
రాయలసీమ ప్రాజెక్టులపై వివక్ష ఎందుకు?
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు 2026–27 బడ్జెట్లో రూ. 8,000 కోట్లు కేటాయించాలని బొజ్జా దశరథరామిరెడ్డి డిమాండ్ చేశారు.
రాయలసీమ వ్యవసాయాభివృద్ధికి కీలకమైన SRBC, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీనీవా వంటి సాగునీటి ప్రాజెక్టులు నాలుగు దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ పూర్తికాకపోవడం దురదృష్టకరమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవసాయ యోగ్యమైన భూమిలో 42 శాతం రాయలసీమలో ఉన్నప్పటికీ, సాగునీటి నిధుల కేటాయింపుల్లో తీవ్ర అసమతుల్యత కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఆదివారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బొజ్జా మాట్లాడుతూ.. ప్రభుత్వ అంచనాల ప్రకారం రాయలసీమలో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల ఆధునీకరణకు సుమారు ₹60,000 కోట్ల రూపాయల నిధులు అవసరం ఉందని ఆయన తెలిపారు. అయితే గత పది సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు సగటున ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టింది కేవలం ₹1,508 కోట్ల రూపాయలు మాత్రమే అని వెల్లడించారు. ఈ విధంగానే నిధులు కేటాయిస్తే, ప్రాజెక్టు నిర్మాణ వ్యయాలు పెరగవు అని ఊహించినా కూడా రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావడానికి ఇంకా 40 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉందని అన్నారు.

