బీజేపీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చేసింది: ఆప్ నేత సంజయ్ సింగ్
x

బీజేపీకి గుణపాఠం చెప్పే సమయం వచ్చేసింది: ఆప్ నేత సంజయ్ సింగ్

బెయిల్ పై బయటకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై విరుచుకుపడ్డారు.కాషాయ పార్టీకి గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని హెచ్చరించారు.


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల తర్వాత బుధవారం (ఏప్రిల్ 3) తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు. అవినీతి నేతలందరినీ చేర్చుకున్నామని చెబుతున్న కాషాయ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని సింగ్ పేర్కొన్నారు.

“ఆప్ ఎవరికీ భయపడదు. 2 కోట్ల మంది ఢిల్లీవాసులకు సౌకర్యాలు కల్పించాలనుకున్న (ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్) కేజ్రీవాల్, (మనీష్) సిసోడియా, (సత్యేందర్) జైన్‌ను జైల్లో పెట్టారు. మేమంతా కేజ్రీవాల్‌తోనే ఉన్నాం’’ అని బుధవారం అర్థరాత్రి ఆప్‌ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న సింగ్‌ పార్టీ కార్యకర్తలతో అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు. పదవికి రాజీనామా చేయరు. ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.

“కేజ్రీవాల్‌ను బిజెపి రాజీనామా చేయమంటోంది. ఉచిత విద్యుత్, నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మొహల్లా క్లినిక్‌లను ఎందుకు ఆపడం లేదని వారు అడుగుతున్నారు. నేను జైలులో గడిపాను... (ప్రధాని నరేంద్ర) మోడీ జీ కాన్ ఖోల్ కర్ సునో (జాగ్రత్తగా వినండి). ఆప్‌కి చెందిన ప్రతి నాయకుడు, వాలంటీర్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు అండగా ఉంటారు" అని సింగ్ చెప్పారు.



ఇది సంబరాలు చేసుకునే సమయం కాదని, జైలులో ఉన్న ఇతర పార్టీ నేతలు కూడా త్వరలోనే బయటకు రావడానికి మనమంతా కలిసి పోరాటం చేయాలని కోరారు.

"బంగారు జనతా పార్టీ"

మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా, ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్‌లతో సహా ఇతర ఆప్ నేతలను కూడా అరెస్ట్ చేయాలని బీజేపీ భావిస్తోందని సింగ్ చెప్పారు. అవినీతి కేసులో దోషిగా తేలిన బిజెపి మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ను ఉద్దేశించి బిజెపి అంటే "బంగారు జనతా పార్టీ" అని వ్యాఖ్యానించారు. ‘అతిపెద్ద అవినీతిపరులకు’ బీజేపీలో అత్యున్నత పదవులు ఇచ్చారని సింగ్ ఆరోపించారు.

సునీతా కేజ్రీవాల్‌ను కలిసిన సింగ్..

విడుదలైన తర్వాత, సింగ్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లి అక్కడ తన భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఆప్ షేర్ చేసిన వీడియోలో సింగ్ సునీతా కేజ్రీవాల్ పాదాలను తాకినట్లు కనిపించారు. కన్నీళ్లు తెప్పించే “నియంతల” పట్ల జాగ్రత్తగా ఉండాలని సింగ్ దేశ ప్రజలను కోరుతూ.. మంచి విద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తున్న కేజ్రీవాల్ కు మనమంతా అండగా నిలవాలని కోరారు.


“దేశ నియంత నా గొంతు వినగలిగితే. వినండి. మాది ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ. మీ బెదిరింపులకు మేం బెదరబోం’’ అని సింగ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆప్ కార్యకర్తలతో అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ భార్య కళ్లలో కన్నీళ్లు చూశానని, ఈ కన్నీళ్లకు ఢిల్లీలోని 2 కోట్ల మంది ప్రజలు బీజేపీకి సమాధానం చెబుతారని అన్నారు. “నేను వెళ్లి మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ కుటుంబాలను కలుస్తాను. వారు మాకు కుటుంబం వంటివారు. మేము వారితో ఉన్నాము, ”అన్నారాయన.

