100 మంది మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్, స్ట్రిప్‌టాక్ రట్టు
x

100 మంది మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్, స్ట్రిప్‌టాక్ రట్టు

తెనాలి కేంద్రంగా సాగుతున్న నయా డిజిటల్ వ్యభిచారాన్ని పోలీసులు గుట్టు రట్టు చేశారు.


సాంస్కృతిక కేంద్రంగా వెలుగొందే తెనాలి పట్టణంలో సభ్య సమాజం నివ్వెరపోయే చీకటి దందా వెలుగులోకి వచ్చింది. ’స్వీటీ..క్యూటీ‘ అనే ఆకర్షణీయమైన కోడ్ పేర్లతో, ఆన్‌లైన్ వేదికగా సాగుతున్న హైటెక్ న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు. చెంచుపేటలోని ఒక అద్దె ఇల్లు కేంద్రంగా, గుట్టుచప్పుడు కాకుండా రెండేళ్లుగా సాగుతున్న ఈ అశ్లీల సామ్రాజ్యంలో దాదాపు వంద మంది మహిళలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు మహిళా నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బయటపడ్డ ఈ స్ట్రిప్‌టాక్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.

ఏమిటీ ఈ స్ట్రిప్‌టాక్ దందా?
టెక్నాలజీని అడ్డం పెట్టుకుని సాగుతున్న ఈ అశ్లీల వ్యాపారానికి స్ట్రిప్‌టాక్ అనే ఆన్‌లైన్ పోర్టలే ప్రధాన వేదిక. నిర్వాహకులు ఈ సైట్‌లో స్వీటీ .. క్యూటీ వంటి ఆకర్షణీయమైన మారుపేర్లతో ప్రొఫైల్స్ సృష్టించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లను ఆకర్షిస్తుంటారు. ఈ దందాలో అత్యంత విచిత్రమైన అంశం ఏమిటంటే.. తొలుత ముఖానికి మాస్క్‌లు ధరించి, కేవలం మాటలతోనే కస్టమర్లను ఊరిస్తారు. ఆన్‌లైన్ ద్వారా నగదు చెల్లింపులు (పేమెంట్స్) పూర్తయిన మరుక్షణమే మాస్క్‌లు తొలగించి, నగ్నంగా వీడియో కాల్స్‌లో కనిపిస్తూ లైవ్ స్ట్రీమింగ్ నిర్వహిస్తారు. దేశం కాని దేశంలో ఎక్కడో కూర్చున్న విదేశీయులను సైతం తమ వలలో వేసుకుంటూ, నిమిషాల వ్యవధిలోనే వేల రూపాయలు దండుకుంటున్న ఈ డిజిటల్ వ్యభిచారం ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలను బయటపెడుతోంది.
డబ్బు ఆశ చూపించి మహిళలకు వల
ఈ అశ్లీల సామ్రాజ్య విస్తరణకు నిర్వాహకులు ఎంచుకున్న ఆయుధం.. మనీ పవర్. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మధ్యతరగతి మహిళలను, విలాసాలకు అలవాటు పడిన యువతులను వీరు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఎవరికీ తెలియదు, బయటకు రానవసరం లేదు.. కేవలం ఒక గదిలో ఉండి వీడియో కాల్‌లో కనిపిస్తే చాలు.. గంటలోనే వెయ్యి రూపాయలు మీ సొంతం అంటూ ఆశల వల విసురుతున్నారు. ఇలా సులువుగా డబ్బు సంపాదించవచ్చనే ప్రలోభంతో అమాయక మహిళలను ఈ రొంపిలోకి దించుతున్నారు. తెనాలి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన సుమారు 80 నుంచి 100 మంది మహిళలు వీరి నెట్‌వర్క్‌లో ఉన్నారన్న వార్త ఇప్పుడు పట్టణాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రతిరోజూ పక్కా ప్లాన్ ప్రకారం ఒకరిద్దరిని అద్దె ఇంటికి పిలిపించి, ఈ దందా నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో దిమ్మతిరిగే నిజాలు వెలుగుచూశాయి.
వెనుక ఉన్న టెక్ మాస్టర్ మైండ్ ఎవరు?
ముగ్గురు మహిళలు దీనిని నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ ముగ్గురు మహిళా నిర్వాహకులకు 45 నుండి 60 ఏళ్ల వయస్సు ఉండటంతో, ఇంతటి హైటెక్ దందాను వారు ఒంటరిగా నడిపించడం అసాధ్యమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆన్‌లైన్ పోర్టల్స్ నిర్వహణ, విదేశీ కస్టమర్లతో డీలింగ్స్, డాలర్లలో వచ్చే పేమెంట్స్, ఇతర సాంకేతిక వ్యవహారాల వెనుక ఎవరో ఒక టెక్ మాస్టర్ మైండ్ ఉన్నట్లు పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. కేవలం తెర వెనుక ఉండి ఈ డిజిటల్ నెట్‌వర్క్‌ను ఆపరేట్ చేయడమే కాకుండా, మహిళలను కారులో సీక్రెట్‌గా అద్దె ఇంటికి తీసుకురావడంతో పాటుగా నగదు పంపిణీ వంటి పనులన్నీ ఒక యువకుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ టెక్నికల్ గురువు కోసం పోలీసులు గాలింపును తీవ్రం చేశారు. అతను దొరికితేనే ఈ రాకెట్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఎన్ని ఏళ్లుగా ఈ అరాచకం సాగుతోంది? అనేది నిగ్గు తేలనుంది.
Read More
Next Story