స్వాతంత్య్రం తర్వాత రాజకీయాలు ఎలా వక్రమార్గం పట్టాయంటే...
x

ఫోటో కర్టసీ: దళిత్ ఆవాజ్

స్వాతంత్య్రం తర్వాత రాజకీయాలు ఎలా వక్రమార్గం పట్టాయంటే...



జాతీయోద్యమంలో అనేక ప్రజా సమూహాలు పాల్గొన్నాయి. కాంగ్రెస్ పార్టీయే కాకుండా, అనేక పార్టీలు భావజాలాలు ఎక్కడికక్కడ ఉద్యమించాయి. వారందరికి స్వాతంత్ర్య ఫలాలు, అధికారంలో భాగస్వామ్యం అందిందా అనేది మౌలిక ప్రశ్న.

అందలేదనేది అందరికి తెలిసిన విషయమే. ఎందుకలా జరిగిందో పరిశీలిస్తే పలు కొత్త కోణాలు ముందుకు వచ్చాయి. సగం జనాభా అయిన బీసీలకు చట్టసభల్లో విద్యా, ఉద్యోగ రంగాల్లో రాజ్యాంగబద్ధంగా భాగస్వామ్యం కల్పించకపోవడం నుండి అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అసమానతలు పెరగడానికి కారణమయ్యాయి. 30 శాతం గల అగ్రవర్ణాలు, అగ్రకులాలు 70 శాతం అభివృద్ధిని, అధికారాన్ని, పరిపాలనా రంగాన్ని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఆక్రమించాయి.

1947 నాటికి అందరూ వ్యవసాయ ఆధారిత జీవితం గడుపుతుండేవారు. ఆధునిక అభివృద్ధి, అధికారం, ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు, వ్యాపారాలు , పరిశ్రమలలోకి అగ్రకులాలు , అగ్రవర్ణాలు విస్తరించాయి. చట్టాలు చేసే అధికారం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వాలు ఎవరి చేతిలో ఉన్నాయో వారు తమ వర్గాలను పెంచి పోషించారు. అలా రాజ్యాంగంలోని శాసన వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ మూడు మూల స్తంభాల్లో విపరీతంగా విస్తరించాయి. దాని ఫలితాలే అసమానతల అభివృద్ధి. కొందరు తరాలు గడిచిన కొద్ది వందల వేల , లక్షల కోట్లకు ఎదిగారు.

బిసి, ఎస్ సి, ఎస్టీలను అభివృద్ధిలో భాగస్వాములను చేయలేదు

చట్టసభల్లో బీసీలకు రాజ్యాంగబద్ధంగా ప్రాతినిధ్యం కల్పించి ఉంటే ఇటు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కలిసి 50 శాతం అభివృద్ధిని కైవసం చేసుకునేవారు. వీరి బలం శక్తి సామర్థ్యాలు సంఘటితంగా ముందుకు సాగి ఉండేవి. అన్ని రంగాల్లో దీని ప్రభావం విస్తరించి ఉండేవి. ఈ విషయం గమనించిన అగ్రవర్ణాలు, జవహర్లాల్ నెహ్రూ బీసీ రిజర్వేషన్లను , మహిళలకు సమాన హక్కులను వ్యతిరేకించారు. కాంగ్రెస్లో అవకాశం లేని కారణంగా ఎక్కడికక్కడ ప్రాంతీయ శక్తులు సంఘటితపడ్డాయి. ఇవి ఆయా ప్రాంతాల అగ్రకులాల నుండి ఎదుగుతూ వచ్చాయి. దాంతో బీసీ, ఎస్సీ , ఎస్టీలకు అనుకూలంగా కాకుండా , ఆయా ప్రాంతాల అగ్రకులాల అభివృద్ధికి అనుకూలంగా పరిణామాలు సాగాయి. ఇలా బీసీలకు రిజర్వేషన్లు లేకపోవడం వల్ల మొత్తం చరిత్ర పరిణామమే మారిపోయింది. ఈ విషయాలను ఈనాడు చర్చించకపోతే మరెప్పుడూ చర్చించలేరు.

