Pawan Kalyan
x

'నిర్మలమ్మా.. ఇటువంటి బడ్జెట్ నీకే సాధ్యమమ్మా'

ఉప ముఖ్యమంత్రి మెచ్చుకోలు, వికసిత భారత్ ఇక వేగమన్న పవన్ కల్యాణ్


ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026–27 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సంస్కరణల ఆధారితంగా, యువతను ప్రేరేపించేలా ఈ బడ్జెట్‌ను రూపొందించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అభినందనలు తెలిపారు.
ఈ బడ్జెట్ వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉపాధి కల్పన, ఆవిష్కరణ, నగర ఆర్థిక ప్రాంతాలు, హైస్పీడ్ రైలు కారిడార్ల వంటి కీలక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వృద్ధికి కొత్త ఊపునిస్తుందని చెప్పారు. ప్రధాన కేంద్రాలను అనుసంధానించే హైస్పీడ్ రైలు లింక్‌ల అభివృద్ధి వల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడి లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని వివరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అరుదైన భూమి కారిడార్లు, తూర్పు తీర పారిశ్రామిక కారిడార్, ప్రజా మూలధన వ్యయం, మత్స్యకార అభివృద్ధి, తీరప్రాంత లాజిస్టిక్స్ వంటి రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఇవి రాష్ట్రంలో పెట్టుబడుల పెరుగుదలకు, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలకు, సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని అన్నారు.
రాష్ట్రాలకు సాధికారత కల్పించడం, మధ్యతరగతిని బలోపేతం చేయడం ద్వారా స్వావలంబనతో కూడిన భారతదేశ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Read More
Next Story