
నాగ్పూర్ పేలుడు: ఎస్బిఎల్ ఎనర్జీ డైరెక్టర్ల అరెస్ట్, 21 మందిపై కేసు
ఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్
నాగ్పూర్లోని ఎస్బిఎల్ ఎనర్జీ లిమిటెడ్ యూనిట్లో ఆదివారం ఉదయం జరిగిన భారీ పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఈ దుర్ఘటనలో కనీసం 20 మంది మృతి చెందగా, దాదాపు 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో సంస్థకు చెందిన తొమ్మిది మంది డైరెక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. మరో 21 మంది వాటాదారులపై కేసు నమోదు చేశారు.
నాగ్పూర్కు సుమారు 35 కి.మీ దూరంలోని కల్మేశ్వర్ తాలూకా రౌల్గావ్ గ్రామంలోని ఎస్బిఎల్ ఎనర్జీ గోలాబారుద తయారీ యూనిట్లో ఉదయం 6 గంటలకు ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో సుమారు 35 మంది కార్మికులు, ఇద్దరు సూపర్వైజర్లు విధుల్లో ఉన్నారు. ప్రమాదం జరిగి మంటలు త్వరగా విస్తరించడంతో మృతదేహాలు గుర్తించలేనంతగా కాలిపోయా. వారి డీఎన్ఏ నమూనాలను సేకరించి కుటుంబసభ్యలకు అందజేయనున్నారు. 2023లో కూడా ఈ సంస్థకు చెందిన యూనిట్లో పేలుడు జరిగి 9 మంది చనిపోయారు.
ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దర్యాప్తునకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికీ రూ. 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నారు.

