
కోల్కతా: లిఫ్ట్ ప్రమాదంలో పోలీసుల అదుపులో ఐదుగురు..
లోపాలపై చర్యలు తీసుకుంటామని కోల్కతా డిప్యూటీ మేయర్ అతిన్ ఘోష్ హామీ
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించిన ఘటనలో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు 40 ఏళ్ల అరూప్ బెనర్జీగా గుర్తించారు. లిఫ్ట్ అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో అతను అందులో చిక్కుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధితుడి తండ్రి అమల్ బెనర్జీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన రోజున లిఫ్ట్ మరమ్మతులో ఉండగా, అక్కడ ఆపరేటర్ లేడని, భద్రతా చర్యలు కూడా సరైన విధంగా లేవని కుటుంబ సభ్యులు ఆరోపించారు. లిఫ్ట్లో చిక్కుకున్న అరూప్ బెనర్జీని బయటకు తీసి అత్యవసర విభాగానికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతను మరణించాడు.
పోస్ట్మార్టం నివేదిక ప్రకారం.. ఛాతీ నలిగిపోవడం, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతినడం, చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరగడం వల్ల తీవ్ర గాయాలతో అతను మృతి చెందినట్లు తేలింది. ఈ ఘటనపై కోల్కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాష్ట్ర ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి నమూనాలను సేకరించింది. ఘటన సమయంలో ఆసుపత్రిలో విధుల్లో ఉన్న సిబ్బంది వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఉద్యోగులు, అధికారులతో కూడా విచారణ జరుపుతున్నారు. ఘటన సమయంలో అరూప్ బెనర్జీ తన నాలుగేళ్ల కుమారుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చినట్లు సమాచారం. అతని భార్య ట్రామా కేర్ యూనిట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై ఆసుపత్రి రోగుల సంక్షేమ కమిటీ ఛైర్మన్, కోల్కతా డిప్యూటీ మేయర్ అతిన్ ఘోష్ స్పందించారు. ఈ ఘటనకు కారణమైన లోపాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

