మోదీపై పోటీచేస్తానంటున్న కమెడియన్..
x

మోదీపై పోటీచేస్తానంటున్న కమెడియన్..

ప్రధాని మోదీపై పోటీ చేయడమంటే అంత ఈజీ కాదు. కాని తాను పోటీ చేస్తానంటూ ప్రకటించారు ఓ హాస్యనటుడు. పేరు శ్యామ్ రంగీలా.


ప్రధాని మోదీపై పోటీ చేయడమంటే అంత ఈజీ కాదు. కాని తాను పోటీ చేస్తానంటూ ప్రకటించారు ఓ హాస్యనటుడు. పేరు శ్యామ్ రంగీలా.

ప్రధాని నరేంద్ర మోదీని అనుకరించడంలో పేరుగాంచిన హాస్యనటుడు శ్యామ్ రంగీలా వారణాసిలో ఆయనపై ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

రంగీలా సోషల్ మీడియాలో ఇలా పోస్టు చేశారు. “వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత.. మీ అందరి నుంచి నాకు లభిస్తున్నప్రేమను చూసి నేను సంతోషిస్తున్నాను. వారణాసి చేరుకున్న తర్వాత నా నామినేషన్, ఎన్నికల్లో పోటీ చేయడంపై నా అభిప్రాయాలను మీతో పంచుకుంటాను’’ అని షేర్ చేశారు.

అంతకుముందు పోస్ట్‌లో రంగీలా మాట్లాడుతూ.. "నేను వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు నామినేషన్‌ను ఉపసంహరించుకుంటారో ఎవరికీ తెలియదు." సూరత్, ఇండోర్ నియోజకవర్గాల్లో ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థుల ఉపసంహరణ, బీజేపీ అభ్యర్థులకు మార్గం సుగమం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. “నా అభ్యర్థిత్వం వారిలా ఉండకూడదనుకుంటున్నా. అందుకే ఈ వారం వారణాసి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నామినేషను దాఖలు చేస్తాను’’ అని పేర్కొన్నారు.

ప్రజల మద్దతు కోరుతున్న రంగీలా..

ఎన్నికలలో పోటీ చేసేందుకు మీ మద్దతు కావాలంటూ ప్రజలను కోరుతున్నారు రంగీలా. వారణాసి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాత ప్రజల నుంచి తనకు లభిస్తున్న ఆదరాభిమానాలు చూసి సంతోషిస్తున్నానన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియ గురించి తనకు తెలియదని, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజల సహకారం అవసరమని కోరారు. ఎలక్టోరల్ బాండ్స్‌పై బిజెపిపై విరుచుకుపడిన రంగీలా.. “నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి ఉత్సాహంగా ఉన్నాను. అందుకు మీ మద్దతు కావాలి. నా దగ్గర ఎలక్టోరల్ బాండ్లు కూడా లేవు. కాబట్టి నాకు కూడా కొంత నిధులు కావాలి.’’ అని కోరారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మొదలైన వాటి గురించి తనకు ఆందోళన లేదని చెప్పుకొచ్చారు. “నా ఖాతాలను చెక్ చేసినా ఏం లాభం ఉండదు. నేనే అసలైన ఫకీర్. జో ఝోలా ఉథా కర్ చల్ దేంగే జీ (నేనే అసలైన సన్యాసిని. నేను నా బ్యాగులు తీసుకుని వెళ్లిపోతాను)” అని పేర్కొన్నారు.

ఎవరీ రంగీలా..

పిలిబంగా (రాజస్థాన్)లోని మనక్తేరి గ్రామానికి చెందిన శ్యామ్ రంగీలా తన మిమిక్రీ కళాకారుడు. రాజకీయ నాయకుల గొంతును అనుకరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌లో ప్రధాని మోదీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని అనుకరించడం ద్వారా ఫేమస్ అయ్యాడు. 2017లో పీఎం మోదీ పాత్రతో అతని కెరీర్ ఊపందుకుంది.

ఈ ఎన్నికల్లో వారణాసి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం గురించి రంగీలా ఇటీవల తన సోషల్ మీడియా ఫాలోవర్లను అడిగారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రాజకీయాలకు రంగీలా కొత్తకాదని చెప్పాలి. ఎందుకంటే ఆయన మొదట 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించాడు.

ఒకప్పుడు మోదీ అభిమాని..

వాస్తవానికి రంగీలా మోదీ అభిమాని. 2014లో ప్రధాని మోదీకి అనుచరుడు. ఆయనకు మద్దతుగా ఎన్నో వీడియోలు చేశారు కూడా. “రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా కూడా వీడియోలు చేశారు. వాటిని చూసి నేను వచ్చే 70 ఏళ్లు బీజేపీకే ఓటేస్తానని చెప్తారు. అయితే గత పదేళ్లలో పరిస్థితులు మారాయి.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నా.’’ అని తెలిపారు.

Read More
Next Story