నెహ్రూ, గాంధీజీలు కలిసి చేసిన మొదటి పొరపాటు గాంధీజీ జాతిపిత అని పేరు పొందడానికి ప్రధాన కారణం జవహర్ లాల్ నెహ్రూ. నెహ్రూ ప్రధానమంత్రి కావడానికి గాంధీజీ ప్రధాన కారణం. అందువల్ల నెహ్రూ గాంధీజీని జాతిపిత చేశాడు. రవీంద్రనాథ్ ఠాగూర్ న్ను బాగా ప్రశంసించడంతో సంభాషణలో మహాత్మాజీ అంటూ గాంధీజీని ఠాగూర్ ప్రశంసించడంతో మహాత్ముడయ్యాడు. తన చెప్పుచేతల్లో ఉండే నాయకత్వాన్ని గాంధీజీ కాంగ్రెస్లోలో మొదట్నుంచి ప్రమోట్ చేసుకుంటూ వచ్చాడు. అలా గాంధీజీ ఎందరినో వెనక్కి నెట్టాడు. ఈ విషయంలో అనేక పార్శ్వాల్లో గ్రంథాలు వెలువడ్డాయి. అలా సర్ధార్ వల్లభాయ్ పటేల్ , సుభాష్ చంద్రబోస్ వంటివారిని వెనక్కి నెట్టి భోగరాజు పట్టాభిసీతారామయ్యను , నెహ్రూను ముందుకు తెచ్చారు. గాంధీజీ. దేశంలో ఎవరూ కోరుకోకపోయినా నెహ్రూను ప్రధానమంత్రిగా ప్రతిపాదించారు గాంధీజీ.

ఇది చరిత్రలో జరిగిపోయిన పెద్ద పొరపాటు. ఇలా ప్రారంభమే ప్రజాస్వామ్య విలువలకు భిన్నంగా మొదలైంది. గాంధీ నెహ్రూ చేసిన రెండవ పొరపాటు స్వాతంత్ర్యం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని గాంధీజీ కోరారు. కాంగ్రెస్ అంటే మహాసభ అని అర్థం. అనేక శక్తులు ఒక లక్ష్యం కోసం ఒక్కటై కాంగ్రెస్లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ఎవరికి వారు వారి ప్రాధాన్యతలను అనుసరించి పార్టీలు ఏర్పడాలి. గాంధీజీ చెప్పిన ఈ మాట కాంగ్రెస్ నాయకులకు నచ్చలేదు. కాంగ్రెస్లో లోహియా సోషలిస్టులు, కమ్యూనిస్టులు తదితర శక్తులు కలిసి పనిచేశాయి. స్వాతంత్ర్యానంతరం వారు కాంగ్రెస్ నుంచి విడిపోయి స్వయంగా ఎదగడానికి కృషి చేశారు. స్వాతంత్య్రం తెచ్చిన కీర్తి మాత్రం కాంగ్రెస్ ఖాతాలో ఉండిపోవడం వల్ల కాంగ్రెస్కే ప్రజలు పట్టం కట్టారు. అయినప్పటికీ వెంటనే ప్రజలు మేలుకున్నారు. ఆయా పార్టీలు మేలుకున్నాయి. నైజాం రాజ్యంలో 1952 లో కమ్యూనిస్టులు మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. 1957 లో కేరళలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చారు. సోషలిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ పేదప్రజల్లో బలంగా వేల్లును కుంటున్నది. ఆ సమయంలో ఇందిరాగాంధీని పంపి కేరళ కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూల్చివేయించారు. ఇలా నెహ్రూ రెండవ పెద్ద పొరపాటు చేసి ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘించారు.

