
కిడ్నాప్ కేసులో ఇరుక్కున్న మోహన్బాబు..హైకోర్టు రియాక్షన్
ముందస్తు బెయిలు మంజూరు చేస్తుందా? లేక విచారణకు సహకరించాలని ఆదేశిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కలెక్షన్ కింగ్, మోహన్బాబు యూనివర్సిటీ ఛాన్స్లర్ మంచు మోహన్బాబుకు ఒకవైపు చట్టపరమైన చిక్కులు చుట్టుముట్టగా, మరోవైపు న్యాయస్థానం నుంచి ఊరట లభించింది. తిరుపతి జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన విద్యార్థి నేతల కిడ్నాప్ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం మోహన్బాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏప్రిల్ 16 వరకు నో యాక్షన్
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ కేసులో మోహన్బాబుకు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పించారు. ముందస్తు బెయిలు పిటిషన్పై తుది నిర్ణయాన్ని ఈ నెల 16న వెల్లడిస్తామని స్పష్టం చేస్తూ, అంతవరకు మోహన్బాబుపై ఎలాంటి కఠినమైన లేదా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి ఆయనకు అరెస్టు ముప్పు తప్పినట్లయింది.
అసలేం జరిగిందంటే?
ఫిబ్రవరి నెలలో తిరుపతిలోని మోహన్బాబు యూనివర్సిటీలో జరిగిన కొన్ని పరిణామాలు ఈ వివాదానికి దారితీశాయి. యూనివర్సిటీలోని సమస్యలపై నిలదీసిన విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేసి, వారిని వేధించారంటూ ఎస్ఎఫ్ఐ (SFI) నాయకుడు రెడ్డికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా తిరుచానూరు పోలీసులు మోహన్బాబును నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేయడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.
రాజకీయ కుట్ర అంటున్న న్యాయవాది
హైకోర్టులో మోహన్బాబు తరఫున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి బలమైన వాదనలు వినిపించారు. విద్యార్థి నేతల కిడ్నాప్ వ్యవహారానికి, మోహన్బాబుకు అసలు ఎలాంటి సంబంధం లేదని కోర్టుకు విన్నవించారు. కేవలం రాజకీయ కారణాలతో లేదా ఇతర దురుద్దేశాలతోనే ఆయన పేరును ఈ కేసులో కావాలని ఇరికించారని వాదించారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, పోలీసుల దూకుడుకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.
అందరి దృష్టి ఆ రోజే..
ప్రస్తుతానికి హైకోర్టు ఆదేశాలతో మోహన్బాబు ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఈ నెల 16న వెలువడనున్న తుది తీర్పు అత్యంత కీలకంగా మారింది. కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేస్తుందా? లేక పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశిస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ బెయిలు లభించకపోతే మంచు కుటుంబానికి ఇది పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Next Story

