లోకేశ్పైనే ఫోకస్
ఎన్డిఎ (NDA( కూటమి అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం (TDP) తొలి మహానాడు (Mahanadu) కడపలో ఘనంగా ముగిసింది.గతంలో రాయలసీమ (Rayalaseema) లో తిరుపతి (Tirupati)లో మాత్రమే మహానాడు వంటివి జరిగాయి.
కడప జిల్లాలో వైయస్ కుటుంబ అధికార పీఠం కనుక అక్కడ మహానాడు నిర్వహణే ఒక రాజకీయ సంకేతం.భారీ ప్రచారంతో సాగిన ఈ మహానాడు సభలు మొదలుకాకముందు నుంచే లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమిస్తారు అనే ప్రచారం మార్మోగింది.నాలుగో దఫా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకోవస్తున్నది.
43 ఏళ్ల తెలుగుదేశం, చంద్రబాబు భవిష్యత్ రాజకీయ గమనం ఎలా ఉంటుందనేది కీలకం అంశంగా ఉండింది. జగన్ ప్రభుత్వ తప్పిదాలపై తీవ్ర అసంతృప్తితో గెలిపించిన ప్రజలకు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాల అమలు పై మహానాడులో ఏం చెప్తారు అని సామాన్య జనం కూడా ఎదురుచూశారు. అట్టహాసాలు, ఆర్భాటాలు చాలా ఉన్నా ఈ అన్ని విషయాల్లోనూ అస్పష్టతనే మిగిలిస్తూ మహానాడు ముగిసింది.
రాష్ట్రానికి సంబంధించి గాని తెలుగుదేశం అంతర్గత వ్యవహారాలకు సంబంధించి గాని నిర్మాణాత్మకంగా నిర్దిష్టంగా చెప్పింది దాదాపు లేదు. మహానాడు మరునాడే చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాలోనూ, సిఐఐ వంటి వేదికలనూ చేసిన ప్రసంగాలలో ఏపీ బ్రాండ్ ఏదో మారిపోయి పెట్టుబడులో వరద కురుస్తున్న ప్రవహిస్తున్ట్టు తాను అద్భుతమైన పథకాలను రూపకల్పన చేసినట్టు మాట్లాడటం దీనికి కొసమెరపు. ఆయన చెబుతున్న వాటి వీటిని నికర ఫలితాలు మాత్రం ఇంకా రావలసే వుంది. అసలు ఆ విధానాల పూర్తి స్వరూపం, కాలవ్యవధి నిర్దిష్టరూపంలో అందుబాటులో లేవు.
లోకేష్ (Nara Lokesh) కు ప్రమోషన్ ఎప్పుడు ఎలా ఇస్తారు అన్నది పూర్తిగా తెలుగుదేశం పార్టీ అంతర్గత విషయమే. కావలసినంత ఎలివేషన్ అయిపోయిందని డిక్లరేషన్ మాత్రమే మిగిలిందని టిడిపి ముఖ్యులే అంటున్నారు. చంద్రబాబు నాయుడుని మరోసారి రెండేళ్ల కాలానికి అధ్యక్షుడిగా ఎన్నుకోవడంతో ఒక ఘట్టం పూర్తయింది. మిగిలిన నియామకాలకు ఆయనే ముహూర్తం నిర్ణయించుకుంటారు.
పదవులకు సంబంధించిన అంశాలు అలా ఉంచితే తెలుగుదేశం పార్టీ రాజకీయ విధానాలు, కూటమి ప్రభుత్వ పాలన విధానాలు మాత్రం ప్రజలందరికీ సంబంధించినవి.. కానీ ఆత్మ స్తుతి మోదీ స్తుతి, ఆర్భాటపు ప్రకటనలు మినహాయిస్తే ఆ విధమైన రాజకీయ ,పరిపాలనా నిర్దేశం ఏది కనిపించలేదు. విభజిత రాష్ట్ర వికాసం కోసం జరగాల్సింది చాలా వుంది. ఆర్థికంగా తీవ్ర లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన భారీ హామీలు అమలు చేయగలిగిన స్థితిలో లేదనేది సత్యం. అందుకోసం మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం అటు నుంచి కనీసం గట్టిగా అడిగే పరిస్థితిలో కూడా టిడిపి లేదు.
