
వ్యవసాయం, విద్యారంగంలో AI వినియోగం అవసరం
ప్రధాని మోదీ
వ్యవసాయం, ఆరోగ్యం, విద్య రంగాల్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన AI, డీప్టెక్ స్టార్టప్ల సీఈవోలు, వ్యవస్థాపకులతో జరిగిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ అవసరాలకు అనుగుణంగా AIను అభివృద్ధి చేయాలని మోదీ సూచించారు. అలాగే తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. Unified Payments Interface (UPI)ను ఉదాహరణగా చెబుతూ దేశీయ సాంకేతికతపై విశ్వాసాన్ని పెంపొందించాలని కోరారు.
వ్యవసాయ రంగంలో పంట ఉత్పాదకత పెంపు, నేల సంరక్షణ, ఎరువుల వినియోగ పర్యవేక్షణలో AI కీలక పాత్ర పోషించగలదని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. వాతావరణ ప్రమాదాలను అంచనా వేయడంలో జియోస్పేషియల్ సాంకేతికత ఉపయోగకరమని చెప్పారు.
ఆరోగ్య రంగంలో రోగ నిర్ధారణ, జన్యు చికిత్స, రోగి డేటా నిర్వహణ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన వైద్యం అందించవచ్చని తెలిపారు. విద్యలో భారతీయ భాషల్లో ఉన్నత విద్య అందించేందుకు AI సాధనాలను అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
సైబర్ భద్రత, నైతిక AI, అంతరిక్ష రంగం, న్యాయ వ్యవస్థ ఆధునీకరణ వంటి విభాగాల్లో పనిచేస్తున్న స్టార్టప్ల ప్రతినిధులు తమ ఆవిష్కరణలను వివరించారు. భారత్లో AI రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోందని వారు తెలిపారు.
దేశం AI ఆవిష్కరణల్లో ప్రపంచ స్థాయిలో ముందుకు సాగుతోందని స్టార్టప్లు అభిప్రాయపడ్డాయి. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి పి.కె. మిశ్రా, శక్తికాంత దాస్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొన్నారు.