నెహ్రూ చేసిన మూడవ పొరపాటు

రెండుసార్లు ఎన్నికైన తర్వాత ఇక ఇంతకన్నా ఎక్కువసార్లు ఉండకూడదు అని అమెరికాలో రాజ్యాంగం సవరించినట్టుగా ఇండియాలో నెహ్రూ రాజ్యాంగాన్ని సవరించలేదు. ఇది మూడవ పొరపాటు. అలా సవరించి ఉ ంటే , ఎప్పటికప్పుడు కొత్త రక్తం రాజకీయాల్లోకి వచ్చేది. నాల్గవ పొరపాటు లాల్బహదూర్ శాస్త్రి చనిపోయిన తర్వాత సీనియర్ నాయకులైన మొరార్జీ దేశాయ్ , నిజ లింగప్ప , కామరాజ్ నాడార్ , నీలం సంజీవరెడ్డి వంటి వారిని కాకుండా ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ముందుకు తీసుకురావడం. అలా ఇందిరాగాంధీతో తిరిగి నెహ్రూ, గాంధీల వారసత్వం దశాబ్దాలుగా భారతదేశంలో కొనసాగడానికి కారణమైంది.
3 ఇలా నిజమైన అంతర్జాతీయ ప్రజాస్వామిక చూపును ప్రదర్శించలేక పోయారు నెహ్రూ. దేశీయంగా సగం జనాభాకు సంబంధించిన బీసీల విషయంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను ప్రదర్శించలేక పోయారు నెహ్రూ.

అంబేద్కర్ను వెనక్కి నెట్టిన నెహ్రూ

రాష్ట్రాల పునర్విభజన కోసం 1953 లో ఫజల్ అలీ కమిషన్ అదే సమయంలో బీసీల రిజర్వేషన్ల కోసం కాకా కాలేల్కర్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ రెంటికీ కమిషన్ ఛైర్మన్ గా ఎవరు ఉండాల్సింది? భారత రాజ్యాంగ నిర్మాత అయిన, న్యాయ శాఖామంత్రిగా పనిచేసి రాజీనామా చేసిన డా. బి.ఆర్ అంబేద్కర్ను ఈ కమిషన్ల ఛైర్మన్ గా ఉండాలని ఎందుకు కోరలేదో స్పష్టం. అంబేద్కర్ మేధోస్థాయిని అందుకోవడం తమకు అసాధ్యమని, ఆయన ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా త్వరలో ఎదుగుతాడనే భయం. నెహ్రూతో పాటు కాంగ్రెస్ వారిలో కొనసాగుతూ వచ్చింది. ఇలా రాజ్యాంగ సవరణతో బీసీలకు, మహిళలకు సమాన హక్కులు చేర్చుకోవచ్చులే అని నమ్మబలికిన వాళ్లే ఆ రాజ్యాంగ నిర్మాతకే, రాజ్యాంగ సవరణలు సూచించే అవకాశాలను
నిరాకరించారు.
బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు వ్యతిరేకించడం వల్ల ఏం జరిగింది? కులాల సమస్యను, కులాల ప్రాతినిధ్యాన్ని బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని, విద్యా ఉద్యోగ రంగాల్లో వారి ప్రాతినిధ్యాన్ని, రిజర్వేషన్లను వ్యతిరేకించుకుంటూ రావడంవల్ల ఏం జరిగింది? ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ కులాలు, ఆధిపత్యంలోకి వచ్చాయి. ఫెడరల్ రాజ్యాంగ నిర్మాణం ఆసరాతో అవి రాష్ట్రంలోనే కాకుండా, ఎంపీలను గెలుచుకొని కేంద్రంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగాయి. ఇలా ఫెడరలిజం బలపడింది. ఆయా ప్రాంతీయ కులాలు బలపడ్డాయి. కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నప్పటికీ ఇవి నిరంతరం పెరుగుతూ పోయాయి. చివరకు ప్రాంతీయ పార్టీలు , స్థానిక పార్టీలు కూడా కేంద్రంలో 50 కి పైగా పార్టీలు ప్రాతినిధ్యం పొందాయి. జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా కుదించుకుపోతూ వస్తుంది.1967 నాటికే ఈ విషయం స్పష్టమైపోయింది.

సగం రాష్ట్రాల్లో కాంగ్రేసేతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఇలా బీసీలకు చట్టసభల్లో విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టక పోవడం వల్ల పదిహేను నుండి ముప్పై శాతం వరకు గల ఆధిపత్య కులాలు 70-80 శాతం సమస్త అవకాశాలను ఆక్రమించాయి. తరలు గడుస్తున్నకొద్దీ మూడు నాలుగు తరాలు ఎదిగి వటవృక్షంలా స్థిరపడ్డారు. క్రమంగా ప్రాంతీయ శక్తుల ఆధిపత్యం కాల క్రమంలో ఆయా రాష్ట్రాల్లో బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాయి. అందుకు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సాహు మహరాజ్ , తమిళనాడులోని జస్టీస్ పార్టీ తదితరులు చేసిన కృషి స్ఫూర్తిగా అనిపించింది.