ఇప్పటికే ఏడాదిలో లక్ష కోట్ల పైన అప్పులు చేశారన్న విమర్శలు మోగుతున్నాయి.తొలి ఏడాదిపై కాగ్ ఇచ్చిన నివేదిక చూస్తే 95 వేల కోట్లు ప్రభుత్వ వ్యయం లోటు కనిపిస్తుంది. ఇంటి పన్ను కరెంటు చార్జీలు మోత మోగిస్తూ మోగిపోతున్నాయి. ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే చంద్రబాబు ఇచ్చిన నిర్వచనంతో తేడాలు ఉన్నాయి. కానీ వాటికి కూడా నిధుల కేటాయింపులు జరిగింది లేదు. పోలవరం 2027 కు పూర్తి చేస్తామని మహానాడులో చంద్రబాబు హామీ ఇస్తున్నప్పుడు ఈ ప్రశ్నలు రాకుండా ఉండవు.
అమరావతికి కేంద్రం సహకరించాలనేది విభజన చట్టం నిర్దేశం. కానీ మోదీ సర్కారు ప్రపంచ బ్యాంకు అప్పు ఇప్పించటమే ఘనతగా చెప్పడం తప్ప ఆ హామీ అమలు చేయమని అడిగే ఆలోచన కూడా లేకపోయింది. కేంద్రం బాధ్యతగా ఉన్న రెండు కీలక అంశాల్లోనే ఇంత తడబాటు ఉంటే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏదో సాధించి పెట్టడం ఊహకకందని విషయం.
అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం పేర మరో 4/5 వేల ఎకరాలు కావాలని ప్రకటించడం, అసలు రాజధానికే మరో పదివేల ఎకరాలు అవసరమవుతాయని చెప్పడం చూసి జనం నిర్ఘాంతపోతున్నారు.భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా మరింత భూమిని కేటాయించారు.ఉర్సా భూముల వ్యవహారాన్ని సమర్థించుకున్నారు.ఇలాచూస్తే చంద్రబాబు4.0 మళ్లీ హైటెక్ రోజులనే గుర్తు చేస్తున్నారని పరిశీలకులతో పాటు ఆపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
ఐదేళ్లు పాలించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చూపిన నిర్లక్ష్యం, మూడు రాజధానుల వంటి అస్తవ్యస్త నిర్ణయాలు తీవ్రంగా ఖండించవచ్చు. కానీ ఆ పేరుతో ప్రస్తుత అవసరాలను దాటవేయడం, కేంద్రం సహాయం పై ఒత్తిడి పెట్టకపోవడం ఎలా సమర్ధనీయం?
పొత్తులూ,కేసుల వంటి సొంత కారణాలవల్ల మోదీతో తెలుగుదేశం పోట్లాడటం కష్టం అనుకుంటే అప్పుడు అఖిలపక్ష వేదికల నుంచి రాష్ట్రం తరఫున వత్తిడి తేవడం సరైన మార్గం. అది విభజిత రాష్ట్రం హక్కు కూడా. మూడు రోజుల మహానాడులో అంతా మేము చూసుకుంటామనే ఊకదంపుడుతోనే సరిపోయింది. పరస్పరం పొగుడుకున్నది చాలక ఎన్టీఆర్ ఏఐ ఇమేజ్ తోనూ పొగిడించుకోవడం లేటెస్ట్. నిజంగా ఎన్టీఆర్ వారసత్వం చూస్తే అది లౌకికతత్వం, సమాఖ్య విధానం కోసం పోరాటమే.
