
ప్రభుత్వ విద్యను రక్షించుకుందాం : A.I.D.S.O పిలుపు
తిరుపతిలో 5వ జోనల్ విద్యార్థుల మహాసభలు ఘనంగా ముగిసాయి. ఈ సందర్భంగా నూతన కమిటీని నిఎన్నుకున్నారు.
ప్రభుత్వ విద్యను రక్షించుకుందామని ఏఐడీఎస్ఓ (A.I.D.S.O) విద్యార్థి లోకానికి పిలుపు నిచ్చింది. ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (A.I.D.S.O) ఆధ్వర్యంలో తిరుపతి నగర 5వ జోనల్ విద్యార్థుల మహాసభలు బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ నందు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రైవేటీకరణ ధోరణులపై వక్తలు గళమెత్తారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షులు ఆర్.తేజశ్రీ
ప్రభుత్వ విద్య నిర్వీర్యంపై రాఘవ (సీనియర్ జర్నలిస్ట్) ధ్వజం
మహాసభలో ముఖ్య వక్తగా పాల్గొన్న ప్రముఖ రచయిత, సీనియర్ జర్నలిస్ట్ రాఘవ గారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యాన్ని అందించాల్సిన ప్రాథమిక బాధ్యత నుండి తప్పుకోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ వంటి విధానాల వల్ల ప్రభుత్వ విద్యా రంగం పూర్తిగా నిర్వీర్యమవుతోందని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో సామాన్యులకు విద్యను భారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై గళమెత్తుతున్న నాయకులను అణచివేసే ధోరణి పెరిగిందని, మోహన్ బాబు యూనివర్సిటీలో అన్యాయాన్ని ప్రశ్నించిన విద్యార్థి నేతలను కిడ్నాప్ చేయడం అప్రజాస్వామికమని ఆయన తీవ్రంగా ఖండించారు. అలాగే, ఎస్వీ యూనివర్సిటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రొఫెసర్ల నియామకాలు నిలిచిపోవడం వల్ల ఉన్నత విద్య ప్రమాణాలు పడిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన కార్యదర్శి జి.ధీరజ్
శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలి : సాకం నాగరాజ
అరసం రాష్ట్ర నాయకులు సాకం నాగరాజ మాట్లాడుతూ .. నేటి విద్యార్థులు మూఢనమ్మకాలను, అజ్ఞానాన్ని పారద్రోలే శాస్త్రీయ విద్యా విధానం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కులమతాల పేరుతో సమాజాన్ని విడదీసే పాలకుల కుట్రలను తిప్పికొట్టాలని, భగత్ సింగ్, నేతాజీ, అల్లూరి వంటి మహనీయుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
నైతిక విలువలే విద్యార్థులకు ఆభరణం : జి.ప్రతాప్ సింగ్
ఏఐడీఎస్ఓ మాజీ నాయకులు జి ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థుల్లో నీతి, నైతిక విలువలను పెంపొందించడంలో ఈ సంఘం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సామాజిక మాధ్యమాల్లో పెరిగిపోతున్న అశ్లీలతను అరికట్టాలని, నిరుద్యోగులకు తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
నూతన కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా ఏఐడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి ఈ. మహేష్ నాయకత్వంలో 20 మంది సభ్యులతో కూడిన తిరుపతి నగర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కార్యవర్గం ఇదే..
అధ్యక్షులు: తేజశ్రీ
ఉపాధ్యక్షులు: ఉన్నతి
కార్యదర్శి: జి.ధీరజ్
సహాయ కార్యదర్శి: తులసి కృష్ణ
ఈ మహాసభలకు పౌర చైతన్య వేదిక (PCV) జిల్లా అధ్యక్షులు వాకా ప్రసాద్, జిల్లా కార్యదర్శి ఏ.ఎన్.పరమేశ్వర రావు హాజరై నూతన కమిటీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐడీఎస్ఓ నాయకులు పి.మహేష్ జాన్, మొబీనా ఫిర్దౌజ్, నవీన్ కుమార్, వివిధ కళాశాలల విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని సభను దిగ్విజయం చేశారు.

