’మీ భూమి... మీ హక్కు‘
x

’మీ భూమి... మీ హక్కు‘

ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.


మీ భూమి-మీ హక్కు.. ఇదీ రైతులకు, భూ యజమానులకు ప్రభుత్వం ఇచ్చే భరోసా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రైతులకు వివాదాల్లేని క్లీన్ డాక్యుమెంట్లు ఇచ్చే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని... ఆ దిశగానే భూముల రీ-సర్వే చేపడుతున్నామని సీఎం వెల్లడించారు. మండపేట నియోజకవర్గం, రాయవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు శుక్రవారం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన చంద్రబాబుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాయవరంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్య ఉన్న, మీ భూమి..మీ హక్కు పేరిటి రైతులకు రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. క్యూఆర్ కోడ్ ద్వారా తక్షణం భూమి వివరాలు తెలుసుకునేలా పట్టాదారు పాస్ పుస్తకాలను రెవెన్యూ శాఖ ముద్రించిందని రైతులకు సీఎం వివరించారు.

రైతులు, భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో ట్యాంపరింగ్ చేసేందుకు వీళ్ళేకుండా పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసినట్టు చెప్పారు. రీసర్వే పూర్తైన 6688 గ్రామాల్లోని భూములకు సంబంధించి 22.33 లక్షల పాస్ పుస్తకాలు ముద్రించగా... ప్రస్తుతం వాటిని పంపిణీ చేస్తున్నట్టు రైతులతో సీఎం చెప్పారు. రైతులు, భూ యజమానులకు తప్పుల్లేని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేసేలా అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. అనంతరం మీ భూమి- మీ హక్కు ప్రజావేదిక నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ...”పూర్వీకుల నుంచి సంక్రమించిన, స్వార్జితమైన భూమితో రైతులకు ఓ అనుబంధం ఉంది. కరోనా సమయంలో అంతా సెలవు తీసుకున్నారు. కానీ అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సెలవే లేదు. అలాంటి రైతులకు చెందిన భూ పత్రాల విషయంలో గత పాలకులు పాస్ పుస్తకాల జారీకి సంబంధించి అక్రమాలు చేశారు.

గత పాలకుల్ని, ప్రభుత్వాన్ని హెచ్చరించాను. కానీ వారి అహంకారం నెత్తికెక్కి మీ ఆస్తులపై ఆయన ఫోటో వేసుకున్నారు. పూర్వీకులు ఆర్జించిన భూమిపై నాటి పాలకుని ఫోటో ఏమిటి.? సరిహద్దు రాళ్లపై గత పాలకుని ముద్రలేమిటి? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటూ ఓ చట్టాన్ని తెచ్చి వాళ్లకు నచ్చిన వాళ్ల ఆధీనంలోకి తీసుకువచ్చేలా చేశారు. దీనిని గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించాను. మీ భూముల వివరాలన్నీ గత పాలకుల అనుచరులు అమెరికాలో పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి రాకపోతే ప్రజల భూములన్నీ కాజేసేందుకు కుట్రపన్నారు. నిన్నా మొన్నా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు చాలా ప్రమాదకరమైన ఆలోచన చేశారు. రైతుల భుంలపై వేరేవాళ్ల ఫోటోలెందుకని ప్రశ్నించాను. ప్రభుత్వంలోకి వచ్చాం... రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చాం.

గత పాలకులు తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ రెండో సంతకమే పెట్టాను. భూమి అనేది రైతుకు ఆస్తి మాత్రమే కాదు ఓ విశ్వాసం, కుటుంబంతో కలిసిపోయిన సెంటిమెంట్. గతంలో భూమి ఇవ్వకపోతే దానిని 22 ఏ రికార్డుల్లో పెట్టేశారు. అందుకే ప్రజలు ఆలోచించి సమయం వచ్చినప్పుడు చూద్దామని బ్యాలెట్ ద్వారా తగిన బుద్ధి చెప్పారు. ఏపీ ప్రాంతంలో ఉన్న రికార్డులు అన్నీ పక్కాగా ఉన్నాయి. తెలంగాణా ప్రాంతంలో ఎక్కువ భూవివాదాలే. మున్సబు, కరణాల వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్ రైతులకు, భూ యజమానులకు మేలు చేశారు. ఈ వ్యవస్థ రద్దైనప్పుడు తెలంగాణాలో పండుగ చేసుకున్నారు. గత పాలకుల తీరు కారణంగా ఎక్కడకు వెళ్లినా భూ వివాదాలకు సంబంధించిన పిటిషన్లే వస్తున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించేందుకు సంకల్పించి మీ వద్దకు వచ్చాను.”అని సీఎం చెప్పారు.