అయోధ్యకు అద్వానీ రథయాత్ర, బాబ్రీ మసీదు విధ్వంసం అనంతరం ఎన్టీఆర్ బిజెపిని పూర్తిగా దూరంపెట్టారు.చంద్రబాబు రాజకీయ విధానం అందుకు పూర్తి రివర్స్, తను ప్రాక్టికల్ అనే పేరుతో యూ టర్న్లు పర్యాయపదంగా మార్చుకున్నారు.'కింగ్ మేకర్' (Kingmaker) గా అభివర్ణించబడే చంద్రబాబు నాయుడు నిజానికి ‘కింగ్బ్యాకర్’ మాత్రమేనని చరిత్ర చెబుతుంది. అప్పుడు వాజ్పేయిని, ఇప్పుడు మోదీని దేశం నెత్తిన కూచోవడానికి ఆయన ప్రధాన కారకులయ్యారు. అదే కొంతమంది దృష్టిలో ‘చక్రం తిప్పడం’. నిజానికి బిజెపి ఏనాడూ ఆయన పట్లా లేదా మరెవరి పట్ట గౌరవంగా వ్యవహరించింది లేదు. న్యాయం చేసిందీ లేదు.
హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతి బసు, విపి సింగ్ వంటి ఉద్దండుల అండదండతో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆయన నిజమైన అర్థంలో కేంద్ర రాజకీయాలలో గౌరవప్రదమైన పాత్ర పోషించ గలిగారు. బిజెపి ఎన్డిఎలకు దగ్గర అయినది వత్తాసు పలికే పాత్ర మాత్రమే. ఆయన మూడుసార్లు విజయం సాధించినప్పుడు బిజెపితో కలిసి ఉన్న మాట నిజమే కానీ రెండుసార్లు కూడా విడగొట్టుకోక తప్పలేదు. ఇప్పుడైనా పరిస్థితి అంతకంటే భిన్నంగా ఉంటుందా? ఉంటే పత్యేక హోదా తెరమరుగై పోతుందా?
అదలా వుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ , అమరావతికి మరింత సాయం, పోలవరం నిర్మాణం, సహాయ పునరావాస నిధులు ఇలాంటివి గట్టిగా అడిగితే తన అస్తిత్వానికే ముప్పు అని తెలుగుదేశం ఆందోళన. విశాఖలో జూన్ 21న మోదీ సమక్షంలో తలపెట్టిన యోగా దినోత్సవ ప్రహసనం దీనికి పరాకాష్ట. ఉద్యోగాంధ్ర బదులు యోగాంధ్ర హడావుడి చూస్తే మోదీ మెప్పుకోసం కూటమి తాపత్రయం తెలుస్తుంది.
చంద్రబాబు మోదీ స్తుతి వెనక రాజకీయం
ఈ పరిణామాలకు ఒక స్పష్టమైన రాజకీయ భూమిక వుంది. 2023 చివరలో చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో నిర్బంధించినప్పుడు ‘పెద్దమ్మ’, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మధ్యవర్తిత్వంతో లోకేష్ నేరుగా హోం మంత్రి అమిత్ షా తో మంతనాలు జరిపారు. ‘మహానాడు’కు ముందు , సకుటుంబంతో లోకేష్ మోదీని కలుసుకొని రావటం, తర్వాత చంద్రబాబు భేటీ ఇందులో భాగమే. టిడిపిలో సూపర్ సీనియర్లను నమస్కార బాణం వేసి మొత్తం సారథ్యం అంతా లోకేష్ బృందానికి అప్పగించటం వెనుక నేపథ్యం ఇది. కార్పొరేట్ సంబంధాలు ,పి4పి వంటివి చంద్రబాబు చూసుకుంటే మోదీ షాలతో రాజకీయ సంబంధాలను కొనసాగిస్తూ పార్టీని లోకేష్ నిర్వహిస్తారు అనేది ఇప్పుడు టిడిపి వర్గాలు చెబుతున్న మాట.
