
మంత్రి ఆదేశాలు గాలికి, గ్యాస్ సిలిండర్లు బ్లాక్ కి..
బ్లాక్ మార్కెట్ లో రూ.2500 పలుకుతున్న కమర్షియల్ సిలిండర్, దారిమళ్లిన డొమెస్టిక్ గ్యాస్
ఇరాన్- అమెరికా యుద్ధంతో ఆంధ్రప్రదేశ్ లో గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలుతున్నాయి. ధరలు భగ్గుమంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వరకు అందరూ హెచ్చరించినప్పటికీ గ్యాస్ కృత్రిమ కొరత, బ్లాక్ మార్కెట్, అధిక ధరలకు సిలిండర్ల అమ్మకం జోరుగా సాగుతోంది.
చంద్రబాబు నిన్న సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్షించి పరిస్థితిని అంచనా వేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో వంటగ్యాస్కు కొరత లేదని, గృహ-వాణిజ్య అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని హామీ ఇచ్చారు. వదంతులు వ్యాప్తి చేసి ధరలు పెంచేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్లాక్మార్కెట్కు సిలిండర్లు తరలకుండా సంయుక్త కలెక్టర్లు పర్యవేక్షించాలని సూచించారు. విశాఖపట్నంలోని హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐఓసీల ద్వారా సరఫరా పర్యవేక్షిస్తున్నామని, జిల్లాలవారీ సరఫరా చైన్ను గమనిస్తామని చెప్పారు.
బ్లాక్ మార్కెట్ కు తరలుతున్న గ్యాస్...
కానీ ఇది కేవలం అధికారిక హెచ్చరిక మాత్రమే. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలలో గ్యాస్ కొరత మొదలైంది. చాలా మంది డీలర్లు గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ కు తరలించినట్టు తెలుస్తోంది. బ్లాక్మార్కెట్లో ధరలు భగ్గుమన్నాయి. ఇది పెద్ద సమస్యగా మారింది.
రాష్ట్రంలో మొత్తం సుమారు 1.6 కోట్ల నుంచి 1.7 కోట్ల డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి (పీఎం ఉజ్జ్వల యోజన కింద 5 లక్షలు, రాష్ట్ర దీపం-2 పథకం కింద దాదాపు 1 కోటి). కమర్షియల్ కనెక్షన్లు సుమారు 7 లక్షలు ఉన్నాయి. రోజుకు 37 వేలకు పైగా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి.
యుద్ధ నేపథ్యంలో కేంద్రం డొమెస్టిక్కు ప్రాధాన్యం ఇచ్చి, కమర్షియల్ సరఫరాకు కఠిన నిబంధనలు విధించింది. సింగిల్ కనెక్షన్కు 21 రోజులు, డబుల్కు 30 రోజుల తర్వాతే బుకింగ్ అనుమతి. ఈ-కేవైసీ లేకపోతే సిలిండర్ దొరకదు.
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరా అంతరాయం వల్ల గృహ వినియోగ గ్యాస్ ధర రూ.60 పెరిగి రూ.954.50కు, వాణిజ్య సిలిండర్ రూ.115 పెరిగి రూ.2,044కు చేరుకుంది. ఇంటికి చేరేసరికి కమీషన్లతో మరింత పెరుగుతోంది.
కానీ బ్లాక్మార్కెట్లో మాత్రం గృహ సిలిండర్ రూ.1,500-2,000కు, వాణిజ్య సిలిండర్ రూ.2,500-3,000కు అమ్ముతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు ఇప్పుడు కొరత ఎదుర్కొంటున్నాయి.
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నెలకు 15 వేల వాణిజ్య సిలిండర్లు అవసరం కాగా సరఫరా నిలిచిపోయింది. ఒక్కో హోటల్కు రోజుకు 6-12 సిలిండర్లు కావాల్సి ఉండగా సగం మాత్రమే వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, తాడిగడపలో ఒక్కో సిలిండర్ రూ.2,500-2,550కు కొన్నారు. రాజానగరంలోని నన్నయ విశ్వవిద్యాలయం వసతి గృహంలో 500 విద్యార్థులకు వాణిజ్య సిలిండర్లు దొరకక కట్టెల పొయ్యి, ఊకపొయ్యిపై వంట చేశారు.
పాడేరు, చింతపల్లి, ఉమ్మడి కృష్ణా, పల్నాడు, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో కృత్రిమ కొరత సృష్టించి డీలర్లు నల్లబజార్ దందా చేస్తున్నారని ఆరోపణలు. మన్యంలో 60 వేల గ్యాస్ వినియోగదారులు, పల్నాడులో 6 లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నా సరఫరా జాప్యం జరుగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లు 400 పైగా ఉన్న ఉమ్మడి జిల్లాల్లో వ్యాపారులు కష్టాలు పడుతున్నారు.
యుద్ధ ప్రభావంతో ఎన్నిఇక్కట్లో...
ఇది కేవలం గ్యాస్కు మాత్రమే పరిమితం కాలేదు. యుద్ధం వల్ల వంట నూనెల ధరలు పెరిగాయి. పామాయిల్ లీటరు రూ.143 నుంచి రూ.164కు, పొద్దుతిరుగుడు నూనె రూ.170 నుంచి రూ.183కు చేరాయి. ఉమ్మడి జిల్లాల్లో నెలకు రూ.26 కోట్ల భారం పడుతోంది. పులివెందులలో అరటి రైతులు పంటను గొర్రెలకు మేతగా వదిలేశారు. ఎగుమతి లేక ధరలు పతనమయ్యాయి.
కోడిగుడ్ల టోకు ధర రూ.6.50 నుంచి రూ.4.70కు పడిపోయింది.
యాపిల్, కివీ, ఎండు ఫలాల ధరలు కిలోపై రూ.100 పైగా పెరిగాయి.
ప్రభుత్వం గృహావసరాల సిలిండర్లను వాణిజ్యానికి మళ్లించకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. అదనపు ధరలు వసూలు చేస్తే 1906 లేదా 1800-233-3555 – Indian Oil Corporation LPG కస్టమర్ కేర్, 1800-22-4344 – Bharat Petroleum LPG కస్టమర్ కేర్, 1800-22-6669 – Hindustan Petroleum LPG కస్టమర్ కేర్ కి ఫిర్యాదు చేయవచ్చు.
ఆన్లైన్లో అయితే Ministry of Petroleum and Natural Gas పోర్టల్ ద్వారా LPG సంబంధిత ఫిర్యాదు నమోదు చేయవచ్చు. UMANG యాప్లో కూడా LPG సేవలకు సంబంధించిన కంప్లైంట్ పెట్టే అవకాశం ఉంది.
కానీ ఆచరణ మాత్రం వేరుగా ఉంది. బుకింగ్ యాపులు మొరాయిస్తున్నాయి. సర్వర్ లోడ్ పెరిగింది. నల్లబజార్ దందా జోరుగా సాగుతోంది. రాష్ట్రంలోని లక్షలాది హోటల్ ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.
మంత్రి హెచ్చరికలు ఒకవైపు, బ్లాక్మార్కెట్ ధరలు మరోవైపు...
ఇరాన్ యుద్ధం మంటలు ఆంధ్రప్రదేశ్ వంటింట్లను తాకాయి. ప్రభుత్వం సంక్షోభం తలెత్తకుండా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు ప్రజలు. కానీ ప్రస్తుతం వాస్తవం భిన్నంగా ఉంది. గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి... సామాన్యుల జేబులు ఖాళీ అతున్నాయి!
Next Story

