
చెన్నైలో ఈసీ దాడులు: రూ. 77 కోట్ల విలువైన నగలు స్వాధీనం
టీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఘటన..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో భాగంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో చెన్నైలో భారీ స్థాయిలో నగలు స్వాధీనం చేసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోని ఫ్లయింగ్ స్క్వాడ్ మార్చి 26వ తేదీ రాత్రి చెన్నైలో తనిఖీలు నిర్వహించింది. అశోక్ నగర్ ప్రాంతంలో ఒక వాహనాన్ని ఆపి పరిశీలించగా, రూ. 77.29 కోట్ల విలువైన బంగారం, వెండి నగలు దొరికాయి. ఈ ఘటన టీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగింది.
సుమారు 381 కిలోల నగలను వాహనంలో తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వాహన డ్రైవర్ సరైన పత్రాలు చూపించలేకపోయాడు. దీంతో అనుమానం వ్యక్తం చేసిన అధికారులు అతడిని ప్రశ్నించారు. నగలను తరలిస్తున్న అసలు వాహనం టైరు పగిలిపోవడంతో వాటిని మరో వాహనంలో తీసుకెళ్తున్నానని డ్రైవర్ చెప్పాడు. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో అధికారులు నగలును స్వాధీనం చేసుకున్నారు.
తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
మొత్తంగా, ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిగేలా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలపై పరిశీలకులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

