
లాక్డౌన్ ఆలోచనే లేదు: కేంద్రం..
వదంతులను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్..
దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి శుక్రవారం (మార్చి 27) ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపారు. ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ అమలు చేసే ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని చెప్పారు.
‘ఇంధన కొరత ఉండదు..’
ఇంధన రంగం, సరఫరా వ్యవస్థలపై ప్రభుత్వ నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని పూరి తెలిపారు. ప్రపంచ పరిస్థితులు ఇంకా స్థిరంగా లేనప్పటికీ, దేశానికి ఇంధన భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
‘బాధ్యతగా వ్యవహరించాలి’
లాక్డౌన్పై వస్తున్న వదంతులను నమ్మవద్దని, ప్రశాంతంగా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు. అసత్య ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని, వదంతులు సమాజంలో అనవసర ఆందోళన కలిగిస్తాయన్నారు.
‘అవన్నీ పుకార్లే..’
ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో దేశంలో కూడా లాక్డౌన్ విధించవచ్చన్న ఊహాగానాలు పెరిగాయి. ఎల్పీజీ సరఫరాపై కూడా సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇవన్నీ ఆధారరహితమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘మరోలా అర్థం చేసుకోవద్దు’
దేశంలో ప్రజల రాకపోకలు లేదా ఆర్థిక కార్యకలాపాలపై ఎలాంటి ఆంక్షలు విధించే యోచన లేదని కేంద్రం తెలిపింది. ప్రధాని మోదీ ఇటీవల చేసిన “సన్నద్ధత” వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, ముందస్తు జాగ్రత్తల గురించి చేసిన వ్యాఖ్యలే ఈ గందరగోళానికి కారణమయ్యాయని తెలిపారు.
“కోవిడ్ తరహా సన్నద్ధత” అంటే కేవలం పాలనా సిద్ధత మాత్రమే. ఎలాంటి లాక్డౌన్ లేదా ప్రజల రాకపోకలపై ఆంక్షలకు సంబంధించినది కాదని చెప్పారు.
మొత్తంగా, దేశంలో లాక్డౌన్ విధించే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తూ, ప్రజలు వదంతులను నమ్మకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరింది.