పరిపాలనలో కూడా లోకేష్ నిర్ణాయకంగా పట్టు సాగిస్తున్నారని అధికార వర్గాలు అంటున్నాయి. పెద్ద మెజారిటీతో ఎన్నికైన తెలుగుదేశం తరఫున ఆయన బండి నడిపించడం సహజమే. అయితే బిజెపి రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన జపం చేస్తుంటే లోకేష్ కూడా టిడిపిని అదే బాటలో వేగంగా నడిపించడం కొత్త పరిణామం.
అందుకే మొత్తం ‘మహానాడు’ లో ఎక్కడ లౌకిక తత్వం, మతసామరత్యం కాపాడుకోవడం వంటి మాటలే వినిపించలేదు. ఆ పార్టీ రాజకీయ తీర్మానంలో కూడా ఆ పదాలు లేవు.నిజానికి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ తన ‘హరిహరవీరమల్లు’ పేరిట తీస్తున్న సినిమా కూడా సనాతన ఫార్ములాలో ఔరంగజేబ్పై పోరాటం వంటి కథ కావడం యాదృచ్చికం కాదు. దానికోసం సినిమా థియేటర్లపై విరుచుకుపడటం మరో దారుణం.
ఇటీవలి కాలంలో దళితులు మహిళలపై దాడులు అనేకం జరిగాయి. తిరుపతి, ఉండి వంటిచోట్ల గుడిసెల కూల్చివేతలు, తెనాలిలో పోలీసుల థర్డ్డిగ్రీ తీవ్ర నిరసనకు దారితీశాయి.ఇలాటి అంశాలను చక్కదిద్దే ఆలోచనలేమీ మహానాడులో కనిపించలేదు. విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టి ఉద్యోగులకు ఉద్వాసన చెప్పి అనకాపల్లిలో స్టీల్ హబ్తో ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామనడం హాస్యాస్పదం.
మహానాడు తర్వాత వారం రోజుల్లో కడప ఫ్యాక్టరీ వచ్చేస్తుండనడం కూడా ఆలాటి ప్రచారమే. రాయలసీమ ప్రాజెక్టులు విస్మరించి ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో ప్రైవేటు రంగంలో 80 వేల కోట్లు ఖర్చయ్యే బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్ట్ గురించి చంద్రబాబు గొప్పగా చెప్పడమూ అలాటిదే.
ఈ సమయంలో జగన్ కూడా సంక్షేమ పథకాలు తాము అమలు చేస్తే టిడిపి వాగ్దాన భంగం చేసిందని విమర్శించడం తప్ప కేంద్రాన్ని స్పృశించడం లేదు. ఏపీలో వైసిపి టిడిపి,జనసేన, తెలంగాణలో బిఆర్ఎస్ నాలుగు ప్రాంతీయ పార్టీలు బిజెపి ముందు గప్ చిప్ కావడమే ఇక్కడ ఉమ్మడి అంశం. టిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత తమ పార్టీని బిజెపిలో విలీనం చేయడానికి కుట్ర జరిగిందని సంచలన ఆరోపణ చయడం ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇంత భారీ ‘మహానాడు’ సభ చివరలో ముఖ్యమంత్రి చంద్రబాబు 2019లో తమను ఓడించడం వల్లనే నష్టం జరిగిందని , వైకుంఠపాళీ వద్దని, పదేపదే చెప్పారు. ఇన్నేళ్లలో ఎప్పుడూ టిడిపి నేరుగా రెండవ పర్యాయం గెలవ లేదనేది ఒక చారిత్రిక వాస్తవం.రెండు సార్లు వరుసగా ఓడిపోవడం మాత్రంజరిగింది. ఆ భయమే ఆయనతో అలా మాట్లాడించిందా? ఆభయంతోనైనా కార్పొరేట్ రూట్ మార్చుకుని ప్రజానుకూల విధానాలు పెంచుతారా?