వాహనంపైకెక్కి..

బ్రౌన్ జాకెట్‌తో తెల్లటి కుర్తా-పైజామా ధరించిన సింగ్ జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆప్ కార్యకర్తలు సింగ్‌కు పూలమాల వేసి ఆహ్వానం పలికారు. తన మద్దతుదారులకు అభివాదం చేసేందుకు రాజ్యసభ సభ్యుడు తన వాహనంపైకి ఎక్కారు.

2023 అక్టోబరు 13 నుంచి ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. రాత్రి 8.11 గంటలకు గేట్ నంబర్ త్రీ ద్వారా బయటకు వచ్చాడు. బెయిల్ ప్రక్రియ పూర్తికావడంతో విడుదల చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.

జైలు వెలుపల పెద్ద సంఖ్యలో ఆప్ మద్దతుదారులు గుమిగూడి “ దేఖో దేఖో కౌన్ ఆయా, షేర్ ఆయా, షేర్ ఆయా ”.. “సంజయ్ సింగ్ జిందాబాద్” అంటూ నినాదాలు చేశారు. ఆయనపై గులాబీ రేకుల వర్షం కురిపించారు. ఆయన విడుదల సందర్భంగా జైలు వెలుపల భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇది పోరాడాల్సిన సమయం..

“అరవింద్ కేజ్రీవాల్, మా నాయకులను కటకటాల వెనక్కి నెట్టారు. ' యే జైల్ కే తాలే టుటేంగే హమారే సరే నేతా చూటేంగే ' (జైలు తాళాలు పగులగొట్టి మా నాయకులందరూ బయటకు వస్తారు) అని నాకు నమ్మకం ఉంది.

జైలు వెలుపల పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ, "ఇది వేడుక జరుపుకోవడానికి సమయం కాదని, పోరాడాల్సిన సమయం అని సింగ్ చెప్పారు. ఢిల్లీ కేబినెట్ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ కూడా జైలు వెలుపల ఉన్నారు. "మా ముగ్గురు నాయకులు జైలులో ఉన్నారు. కాబట్టి పార్టీ పోరాటం కొనసాగిస్తుంది" అని భరద్వాజ్ విలేకరులతో అన్నారు.

ఆప్ నాయకురాలు అతిషి విలేకరులతో మాట్లాడుతూ, “ఇది సత్య విజయం. నకిలీ ఎక్సైజ్ కేసుపై గత రెండేళ్లుగా విచారణ కొనసాగుతోంది. ED, CBI ఏ నాయకుడి నుండి ఒక్క పైసా అవినీతిని రికవరీ చేయలేదు. సింగ్ విడుదలతో యావత్ దేశం ముందు ఆప్ నిజాయితీ బయటపడిందని ఆమె అన్నారు. డబ్బు ఎక్కడని సుప్రీం కోర్టు ఈడీని పదే పదే అడిగిందని, అయితే వారి వద్ద ఎలాంటి సమాధానం లేకపోవడంతో సింగ్‌కు బెయిల్ మంజూరు చేసిందని అతిషి చెప్పారు.

కుటుంబంలో వేడుకలు లేవు..

అంతకుముందు సింగ్ వసంత్ కుంజ్‌లోని ఐఎల్‌బిఎస్ ఆసుపత్రిలో చేరారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత బెయిల్ ఫార్మాలిటీలను పూర్తి చేయడం కోసం తిరిగి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. మంగళవారం సింగ్ రెగ్యులర్ చెకప్ కోసం ఐఎల్‌బిఎస్‌కి తీసుకెళ్లారు. అతన్ని వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. ఆస్పత్రిలో ఉండగానే బెయిల్‌పై వార్తలు వచ్చాయి. ఇతర ఆప్ నేతలు ఇంకా జైల్లో ఉన్నందున కుటుంబంలో ఏ వేడుక జరుపుకోవడం లేదని భార్య అనితా సింగ్ తెలిపారు.

Read More
Next Story