
డెలివరీ చార్జీని పెంచిన Zomato..
ఒక్కో ఆర్డర్పై ప్లాట్ఫారం ఫీజును రూ. 2.40 మేర పెంచి, రూ. 14.90గా నిర్ణయించిన ఫుడ్ డెలివరీ సంస్థ
పెరుగుతోన్న ఇంధన ధరలు, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతోన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఫుడ్ డెలివరీ రంగంలో ఖర్చులు పెరిగాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో (Zomato) తన ప్లాట్ఫారం ఫీజును పెంచినట్లు ప్రకటించింది. గత సెప్టెంబర్లో చివరిసారిగా ప్లాట్ఫారం ఫీజును జొమాటో సవరించిన విషయం తెలిసిందే.
వినియోగదారుల నుంచి ఒక్కో ఆర్డర్పై వసూలు చేసే ప్లాట్ఫారం ఫీజును రూ. 2.40 మేర పెంచి, రూ. 14.90గా నిర్ణయించింది. ఇదివరకు ఈ ఫీజు రూ. 12.50గా ఉండేది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ మొత్తంపై జీఎస్టీ అదనంగా వేస్తారు.
జొమాటో ప్రధాన పోటీదారు Swiggy ప్రస్తుతం తన వినియోగదారుల నుంచి జీఎస్టీతో కలిపి సుమారు రూ. 14.99 ప్లాట్ఫారం ఫీజును వసూలు చేస్తోంది. దీంతో రెండు ప్రముఖ సంస్థల మధ్య ఫీజులో తేడా చాలా స్వల్పంగా ఉంది.
ఇక మూడో అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారం Magicpin మాత్రం ప్రస్తుతానికి తన ఫీజులను పెంచబోమని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ సంస్థ ఒక్కో ఆర్డర్పై సుమారు రూ. 14.20 ప్లాట్ఫారమ్ ఫీజును వసూలు చేస్తోంది.
పెరుగుతున్న ఖర్చులతో ఫుడ్ డెలివరీ రంగం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని మ్యాజిక్పిన్ సీఈవో, వ్యవస్థాపకుడు అన్షూ శర్మ తెలిపారు. అయినప్పటికీ, రెస్టారెంట్ భాగస్వాములకు మద్దతు ఇవ్వడం, వినియోగదారులకు సేవలందిచడమే లక్ష్యంగా ఫీజు పెంపును వాయిదా వేశామని పేర్కొన్నారు.
మొత్తం మీద ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఫుడ్ డెలివరీ సంస్థలు తమ ఫీజులను పెంచేశాయి. ఈ అదనపు భారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపై పడనుంది.

