
ఏపీ సమాచార కమిషన్కు కొత్త సారథులు
ముఖ్య కమిషనర్తో పాటు నలుగురు సభ్యులకు చోటు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్ (APIC) లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కీలక నియామకాలను ప్రభుత్వం పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్తో పాటు మరో నలుగురు సమాచార కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ముఖ్య సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు నియమితులయ్యారు. వీరితో పాటు కమిషనర్లుగా మరో నలుగురు ప్రముఖులకు అవకాశం దక్కింది. వి శరత్చంద్ర కల్యాణ చక్రవర్తి, గాజుల ఆదెన్న, ఒంటేరు రవిబాబు, పరవాడ సింహాచలం నాయుడులను సమాచార కమిషనర్లగా నియమించారు. నియమితులైన కమిషనర్లు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మూడేళ్ల పాటు లేదా వారికి 65 ఏళ్లు నిండే వరకు (ఏది ముందైతే అది) పదవిలో కొనసాగుతారు. సమాచార హక్కు చట్టం (RTI) నిబంధనల ప్రకారం వీరు పారదర్శకంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. చీఫ్ కమిషనర్కు నెలకు రూ. 2,50,000/- , ఇతర కమిషనర్లకు రూ. 2,25,000/- చొప్పున వేతనం ఉంటుంది. వీరికి ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు వర్తించే అలవెన్సులు కూడా అందుతాయి. చాలా కాలంగా కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో RTI కింద పెండింగ్లో ఉన్న వేలాది అప్పీళ్లు , ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నియామకాలతో మార్గం సుగమం కానుంది. నూతన కమిషన్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న కేసులపై దృష్టి సారించనుంది.

