2029 నాటికి మహిళా రిజర్వేషన్ అమలు: ప్రధాని మోదీ స్పష్టీకరణ
x

2029 నాటికి మహిళా రిజర్వేషన్ అమలు: ప్రధాని మోదీ స్పష్టీకరణ

16వ తేదీ నుంచి పార్లమెంట్‌లో చర్చ


Click the Play button to hear this message in audio format

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కీలక ప్రకటన చేశారు. 2029 నాటికి ఈ చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ‘నారీ శక్తి వందన సమ్మేళనం’లో ఆయన ప్రసంగించారు.

మహిళా రిజర్వేషన్ అమలుకు గడువును నిర్ణయించామని, ఆ గడువులోగా దీనిని పూర్తి చేయడం ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని తెలిపారు. “మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2029 నాటికి ఏ పరిస్థితుల్లోనైనా అమలు చేయాలన్న ఏకగ్రీవ డిమాండ్ కూడా ఉంది. మేం 2029 గడువును దృష్టిలో ఉంచుకుంటున్నాం. దీనిపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంటులో సమగ్ర చర్చ జరగబోతోంది. ఈసారి కూడా ఈ పని పరస్పర సహకారంతో, భాగస్వామ్యంతో జరగాలన్నదే మా ప్రయత్నం, మా ఆకాంక్ష,” అని మోదీ పేర్కొన్నారు.

పార్లమెంట్‌లో చర్చ..

ఈ అంశంపై ఏప్రిల్ 16 నుంచి పార్లమెంట్‌లో విస్తృత చర్చ జరగనుందని, అన్ని పార్టీల సహకారంతో చట్టాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. “అందరి సమిష్టి కృషితో, సభ గౌరవం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ప్రతి పార్టీ రాజకీయాలకు అతీతంగా ఎదిగి, మహిళల ప్రయోజనం కోసం ఈ ముఖ్యమైన పనిని చేపట్టినందుకు దేశంలోని ప్రతి మహిళ కూడా సంతోషిస్తుంది,” అని ప్రధాని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 21వ శతాబ్దంలో అత్యంత కీలక నిర్ణయాల్లో ఒకటిగా మోదీ అభివర్ణించారు. “21వ శతాబ్దపు ముఖ్యమైన నిర్ణయాలలో ఇది ఒకటి అని నేను చాలా బాధ్యతగా చెప్పగలను. ఈ నిర్ణయం నారీ శక్తికి అంకితం,” అని అన్నారు.

సామాజిక న్యాయాన్ని బలోపేతం చేయడంలో ఈ చట్టం కీలకమని ఆయన పేర్కొన్నారు. “సమానత్వ భారతదేశం కోసం ఒక తీర్మానం. సామాజిక న్యాయం కేవలం ఒక నినాదంగా కాకుండా, మన పని సంస్కృతిలో, మన నిర్ణయ ప్రక్రియలో ఒక సహజ భాగంగా ఉండాలి,” అని తెలిపారు.

దశాబ్దాలుగా కొనసాగుతున్న మహిళా రిజర్వేషన్ చర్చకు ఇది ముగింపు దశ అని ప్రధాని పేర్కొన్నారు. “ఈ చర్చ దాదాపు 4 దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇందులో అన్ని పార్టీల, అనేక తరాల కృషి ఉంది. ప్రతి పార్టీ ఈ ఆలోచనను తమదైన రీతిలో ముందుకు తీసుకువెళ్ళింది,” అని ప్రధాని అన్నారు.

Read More
Next Story