భూసంస్కరణలొచ్చాయి గాని రిజర్వేషన్లు రాలేదు

అయితే చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం, రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం పార్లమెంటు ద్వారానే సాధ్యం. కనుక ఆయా రాష్ట్రాల సంస్కరణలు, ఆయా రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికలకు, విద్యా, ఉద్యోగ ఉ పాధి రంగాలకు , భూ సంస్కరణలకు పరిమితం కావాల్సి వచ్చింది. భూ సంస్కరణలను న్యాయ వ్యవస్థలో తిష్ట వేసిన భూస్వామ్య అగ్రవర్ణ బ్రాహ్మణీయ శక్తులు ఆ చట్టాలను కొట్టివేశాయి. ప్రజల ఒత్తిడితో ఆ చట్టాలకు రక్షణ కల్పిస్తూ పార్లమెంటు వాటిని ఆమోదించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి కోర్టులు వీటిలో వేలు పెట్టకూడదని స్పష్టం చేశాయి. అలా కొంతమేరకు ఆయా రాష్ట్రాల భూసంస్కరణలు అమలులోకి వచ్చాయి. చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లు లేకపోవడం వల్ల ఆయా రాష్ట్రాల్లోని ఆధిపత్య కులాలు, జనాభా ఎక్కువ గల బీసీ కులాలు తమ ప్రాతినిధ్యాన్ని సాధించుకుంటూ ఎన్నికల్లో గెలుస్తూ వచ్చాయి. ఫెడరలిజం కొత్త రూపంలో విస్తరించింది.

అలా 1967 నాటికే సగం రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విడిపోయి ఇతర పార్టీలు అధికారంలోకి వచ్చాయి. తమిళనాడులో అన్నాదురై నాయకత్వంలో డిఎంకే పార్టీ అధికారంలోకి వచ్చింది. బెంగాల్లో జ్యోతిబసు నాయకత్వంలో సిపిఎం అధికారంలోకి వచ్చింది. బిహార్ లో కర్పూరీ ఠాకూర్, ఉత్తరప్రదేశ్లో రామ్ నరేష్ యాదవ్ తదితరులు లోహియా సోషలిస్టు పార్టీ ద్వారా అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీకి అనుకూలంగా చీలిపోయింది. మొరార్జీ దేశాయ్, నిజ లింగప్ప, నీలం సంజీవరెడ్డి వంటివారిని సిండికేట్ పేరిట సీనియర్ నాయకులను వదిలించుకున్నారు.

1971 లో పాకిస్తాన్తో యుద్ధం జరిపి బంగ్లాదేశ్ ఏర్పరిచి ఆ విజయోత్సాహంతో ఇందిరా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగలిగింది. ఇలా యుద్ధం ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి తోడ్పడింది. నరేంద్రమోడీ కూడా ఫుల్వామా సంఘటన కూడా అధికారంలోకి రావడానికి తోడ్పడింది. బిజెపి, ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులు, రామజన్మభూమి రథయాత్రలతో , ప్రచారంతో అధికారంలోకి వచ్చింది. ఇలా స్వాతంత్ర్యానంతరం ప్రజల నిజమైన సమస్యలను, నిజమైన దేశాభివృద్ధిని ప్రచారం చేసి ప్రజల హృదయాలను గెలుచుకొని అధికారంలోకి వచ్చిన క్రమం చాలా తక్కువ. ప్రజల సమస్యలను పట్టించుకున్న కమ్యూనిస్టులు ఎందుకో క్రమంగా నీరసించి పోయారు. దానికి కారణం బీసీల రిజర్వేషన్ల సమస్యను కుల సమస్యను, కుల వివక్షను ఒక భారతీయ ప్రధాన వాస్తవికతగా గుర్తించ నిరాకరించడం.

