
పండు దళారులకు, పుండు రైతులకు
చీనీ మార్కెట్ కష్టాలు
ఒక పక్క మార్కెట్ లో బంగారం ధర దగదగ లాడుతోంది. మరోవైపు టమోటా, మిర్చీ, ఉల్లి, మునగ, పత్తి, చీనీ, సపోటా, కళింగర, దోస ధరలు నేల చూపు చూస్తున్నాయి. ముఖ్యంగా పండ్ల మార్కెటులో సపోటా, చీనీ, జామ మార్కెటు లేదు . టమాట రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పండించిన టమాటకు ధర రాక దిగాలు పడే పరిస్థితి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో పలు మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఈసారి టమాట పంట ఎక్కువ దిగుబడి ఉంది. అయితే ప్రస్తుతం టమాట రైతుల పరిస్థితి అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. మార్కెట్టుకు తీసుకువచ్చిన టమాటా ధర కిలో రెండు రూపాయలు పడిపోవడంతో అక్కడక్కడ రైతులు రోడ్డుపై పారబోసి, పశువులకు మేతగా వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. రవాణా ఖర్చు విపరీతంగా పెరగడంతో సుదూర ప్రాంతాలల్లో మార్కెట్ కు సరుకు తరలించ లేక పోతున్నారు.
గత ఐదు సంవత్సరాల నుండి ధరల స్థిరీకరణ అనేది లేదు, అనంతపురం చీనీపండ్ల (Sweet Oranges) మార్కెట్ యార్డ్లో కమిషన్ వ్యవస్థను రద్దు చేయాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. అమ్మకాలను వేలం ద్వారా నిర్వహించాలని పలుమార్లు రైతుసంఘాలు విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు. ప్రస్తుత కమిషన్ పది శాతం నుంచి నాలుగు శాతానికి తగ్గించినప్పుడే రైతు బాగుపడతాడు. మార్కెట్లలో 'ఈనం వ్యవస్థ' (కమీషన్లు) కారణంగా నారింజ రైతులు నష్టపోతున్న ప్రభుత్వం చోద్యం చూస్తుంది. చిని మార్కెట్ యార్డ్ లో అమలులో ఉన్న 'ఈనం వ్యవస్థను' రద్దు చేసి , పులివెందుల మార్కెట్ యార్డ్ లో అనుసరిస్తున్న నమూనా ప్రకారం వేలం ద్వారా అమ్మకాలు నిర్వహించాలి.
ప్రస్తుతం చీనీ పళ్ల మార్కెట్లో డబుల్ సూట్ అని ఇరవై శాతం, తరుగు అని కొంత, అన్లోడింగ్ అని కొంత, మార్కెట్లో సెక్యూరిటీకి కొంత, వే బ్రిడ్జీ కొంత, వట్టికాయలకు కొంత తీసివేస్తే చివరికి రైతుకు మిగిలేది కొంతే. ఇంకా దుర్మార్గంగా రైతు అవసరాన్ని బట్టి తోటల దగ్గరే ముప్పై శాతం తగ్గించి స్పాట్ లో డబ్బు ఇచ్చి కొంటున్నారు. మార్కెట్లకు తరలించిన రైతులు నిర్ణీత సమయానికి రాలేక, వేలం పాటలు పాడలేక పోతున్నారు. మార్కెట్ యార్డులు దుర్భరంగా ఉండటం, కనీస సౌకర్యాలు లేక తిండి తిప్పలు దేవుడెరుగు. రైతుకు మాత్రం గిట్టుబాటు ధర లేక ధర పడిపోయిందని రైతులు గగ్గోలు పెడుతుంటే, మార్కెట్లో మాత్రం కొనే పరిస్థితి లేదు.
ఎన్నో కష్టాలు పడి టమాట సాగు చేస్తే మార్కెట్లో వ్యాపారులు మాయాజాలం ప్రదర్శించడం సరికాదని వాపోతున్నారు. రైతు నిర్ణయించాల్సిన ధరను వ్యాపారులు నిర్ణయం తీసుకోవడం ఏమిటి . రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అని బూటకపు మాటలు మాట్లాడుతున్న ప్రభుత్వాలు రైతుల సంక్షేమం గురించి పట్టించుకోకుండా సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరం టమోటా తో పాటు మామిడి పండ్లకు కూడా డిమాండ్ తగ్గిపోయింది. పండ్ల తోటల్లో మామిడి పంట చాలా ప్రముఖమైనది.
ప్రపంచం మొత్తంలో సగం వరకు మామిడి ఉత్పత్తి మన భారత దేశంలో జరుగుతోంది. మామిడి పండులో అధిక పోషకాలు, విటమిన్-ఎ, సి, అలాగే మంచి రుచి ఉండడం వలన, చాలా మంది ప్రజలు ఈ పండును ఇష్టపడతారు. అలాగే మామిడిలో కొన్ని ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. మామిడి పంటను చాలా మంది రైతులు ముఖ్యమైన ఉద్యాన వాణిజ్య వంటగా సాగుచేస్తున్నారు. మామిడిని మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రధానంగా కృష్ణా, ఖమ్మం, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, కరీంనగర్, విశాఖపట్నం, చితూరు, కడప, అదిలాబాదు, నల్గొండ జిల్లాల్లో సాగుచేస్తున్నారు.
