
NCERT పుస్తకాన్ని బ్యాన్ చేసిన అత్యున్నత న్యాయస్థానం ..
న్యాయవ్యవస్థను కించపర్చేందుకు ప్రణాళికబద్దంగా జరిగిన కుట్రగా అభివర్ణించిన సీజేఐ
ఎన్సీఈఆర్టీ 8వ తరగతి పుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ అనే పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పుస్తకంలోని చాప్టర్పై నిషేధం విధించింది. దీనికి బాధ్యులెవరో కనుక్కోవాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.
"న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేయడానికి ప్రణాళికాబద్ధ కుట్ర జరిగినట్లు కనిపిస్తోంది. మేం లోతుగా దర్యాప్తు చేయాలనుకుంటున్నాం. ఎవరు బాధ్యులో కనుక్కుంటాం. మేం కేసును క్లోజ్ చేయం," అని CJI అన్నారు.
"పుస్తక ముద్రణ, పంపిణీపై నిషేధం విధిస్తాం. ఈ పుస్తకాన్ని ఫిజికల్గా లేదా డిజిటల్గా పంపిణీ చేసే ఏ ప్రయత్నానన్నయినా కోర్టు తీవ్రంగా పరిగణిస్తుంది,’’ అని పేర్కొన్నారు. ఇటువంటి విషయాలపై వెంటనే స్పందించకపోతే న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని NCERT డైరెక్టర్, పాఠశాల విద్యా కార్యదర్శికి అత్యున్నత న్యాయస్థానం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
NCERT బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో క్షమాపణ అనే పదం కూడా లేదని, బదులుగా సమర్థించుకునే ప్రయత్నం చేసినట్లుగా ఉందని SC తెలిపింది. బెంచ్ ఈ విషయాన్ని తదుపరి విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.

