
వయనాడ్ బాధితులకు ఇళ్ల అప్పగింత
మొదటి దశలో 178 కుటుంబాలకు..
కేరళ రాష్ట్రం వయనాడ్లో గతంలో కొండచరియలు విరిగిపడడంతో ఇళ్లు కోల్పోయిన బాధితులకు ఫిబ్రవరి 25న కొత్త ఇళ్లను అప్పగించనున్నారు. దుర్ఘటన జరిగి 18 నెలల అనంతరం బాధిత కుటుంబాలకు కల్పెట్టా మునిసిపల్ పరిధిలోని టౌన్షిప్లో 178 ఇళ్లను కేటాయించనున్నారు. ఇక్కడ అన్ని మౌలిక వసతులతో 410 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో 100 ఇళ్లకు ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందింది. మరో 105 ఇళ్లకు IUML అర్థిక సాయం చేయగా.. కాంగ్రెస్ 100 ఇళ్లకు స్పాన్సర్ చేసింది. మొదటి దశలో 178 లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో ఇళ్ల కేటాయింపు జరిగింది. ఈ సందర్భంగా వారు భావోద్వేగానికి గురయ్యారు.
2024 జూలై 30న కేరళ వయనాడ్ జిల్లా ముండక్కై‑చూరల్మల్ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు కొండ చెరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 420 మంది మరణించగా.. 397 మంది గాయపడ్డారు. సుమారు 47 మంది కనిపించకుండా పోయారు. సుమారు 1500 ఇళ్లు నేలమట్టమయ్యాయి.

