కోల్ కతా - అబుదాబీ విమానంలో బయటపడ్డ వికారుడు
x

సోర్స్: ఎథిహద్ ఎయిర్ వేస్

కోల్ కతా - అబుదాబీ విమానంలో బయటపడ్డ వికారుడు

తోటి ప్రయాణికురాలికి బూతు బొమ్మ చూపిన జిందాల్ గ్రూప్ ఉద్యోగి


అతనొక పెద్ద స్టీల్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్.పేరు దినేష్ కుమార్ సరోగి. కోల్ కతా నుంచి అబుదాబి విమానమెక్కాడు.అంతదాకా బాగానే ఉంది. అయితే, ఆయన పక్క సీట్లో ఒక మహిళ ఉంది. ఆమె వయసు 28 సంవత్సరాలు. అంతే, ఇతగాడి మనసులో దాక్కుని ఉన్న వికారుడు బయటకు వచ్చారు. మాట మాట కలిపి ఒక బూతు బొమ్మ చూపించాడు. అంతటి ఆగలేదు. ఆమెను తడిమే ప్రయత్నం చేశాడు. అయితే, అతగాడు అంతకు మించి ముందుకు పోలేదు గాని, అభాసు పాలయ్యాడు. ఈ సంఘటన జూలై 16 న జరిగింది. ఈ విషయాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకువెళింది. అబుదాబిలొ విమానం దిగగానే సరోగిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వెంటనే వదలిపెట్టారు. కారణం, ఆమె ఫిర్యాదు రాతపూర్వకంగా ఇచ్చేందుకు ఫోలిసుల దగ్గిరకు రాలేకపోయింది. అమెకు వెంటనే బోస్టన్ విమానం ఎక్కాల్సి ఉండటంతో ఆమె స్టేషన్ కు వెళ్లలేదు.

కాని, కోల్ కతా-అబుదాబి విమానంలో జరిగినదాన్నంతా ఆమె X లో వివరంగా పోస్టు చేశారు. శుక్రవారం నాడు ఈ పోస్టు వైరలయింది. దీనికి కంపెనీ చెయిర్ పర్సన్ స్పందించారు.




సరోగి ఉల్కాన్ గ్రీన్ స్టీల్ పెద్ద స్టీల్ కంపెనీలో సిఇవొ. ఈ సంస్థ జిందాల్ షదీద్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అనుబంధ సంస్థ. ఈ కంపెనీ ఇపుడు బిజెపి ఎంపి అయిన నవీన్ జిందాల్ ది.

ఆ మహిళ పేరు అనన్య.

అనన్య ట్వీట్ కు స్పందిస్తూ, ఈ విషయం మీద వెంటనే ఉన్నత స్థాయి దర్యాప్తు ఉంటుందని, చాలా కఠినమయిన చర్య ఉంటుందని నవీన్ జిందల్ హామీ ఇచ్చారు.

“ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకురావడమేకాదు, వెల్లడించాలనుకున్నందుకు ధన్యవాదాలు. ఎందుకంటే, నువ్వు చేసిన పని చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. జిందాల్ గ్రూప్ లో ఇలాంటివాటిని సహించేది లేదు,” అని జిందాల్ పేర్కొన్నారు.

సరోగి మీద ఎలాంటి చర్య తీసుకుంటారో తెలుసుకునేందుకు తాను ఎదురుచూస్తుంటానని ఆమె సమాధానం ఇచ్చారు.




ఈ లోపు బాంబే స్టాక్ ఎక్చేంజ్ కూడా దీనికి స్పందించింది. ఈ న్యూస్ గురించి వివరణ ఇవ్వాలని జిందల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ కు నోటీసు పంపిందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.

Read More
Next Story