మామిడిని పండించడానికి అన్ని రకాల నేలలు అనుకూలంగా ఉంటాయి. ఈ సంవత్సరం కాపు సంతృప్తికరంగా ఉన్నా మార్కెట్లో ధర లేకపోవడంతో, అకాల వర్షాలతో పంట దెబ్బతీసింది, అలాగే ఉన్న కోయకుండా చెట్టుపైన ఉన్న కాయలకు ఉజి ఈగ బెడద ఎక్కువగా ఉంది. నిండా కాపు ఉన్న చెట్టు కాయలు వెయ్యి నుంచి రెండువేల వరకు వ్యాపారస్తులు పెడుతున్నారు. మూడు వందల చెట్లకు మూడు లక్షలు మించడం లేదు. సంవత్సర కాలం కంటికి రెప్పలా చూసుకున్న కాపలాదారుడు జీతానికి సరిపోయేటట్లు ఉంది. రైతుకు పెట్టుబడి రాక చెట్లు తీసివేసే ప్రమాదం ఉంది.
గత దశాబ్ద కాలంగా కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్, ధాన్యం నిలువ చేసుకోవడానికి వేర్ హౌస్ లు లేక రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అసమర్థ రవాణా వ్యవస్థ కారణంగా పెద్ద మొత్తంలో కూరగాయలు పొలాలలో కుళ్ళిపోతున్నాయి. సరఫరా గొలుసు అనేది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వస్తువులను రవాణా చేయడం, దాని సంక్లిష్టతలు సాధారణ రవాణాకు మించినవి. సరఫరా గొలుసు వ్యవస్థ ఉత్పత్తి, పంపిణీ, డెలివరీతో సహా వివిధ దశలను కలిగి ఉంటుంది, ఇవన్నీ ఉత్పత్తులు తమ ఉద్దేశించిన గమ్యస్థానాలకు సమర్థవంతంగా చేరుకోవడానికి దోహదం చేస్తాయి. రైతు ఆత్మహత్యల సమస్య నిజానికి ఒక విషాదకరమైన సంక్లిష్టమైన సమస్య. ఇది సరఫరా గొలుసు సవాళ్లకు మాత్రమే పరిమితం కాకుండా బహుళ కారణాలచే ప్రభావితమవుతుంది. అస్థిరమైన మార్కెట్ ధరలు, అధిక ఇన్పుట్ ఖర్చులు, రుణం బీమాకు సరిపడా ప్రాప్యత, నీటి కొరత, పంట వైఫల్యాలు పరిమిత మార్కెట్ అవకాశాలు వంటి అనేక సవాళ్లను రైతులు ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లు, ఇతర సామాజిక, ఆర్థిక వ్యక్తిగత అంశాలతో కలిపి రైతు ఆత్మహత్యల బాధాకరమైన పరిస్థితికి దోహదపడతాయి. సరఫరా గొలుసు రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుండగా, రైతు ఆత్మహత్యలు విస్తృత వ్యవస్థాగత సమస్యలు వ్యక్తిగత పరిస్థితుల కలయిక నుండి ఉత్పన్నమవుతున్నాయి. వీటిని గుర్తించడం చాలా ముఖ్యం.
రైతు ఆత్మహత్యల సమస్యను పరిష్కరించడానికి వ్యవసాయ సంస్కరణలు, సామాజిక మద్దతు వ్యవస్థలు, మానసిక ఆరోగ్య అవగాహన, ఆర్థిక సహాయం స్థిరమైన వ్యవసాయ పద్ధతులతో సహా సమగ్రమైన బహుళ-డైమెన్షనల్ విధానాలు అవసరం. మెరుగైన మౌలిక సదుపాయాలు, మార్కెట్లకు ప్రాప్యత, సరసమైన ధరల విధానాలు సమర్థవంతమైన లాజిస్టిక్స్ వంటి వ్యవసాయ సరఫరా గొలుసును మెరుగుపరచడానికి చేసే ప్రయత్నాలు, రైతులు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లను తగ్గించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి.
రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వాలు తక్షణమే కోల్డ్ స్టోరేజి యూనిట్లు, మార్కెట్ సౌకర్యం, వేర్ హౌస్ నిర్మాణం చేపట్టాలి. రైతులు ధాన్యం నిలువ చేసుకోవడానికి గోదాములు గిడ్డంగులు ఏర్పాటు చేయాలి. రవాణా ఛార్జీలు, ఇతర నష్టాలను కలుపుకుని గతేడాది ఈ సీజన్లో కిలో పై ఐదు రూపాయలు వ్యయం పెరిగింది . ఈ ఏడాది మాత్రం రవాణాకు వేలు వెచ్చించినట్లు చెబుతూ ధరలు ఏక మొత్తంలో పెంచేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో దళారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.
రాయలసీమ ప్రాంతాల్లో కూరగాయల ధరలు పెరగడం సామాన్య, మధ్యతరగతి కుటుంబాలలో ఆందోళనలను రేకెత్తించింది. ధరల పెరుగుదల వల్ల నిత్యావసర కూరగాయలు అందుబాటులో లేకుండా పోయాయి. దీనివల్ల తగినంత, సరసమైన ఆహార సరఫరా అందుతుందనే ఆందోళనలు పెరుగుతున్నాయి.
మూడు సంవత్సరాలుగా వ్యవసాయ సాగు పనులు రెట్టింపు అయ్యాయి. గతంలో టమోటా నార వంద మొక్కలు అరవై రూపాయలు ఇప్పుడు వంద రూపాయలు. దుక్కి చేయడానికి, గట్లు చేయడానికి ఎకరాకు 1200 వ్యయం వచ్చేది ఇప్పుడు 2500 రూపాయలు. రవాణా, టోల్ చార్జీలు, కూలీల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏ పంట ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలిపే నాథుడే లేడు. వ్యవసాయ అధికారులు గణాంకాలు పూర్తిగా మరచి పోయారు. వ్యవసాయం జూదం గా మారింది.