ఎవరీ పుట్టా మహేష్ యాదవ్? ఎందుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు?
x
పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఏలూరు ఎంపీ

ఎవరీ పుట్టా మహేష్ యాదవ్? ఎందుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారు?

చంద్రబాబు ప్రభుత్వం డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించిన వేళ టీడీపీ ఎంపీ ఒకరు ఈ వ్యవహారంలో చిక్కుకోవడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది..


హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పేరు ప్రముఖంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల పరిధిలోని అజీజ్‌నగర్‌లోని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అతిథి గృహం (ఫామ్ హౌస్) శనివారం రాత్రి ఒక హై-ప్రొఫైల్ డ్రగ్స్ పార్టీకి వేదికైంది. ఆ పార్టీలో దొరికిన ప్రముఖుల్లో ఈ మహేష్ కుమార్ యాదవ్ ఉన్నారు.

ఎవరీ పుట్టామహేష్ కుమార్ యాదవ్?

పుట్టా మహేష్ కుమార్ ప్రస్తుత లోక్ సభ సభ్యుడు. ఏలూరు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన అతి పిన్న వయస్కుల్లో ఈయన ఒకరు .

1988 ఏప్రిల్ 10న జన్మించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో పుట్టారు. తల్లిదండ్రులు పుట్టా విజయలక్ష్మి, పుట్టా సుధాకర్ యాదవ్ . ఈయన తండ్రి తెలుగుదేశం పార్టీ టికెట్ పై మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ ఛైర్మన్ కూడా.
మహేష్ కుమార్ హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) నుంచి సివిల్ ఇంజనీరింగ్ పట్టాపొందారు.
పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకి స్వయనా అల్లుడు. రామకృష్ణుడి కుమార్తె దివ్యను మహేష్ కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ బంధుత్వం కారణంగానే పుట్టా కుటుంబానికి, యనమల కుటుంబానికి మధ్య రాజకీయంగా, వ్యక్తిగతంగా బలమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి.
రాజకీయ వారసత్వం, అండ
మహేష్ కుమార్ రాజకీయాల్లోకి రావడంలో, 2024 ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా టికెట్ దక్కించుకోవడంలో యనమల రామకృష్ణుడి పాత్ర కీలకమని రాజకీయ వర్గాల్లో ప్రతీతి.
మహేష్ కుమార్ తండ్రి పుట్టా సుధాకర్ యాదవ్ (టీటీడీ మాజీ చైర్మన్), యనమల రామకృష్ణుడు ఇద్దరూ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా ఉన్నారు. ఈ వియ్యం ద్వారా రాయలసీమ (కడప జిల్లా), కోస్తా (తూర్పు గోదావరి) ప్రాంతాలకు చెందిన ఇద్దరు బలమైన బీసీ నాయకుల కుటుంబాలు ఏకమయ్యాయి.
నిజానికి పుట్టా కుటుంబం కడప జిల్లాకు చెందింది అయినప్పటికీ, వ్యూహాత్మకంగా ఆయనను ఏలూరు ఎంపీగా బరిలోకి దింపడంలో యనమల వ్యూహం ఉందనే చర్చ జరిగింది.
గతంలో మీడియాలో వచ్చిన కొన్ని వార్తల ప్రకారం తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయికిరణ్ యాదవ్‌తో మహేష్ కుమార్‌కు వ్యాపార సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి కొన్ని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిస్టిలరీ కంపెనీల్లో (ఉదా: TSYPMK Infrastructure) భాగస్వాములుగా ఉన్నట్లు సమాచారం.
వ్యాపార సంబంధాలు చాలా ఎక్కువే...
మహేష్ కుమార్ కేవలం రాజకీయ నాయకుడే కాకుండా పెద్ద వ్యాపారవేత్త కూడా. ఆయనకు అనేక రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఈయన PSK ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ & ప్రాజెక్ట్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ ఇరిగేషన్, రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది.
దాదాపు 10కి పైగా కంపెనీల్లో (PVL మైన్స్ అండ్ మినరల్స్, నాంది కన్స్ట్రక్షన్స్‌ వంటివి) ఈయన డైరెక్టర్‌గా లేదా భాగస్వామిగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
మొయినాబాద్ ఘటనలో వెల్లడైన సమాచారం ప్రకారం, రాజస్థాన్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే నితీష్ శర్మతో కూడా ఈయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మహేష్ కుమార్‌కు పార్టీలో, వ్యాపార రంగంలో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి.
కడప జిల్లాకు చెందిన వారైనప్పటికీ, రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఏలూరు ఎంపీగా పోటీ చేసి గెలవడంలో స్థానిక నేతలతో కూడా బలమైన సంబంధాలను ఏర్పరుచుకున్నారు.

ఈయన అటు రాజకీయంగా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు వంటి అగ్రనేతలకు దగ్గరగా ఉండటమే కాకుండా, వ్యాపారపరంగా ఇతర రాష్ట్రాల నేతలతోనూ సంబంధాలు కలిగి ఉన్నారు.
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ప్రాంతంలో వివాదాస్పద నావల్ డిపో ఏర్పాటుకు పెద్దఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీసుల మెరుపు దాడి...
పక్కా సమాచారంతో ఈగల్ టీమ్, ఎస్‌ఓటీ (SOT) పోలీసులు జరిపిన ఈ దాడిలో పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబడ్డారు. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు లోక్‌సభ సభ్యుడు పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రాజస్థాన్ (జైపూర్) మాజీ ఎమ్మెల్యే నితీశ్ శర్మ, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, మరికొందరు వ్యాపారవేత్తలు (వర్గనేని రమేష్, శ్రవణ్ కుమార్, విజయకృష్ణ తదితరులు) పోలీసుల అదుపులో ఉన్నారు.
ఉత్కంఠ రేపిన గాలిలోకి కాల్పులు
సోదాల సమయంలో ఫామ్ హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సివిల్ డ్రెస్‌లో ఉన్న పోలీసులను చూసి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారనే ఆందోళనతో, అక్కడ ఉన్న యువకులు పోలీసులను అడ్డుకున్నారు. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిద్ మిశ్రా, రితేష్ రెడ్డికి చెందిన తుపాకీతో గాలిలోకి నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టి, కాల్పులు జరిపిన తుపాకీని, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
సోదాల్లో భారీగా కొకైన్, ఇతర మత్తు పదార్థాలు, విదేశీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా మరో ఐదుగురు కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, ఇతరులను తదుపరి పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మహేష్ కుమార్‌కు నెగటివ్ వచ్చిందని సమాచారం ఉన్నప్పటికీ, తాజా పోలీసు విచారణలో ఆయన పాత్రపై లోతైన దర్యాప్తు జరుగుతోంది.
ఏపీలో కలకలం రేపిన మహేష్ వ్యవహారం..
ఈ కేసులో పుట్టా మహేష్ కుమార్ పేరు ఉండటం టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంయుక్తంగా డ్రగ్స్ పై యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ఎంపీ ఒకరు ఈ మురికిలో ఇరుక్కోవడం గమనార్హం. ఆయన అటు రాయలసీమ ఇటు కోస్తా జిల్లాలకు చెందిన బలమైన రాజకీయ నేతల కుటుంబ సభ్యుడు కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More
Next Story