ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె
x

ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు దేశవ్యాప్త సమ్మె

పానిక్‌ బటన్‌ అమరిక వల్ల ఏర్పడిన ఆర్థిక భారానికి నిరసనగా ఆందోళన


అక్రమ బైక్‌ ట్యాక్సీ సేవలు, ఇష్టారాజ్యంగా ఛార్జీల నిర్ణయం, అలాగే పానిక్‌ బటన్‌ అమరిక వల్ల ఏర్పడిన ఆర్థిక భారానికి నిరసనగా ఓలా, ఉబర్, రాపిడో డ్రైవర్లు శనివారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సమ్మె వల్ల ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో ప్రభావం పడే అవకాశం ఉంది.

యాప్‌ ఆధారిత ట్యాక్సీ, ఆటోరిక్షా డ్రైవర్ల సంఘాలు శనివారం సమ్మె నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా పానిక్‌ బటన్‌ అమరికపై ఉన్న సమస్యలు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ సమ్మె చేపట్టినట్లు వారు తెలిపారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాల్లో ఈ సమ్మె ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నిరసనను “ఆల్‌ ఇండియా బ్రేక్‌డౌన్”గా పిలుస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి డ్రైవర్లు తమ యాప్‌లను ఆఫ్‌ చేస్తారని సంఘాలు తెలిపాయి. ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్‌లపై ఆధారపడే ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలగవచ్చని డ్రైవర్‌ సంఘాలు హెచ్చరించాయి.

పానిక్‌ బటన్‌ అమరికపై నిరసన

మహారాష్ట్ర కామ్గార్‌ సభ విడుదల చేసిన ప్రకటనలో, అక్రమ బైక్‌ ట్యాక్సీ సేవలు , ఓలా, ఉబర్, రాపిడో వంటి సంస్థలు ఇష్టారాజ్యంగా ఛార్జీలు నిర్ణయించడంపై నిరసనగా ఫిబ్రవరి 7న దేశవ్యాప్త ఒకరోజు సమ్మె నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
పానిక్‌ బటన్‌ తప్పనిసరిగా అమర్చాలనే నిబంధన వల్ల డ్రైవర్లపై భారీ ఆర్థిక భారం పడుతోందని డ్రైవర్ సంఘాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పానిక్‌ బటన్‌ పరికరాల కంపెనీలు 140 ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిలో సుమారు 70 శాతం కంపెనీలను అనధికారికమైనవిగా ప్రకటించిందని పేర్కొంది.
దీంతో ఇప్పటికే అమర్చిన పరికరాలను తొలగించి, కొత్త పరికరాలు అమర్చేందుకు సుమారు రూ.12,000 ఖర్చు చేయాల్సి వస్తోందని, ఇది డ్రైవర్లకు తీవ్ర ఆర్థిక కష్టాలను కలిగిస్తోందని పేర్కొన్నాయి.

ఇష్టారాజ్య ఛార్జీల వ్యవస్థ

ఈ సమ్మెకు నేతృత్వం వహించిన తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ (TGPWU), కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీకి లేఖ రాసింది. యాప్‌ ఆధారిత రవాణా కార్మికులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆ లేఖలో పేర్కొంది.
అలాగే ఓపెన్‌ పర్మిట్‌ విధానం కారణంగా ఆటోరిక్షాల సంఖ్య పెరగడంతో తమ ఆదాయం తగ్గుతోందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ బైక్‌ ట్యాక్సీల వల్ల జరిగే ప్రమాదాల్లో గాయపడిన వారికి బీమా ప్రయోజనాలు కూడా దక్కడం లేదని ఆరోపించారు.
ఓలా, ఉబర్, రాపిడో, పోర్టర్‌ వంటి యాప్‌ సంస్థలకు ప్రభుత్వ నిర్దేశిత ఛార్జీ విధానం లేకపోవడాన్ని కూడా యూనియన్ తప్పుబట్టింది. ఈ సంస్థలు తాము కోరిన విధంగా ఛార్జీలు నిర్ణయిస్తున్నాయని పేర్కొంది.
2025 అగ్రిగేటర్‌ మార్గదర్శకాలు ఛార్జీలు నిర్ణయించే ముందు గుర్తింపు పొందిన కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపాలని స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవడం లేదని TGPWU వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్‌ సలావుద్దీన్‌ అన్నారు. దీనివల్ల యాప్‌ సంస్థలు కార్మికులపై మరింత దోపిడీ చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
Read More
Next Story