట స్పిల్ వే ఎదురుగా వున్న ఆప్రాన్ ముందు బండపరుపు కొంతమేరకు కొట్టుకుపోయింది.
3) ఆనకట్టకు ఇరువైపులా కొండచరియలు కోతకు గురయ్యాయి.
4) డ్యాం పునాదుల ధృఢపరిచేందుకు నిర్మించిన 62 కాంక్రీట్ సిలిండర్లలో 12 పూర్తిగా దెబ్బతిన్నాయి. 8 పాక్షికంగా దెబ్బతిన్నాయని దాదాపు 4 దశాబ్దాల కిందట నివేదికలిచ్చినా ఇంతవరకూ వాటిపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
5) డ్యాం 17,18 బ్లాకులలో పగుళ్ళు ఏర్పడ్డాయి.
6) శ్రీశైలం డ్యాంలోని 4,5,9,10 గేట్ల కింద పగుళ్ళు ఏర్పడ్డాయి.
7) డ్రైనేజి గుంతలు మూసుకు పోయాయి.
ఇదిలా ఉండగా ప్రభుత్వాలు జాతీయ సముద్ర శాస్త్ర అధ్యయన సంస్థ సమర్పించిన నివేదికను బయట పెట్టలేదు. దాని ప్రకారం ఆ గొయ్యి 200 అడుగులుగా ఉన్నట్టు తెలియవస్తోంది. ప్లoజ్ పూల్ ను నాలుగు స్తంభాల సిమెంట్, కాంక్రీట్ దిమ్మెలతో పూడ్చాలని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారి జైన్ సిపారసు చేశారు.
పై పనుల కోసం దాదాపు రూ.500 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. వెంటనే అప్రోచ్ రోడ్డు నిర్మాణం జరగాలని, ప్లంజ్ పూల్ పూడ్చివేతకు తగిన చర్యలు చేపట్టక పొతే రిజర్వాయర్ ఉనికికే ప్రమాదమని అన్ని కమిటీలు హెచ్చరించాయి.ఆ పనులు ఈ మే 31 నాటికల్లా పూర్తవ్వాలని సూచించాయి కూడా.
మరింత ఆలస్యంగా మేల్కొన్న ప్రభుత్వం అమరావతి-పోలవరం నుండి ఇప్పటికైనా పై విషయాలపై దృష్టి సారిస్తుందని ఆశిద్దాం.
ఇక ప్లంజ్ పూల్ లాగా తక్షణ ప్రమాదికారి గాకున్నా, దీర్ఘకాలంలో ప్రధాన సమస్యగా మారే పూడిక సమస్య కూడా వుంది. పూడిక వల్ల జలాశయపు నిల్వ సామర్థ్యం క్రమంగా తగ్గుతున్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. 1984 లో 308.21 టీఎంసీల సామర్థ్యమున్న శ్రీశైలం జలాశయం, మొదటి అధ్యయనంలో (2001-02) 40 టిఎంసిల నిల్వ సామర్థ్యం తగ్గిందని తేలింది.2009 నాటికి నిల్వ సామర్థ్యం మరో 52.36 టిఎంసిల తగ్గిందని ,దాంతో నీటి నిల్వ సామర్థ్యం 215.85 టీఎంసీలకు పడిపోయిందని అధ్యయనాలు తేల్చాయి.( టైమ్స్ ఆఫ్ ఇండియా జనవరి 3,2024).
అంటే ప్రతి సంవత్సరం 3.6944 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కోల్పోతున్నదన్నమాట. ( ఏటా 3.6944 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నట్లు 2009 సర్వేలోనే తేలింది. అంటే ఇప్పుడు 2025లో శ్రీశైలం డ్యాం కెపాసిటీ దాదాపు 160 టీఎంసీలే. ఈ విషయాన్ని కృష్ణా బోర్డు పరిగణలోకి తీసుకోకుండా.. పాత లెక్కల ఆధారంగానే 215 టీఎంసీలని పంపిణీ చేస్తోంది. ఇది వేరే విషయం) దీని వల్ల ప్రధానంగా నష్టపోయేది రాయలసీమ, దక్షిణ తెలంగాణా వాసులు మాత్రమే. నాగార్జున సాగర్ కు కేటాయించిన 260 టీఎంసీలకు ఢోకా లేదు.ఇక వాస్తవంగా కృష్ణా డెల్టాకు శ్రీశైలం జలాశయంతో అవసరమే లేదు.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం, దానికి కేటాయించిన 181.1 టీఎంసీలలో 101.1 టీఎంసీలు నాగార్జున సాగర్ దిగువ భాగాన లభించే జలాలు పోగా, మిగిలిన 80 టీఎంసీలను పట్టిసీమ నుండి ఇప్పటికే పొందుతున్నారు.(అయితే, ఆ 101 టీఎంసీలను శ్రీశైలం నుండి పొందేందుకు కేంద్ర జలవనరుల శాఖ నుండి అనుమతి పొందారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తలూపింది. అయితే,ఆ చీకటి ఒప్పందం ప్రజలకు తెలియదు.ఆ విధంగా తమవద్ద లభ్యమయ్యే 101 టీఎంసీలను నిల్వ చేసుకునేందుకు అవసరమైన రిజర్వాయర్ల నిర్మాణానికి ఖరీదైయిన భూములను వినియోగించాల్సిన అవసరం లేకుండా చేసాడు చంద్రన్న.రియల్ ఎస్టేట్ వ్యాపారమంటే అంత ఇష్టం మరి.)
