జూలై కల్లా రాష్ట్రమంతటా సంజీవని అమలు
x

జూలై కల్లా రాష్ట్రమంతటా సంజీవని అమలు

సంజీవని ప్రాజెక్టుపై సమీక్షలో అధికారులతో సీఎం చంద్రబాబు.


మెరుగైన ప్రజారోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సంజీవని ప్రాజెక్టుపై క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లా, కుప్పం, నారావారిపల్లెలో సమర్ధవంతంగా అమలవుతోన్న ప్రాజెక్టును జూలై కల్లా రాష్ట్రమంతటా అమలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో 56.40 లక్షల మందికి వైద్య పరీక్షలు జరపాలనే లక్ష్యాన్ని అధికారులకు సీఎం నిర్దేశించారు.

వైద్య పరీక్షల ఫలితాలను వాట్సప్ ద్వారా నేరుగా 48 గంటల్లో వారికి అందించాలన్నారు. అయితే ఇందుకోసం 904 మొబైల్ మెడికల్ యూన్సిట్ అవసరం కానున్నాయని, రూ.162 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు వివరించగా... ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేసుకున్నారని అధికారులు వివరించారు. మరోవైపు వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్‌లో వైద్య ఖర్చులు తగ్గేలా సేవలు అందించగలగాలని, ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి పెట్టాలన్నారు. యోగా, న్యూట్రిషన్, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి తప్పనిసరిగా అనుసరించడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం చెప్పారు. సంజీవని ప్రాజెక్టు అమలవుతున్న చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఏమేరకు మెరుగయ్యిందో పరిశీలించాలని సూచించారు.
త్వరలో యూనివర్సల్ హెల్త్ పాలసీ
మాతృత్వ, శక్తి, నైపుణ్యం, క్షేమ, సంజీవని... ఈ 5 పిల్లర్లతో త్వరలో ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ తీసుకురావాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ అమలుపైనా సీఎం సమీక్షించారు. యూనివర్సల్ హెల్త్ పాలసీలో భాగస్వామి అయ్యేందుకు పలు బీమా సంస్థలు ముందుకు వస్తున్నట్టు అధికారులు తెలిపారు. పీపీపీ విధానంలో చేపట్టదలచిన మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చర్చించారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా ఖాళీలు ఉండకూడదని, రేషనలైజేషన్ ద్వారా ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఫార్మసీ నెట్వర్క్, ల్యాబొరేటరీ ఇంట్రిగ్రేషన్ జరగాలన్నారు. అనారోగ్య సమస్యలు, అత్యవసరవ వైద్య పరిస్థితులు, వైద్య బృందం సూచనల మేరకు మాత్రమే గర్భిణులకు ఇకపై సిజేరియన్లు చేయాలని, మిగిలిన సమయంలో నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. 20 శాతానికి మించి సిజేరియన్లు జరిగితే ఆడిటింగ్ చేయాలన్నారు. సమీక్షలో వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, సంయుక్త కార్యదర్శి రోణంకి గోపాలకృష్ణ పాల్గొన్నారు.
Read More
Next Story