గ్రామ సభల్లో ఆమోదం... ఆ తర్వాతే పాస్ పుస్తకాలు...
“తహసీల్దారు కార్యాలయంలో కాదు... గ్రామసభలు నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించాను. ఎక్కడా మోసం జరక్కుండా, వివాదాలకు తావివ్వకుండా రాజముద్రతో మీ భూమి- మీహక్కు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాం. పద్దతి ప్రకారం రీసర్వే చేయించి.. రికార్డులు అన్నీ అత్యంత సురక్షితంగా ట్యాంపర్ చేయలేని విధంగా భద్రపరుస్తున్నాం. భూ రికార్డులు ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చెయిన్ టెక్నాలజిని వినియోగిస్తున్నాం. జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు మీ రికార్డు వచ్చేస్తుంది. ప్రభుత్వం ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకంతో మీ ఆస్తిపై మీకు పూర్తి భరోసా వస్తుంది. సర్వే చేసిన రికార్డులను మరోమారు తనిఖీ చేసి రైతులు చెప్పిన వివరాలు కూడా నమోదు చేసుకుంటున్నాం. ఈకేవైసీ పూర్తి అయ్యాకే పాస్ పుస్తకం ముద్రించి జారీ చేస్తాం. ఎక్కడా అవినీతి లేకుండా, పెత్తనం లేకుండా మీ భూమి - మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాలను గ్రామ సభ ద్వారా ఇస్తున్నాం. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేసే విషయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలి. క్షేత్రస్థాయి వరకూ రీసర్వే పూర్తైన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ జరగాలి. ఓ యజ్ఞం తరహాలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు, భూ యజమానులకు అందించాలని కోరుతున్నాం.
జారీ అయిన పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లితే నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఉన్నదే వివాదాలు పరిష్కరించడానికి. గత పాలకుడు రూ.660 కోట్ల సర్వే రాళ్లపై బొమ్మలు ముద్రించడానికి ఖర్చు పెట్టాడు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో వేసుకోడానికి రూ.22 కోట్లు ఖర్చు చేశారు. 77 లక్షల సర్వే రాళ్లపై అతని ఫోటో వేయించుకున్నారు. వాటన్నిటినీ సరి చేయించాం. ఆర్వోఆర్, ఎఫ్ లైన్ లాంటి రికార్డులను ప్రక్షాళన చేస్తున్నాం. బలవంతంగా 22ఏ జాబితాలో పెట్టేసిన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నాం. భూయజమానులకు ప్రయోజనం కల్పించేలా నాలా చట్టాన్ని రద్దు చేశాం. జాయింట్ కలెక్టర్ల వద్ద మాత్రమే ఉండిపోయిన కొన్ని అధికారాలను వికేంద్రీకరించాం. గతంలో కొందరు స్వార్ధంతో, లాలూచీ రాజకీయాలతో భూములు కొట్టేసేందుకు ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు మళ్లీ రీసర్వే చేసి 6688 గ్రామాల్లో గ్రామసభలు కూడా నిర్వహించాం. వివాదాలు పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. సబ్ డివిజన్ ఫీజు కూడా మాఫీ చేశాం. కుటుంబాల మధ్య తగాదాలతో ఆస్తుల వివాదాలు తలెత్తుతున్నాయి.”అని ముఖ్యమంత్రి చెప్పారు.
గోదావరి అందాలు... పర్యాటక ప్రాంతాలు
“పర్యాటకంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. జగ్గన్న పేట ప్రభల తీర్దాన్ని కూడా రాష్ట్ర పండుగగా ప్రకటించాం. సంక్రాంతికి కోడిపందెలు మన సంప్రదాయమే. కానీ జూదాలు వద్దు. మన వారసత్వాన్ని పరిరక్షించుకుందాం. జూదాల ద్వారా దానిని బలహీన పర్చుకోవద్దు. జగ్గన్న పేట ప్రభల ద్వారా శివుని ప్రతిరూపం. వాడపల్లి, కాట్రేని కోన, భీమవరం, నల్లజర్ల, మేదునూరు, ముమ్మిడివరం, మొగల్తూరు, పాలకొల్లు, గంగాలకురవు అగ్రహారం, పుల్లేటి కుర్రు ప్రభల ద్వారా మన సంస్కృతి పరిఢవిల్లుతోంది. ప్రకృతి, ప్రజల మధ్య ఉన్న బంధం ఈ ప్రభల ద్వారా వెలుగు చూస్తోంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించి వారసత్వాన్ని కాపాడుతున్నాం. చరిత్రలో నరకాసురుడిని వధిస్తే దీపావళి జరుపుకుంటున్నాం. నరకాసురుడి పాలన రాకూడదని.. మంచికి చెడుకి వ్యత్యాసం తెలుసుకునేలా ఈ దీపావళి చేసుకుంటున్నాం. భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని ఎంతో వేడుకగా నిర్వహించుకుంటున్నాం. ప్రకృతిని ఆరాధించటం మన సంప్రదాయం. గోదావరి పుష్కరాలను వరుసగా మూడో మారు సీఎంగా నిర్వహించే అదృష్టం నాకు వచ్చింది.”అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story