అందువల్ల, పూడిక వల్ల నిల్వసామర్త్యం తగ్గినా, రిజర్వాయర్ కింది ప్రాంతాలకు లాభమే కానీ నష్టం కాదు. నిల్వ సామర్థ్యం తగ్గడంతో ఆ నీరంతా నాగార్జునసాగర్, కృష్ణా డెల్టాలకు లభిస్తుంది. ఇక మరిన్ని చేపల చెరువులు,రొయ్యల చెరువులూ తవ్వుకోవొచ్చు. అంతకు రెట్టింపు స్థాయిలో నీళ్లు సముద్రం పాలైనా సరే లెక్క లేదు. శ్రీశైల రిజర్వాయరు నిర్మాణంలోనే ఆ ముందు చూపు, పొందిక వుంది. ఇక శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా ఆధారపడ్డ సీమ ప్రాజెక్టులు ఎస్ ఆర్ బీసీ,తెలుగు గంగ, హంద్రీ-నీవా, గాలేరు- నగరి, చివరకు వెలిగొండ ప్రాజెక్టులు నీటికోసం నోళ్ళు తెరచి చకోర పక్షుల్లాగా వేచి ఉండాల్సి వస్తోంది.
ఇక తెలంగాణలో ఎస్ ఎల్ బీసీ, భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు లాంటి వాటికి సీమ ప్రాజెక్టుల గతే పడుతుంది. ఈ సమస్య నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ఇరు రాష్ట్రాల రాజకీయ పార్టీలూ ఇటు ఏపీ ఎక్కువ నీరు వాడుతున్నదని ఒకరంటే, తెలంగాణా నీటి దోపిడీ చేస్తోందని రాజకీయ పార్టీలు దుమ్మెత్తి పోసుకుంటాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే గత 30ఏళ్లలో సంవత్సరానికి సగటున 500 టీఎంసీలు, 2023-24 నీటి సంవత్సరంలో అత్యధికంగా 1900 టీఎంసిల , 2024-25 నీటి సoవత్సరంలో 870 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రం పాలయ్యాయి. వృధాగా సముద్రంపాలు అవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని గొంతెండిపోయేలా సీమ వాసులు మొత్తుకుంటున్నా ఈ బదిరాoధ పాలకులకు వినపడదు, కనపడదు. ఇలా ఎక్కువ నీరు వృధా కావడానికి శ్రీశైలం జలాశయపు నిల్వ సామర్థ్యం తగ్గడమూ ఒక కారణమని వేరే చెప్పాలా?
శ్రీశైలం డ్యాంలో ఏటేటా పెరుగుతున్న పూడికను నివారించడానికి సీమకు కేటాయించిన నీటిని సకాలంలో సీమ రైతులకు అందించడానికి శ్రీశైలం రిజర్వాయర్ పైభాగాన సిద్దేశ్వరం వద్ద ఒక అలుగు నిర్మించాలని ఒకరు కాదు ముగ్గురు ఇంజనీర్స్-ఇన్-చీఫ్ లు 1996 లోనే ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ముగ్గురు సాగునీటి రంగ నిపుణులు చేసిన సిఫారసును తుంగలో తొక్కి ఎవరో ఒక ఐఎఎస్ అధికారి మాటలు విని అలుగు నిర్మాణాన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేదు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణంతో,కేవలం కేవలం రాయలసీమకు కేటాయించిన నీటిని తగిన సమయంలో అందించడమే గాక, అక్కడినుండి తెలంగాణాకు నీరందించే ఎస్ ఎల్ బిసి ని తక్కువ ఖర్చుతో,తక్కువ సమయంలో ,టన్నెల్స్ తో పనిలేకుండా,అభయారణ్య సమస్యలేకుండా ఆ ప్రాజెక్టును నిర్మించి దక్షిణ తెలంగాణాకు నీరందించవచ్చని విశ్రాంత ఇంజనీర్ సుబ్బారాయుడు గారు ఒక సమగ్ర నివేదికను అటు సంభందిత తెలంగాణా అధికారులకు,ఇటు ఆంధ్రప్రదేశ్ అధికారులకు నివేదిoచినట్టు తెలుస్తున్నది.తెలంగాణా వైపునుండి అనుకూల స్పందన వచ్చినట్టు,వారు ఆ విషయమై ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరినట్టుగా తెలుస్తున్నది. ఇక మన రాష్ట్రప్రభుత్వ వైఖరేమిటో తెలియాల్సివుంది. అలుగు నిర్మించాలని కోరుతున్న ప్రదేశం లోనే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సంపన్న వర్గాల విహారయాత్రకి ఐకానిక్ బ్రిడ్జి కడుతున్నది. ఇలా వుంటుంది మన పాలకుల వర్గ దృష్టి.
పాలకులు సీమ నీటి సమస్యల పట్టించుకోండి అంటూ గత 9ఏళ్లుగా ఇక్కడి ప్రజాసంఘాలు ప్రతి మే 31 న సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకు స్థాపన పేరుతో ఆ ప్రదేశంలోనే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తూనే ఉంది. ప్రజలను చైతన్య పరుస్తూనే ఉంది. ఈ భగీరథ ప్రయత్నం తప్పక సఫలమవుతుంది. సీమ ప్రజల కల నెరవేరక తప్పదు.
(అరుణ్ విశ్రాంత అధ్యాపకులు, కన్వీనర్, రాయలసీమ విద్యావంతుల వేదిక, కర్నూలు)