సోషలిస్టులు బీసీల సమస్యను, కుల సమస్యను గుర్తించడం వల్ల ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చారు. అదేక్రమంలో బిఎస్పీ కూడా అధికారంలోకి వచ్చింది. క్రమంగా ఉత్తరాదిలో కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది. దక్షిణాదిలో 1967 నుండి డిఎంకే, అన్నాడిఎంకే పార్టీలు ద్రవిడ ఉద్యమంతో బ్రాహ్మణేతర శక్తులు అధికారంలోకి వచ్చాయి. బీసీలను, కుల సమస్యను పట్టించుకోక పోగా, పరిష్కారాలను వ్యతిరేకిస్తూ వచ్చిన సిపిఎం 1967 నుండి బెంగాల్లో అధికారంలోకి వచ్చి దశాబ్దాలు గడిచినా, బీసీలకు చేసిందేమి లేదు. బీసీ నాయకత్వం కూడా ఎదగకుండా చేశారు. ఇలా క్రమంగా కమ్యూనిస్టులు తమ అస్థిత్వాన్ని కోల్పోయారు.

మండల్ కమిషన్ ఏర్పాటు

ఈ దశలో ఎక్కడికక్కడ చీలిపోతూ ఎదుగుతూ వస్తున్న చిన్న చిన్న పార్టీలు ప్రాంతీయ శక్తులు భాషా ప్రాతిపధిక శక్తులు, కుల ప్రాతిపథిక శక్తులు, బీసీలు, ఎస్సీలు నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతున్నారు. 1967 నాటికే ఇది ప్రారంభమైనప్పటికీ పాకిస్తాన్ యుద్ధంతో తిరిగి కాంగ్రెస్ నిలదొక్కుకుంది. తర్వాత జనతా పార్టీ 1977 లో అధికారంలోకి వచ్చింది. బీసీల కోసం బి.పి మండల్ కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వం తొందరలోనే కూలిపోవడంతో ఇందిరా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చింది.

1989 లో తిరిగి జనతాదళ్ అధికారంలోకి వచ్చిన తర్వాతే మండల్ కమిషన్ నివేదిక అమలు కోసం ముందుకు తేబడింది. దాంతో ప్రభుత్వం కూలిపోయింది. కోర్టుల్లో చర్చలతో 1993 లో ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లు. 2006 లో విద్యారంగంలో రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. అసలు విషయం భారత రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడం! ఈ విషయం ఇంకా మిగిలే ఉంది. అందువల్ల రెండవ స్వాతంత్య్ర పోరాటం లాగా బీసీ, ఎస్సీ , ఎస్టీలు కలిసి బీసీలకు రాజ్యాంగం ద్వారా చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఉ ద్యమించాల్సింది. కులగణన అందుకు ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు కదలాలి.

యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా, చైనా దేశాల్లో వలే పార్టమెంటులో, రాష్ట్ర శాసనసభల్లో సీట్లను నాలుగున్నర రెట్లు పెంచుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అందరికి అన్ని అవకాశాలు లభిస్తాయి. నియోజకవర్గాల పునర్విభజన అనేది ఈ దృష్టితో చేపట్టడం అవసరం. ఇక నుండి కులగణన రాజ్యాంగబద్ధంగా చేయడానికి అనువుగా సెన్సెస్ చట్టానికి, రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా శాశ్వత ప్రాతిపథిక ఏర్పర్చడం అవసరం. దాంతోపాటు రాష్ట్రాలు కూడా జనాభా లెక్కలు తీసే అధికారాన్ని కల్పించడం ద్వారా ఈ సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుంది. అందరికి సమాన అవకాశాలు లభించినప్పుడు కుల వ్యత్యాసాలన్నీ తొలగిపోతాయి. అన్ని కులాలు కలిసి ఒక్కటిగా క్రమంగా కలిసిపోతాయి. ఇలా కులగణన అనేది ఒక గొప్ప మార్పుకు దేశం సమస్థ రంగాల్లో ఎదగడానికి తొలిమెట్టుగా ఉపయోగపడుతుంది.


Read More
Next Story