
అసోంలో ప్లాస్టిక్ మృత్యువు: గజరాజు మృతి వెనుక వాస్తవాలు వెలుగులోకి
చెత్త డంపింగ్, ఆహార కొరత, పాలనా నిర్లక్ష్యంపై జంతు ప్రేమికుల ఆందోళన..
అడవిలో నిశ్శబ్దంగా నడిచే గజరాజు జీవితం.. మనుషుల నిర్లక్ష్యంతో విషాదంగా ముగిసింది. అస్సాంలో జరిగిన ఈ ఘటన వన్యప్రాణుల భద్రతపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. గోలాఘాట్ జిల్లాలోని నుమాలిగఢ్ టీ ఎస్టేట్ పరిసరాల్లో కేవలం ఎనిమిదేళ్ల వయస్సున్న ఒక అడవి ఏనుగు జనవరి 12న మృతి చెందింది. మొదట్లో సాధారణ మరణంలా కనిపించిన ఈ ఘటన.. పోస్టుమార్టం నివేదికతో భయానక నిజాలను బయటపెట్టింది. కార్యకర్త దిలీప్నాథ్ దాఖలు చేసిన ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ఏనుగుకి ఎలాంటి బాహ్య గాయాలు కనిపించలేదు. కానీ దాని కడుపు అంతా ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండి ఉంది. మలంలో కూడా ప్లాస్టిక్ అవశేషాలు గుర్తించారు. దీని అర్థం.. ఈ జంతువు కాలక్రమేణా పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ను తినడం వల్లే మృతి చెందిందని అధికారులు నిర్ధారించారు. అంతర్గతంగా తీవ్రమైన ఉబ్బరం, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం ఈ మరణానికి ప్రధాన కారణాలుగా తేలాయి. అడవుల సమీపంలో రోడ్ల పక్కన పేరుకుపోయిన చెత్తే దీనికి మూలమని అధికారులు పేర్కొన్నారు.
పర్యావరణ కార్యకర్త అపూర్వ బల్లావ్ గోస్వామి ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “అడవుల్లో సహజ ఆహారం తగ్గిపోతే, ఏనుగులు అందుబాటులో ఉన్నదే తింటాయి. అది ప్రమాదకరమైనదైనా తప్పదు.” అని పేర్కొన్నారు.
దియోపహార్–నుమాలిగఢ్ ప్రాంతాన్ని ఆయన అత్యంత ప్రమాదకర మండలంగా పేర్కొన్నారు. జాతీయ రహదారి-39 వెంట చెత్త డంపింగ్ విస్తృతంగా జరుగుతుండటంతో.. ఏనుగుల మార్గాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని తెలిపారు. “ఏనుగు కారిడార్లలో చెత్త వేయడం అంటే వాటి మార్గంలోనే విషం ఉంచినట్టే,” అని ఆయన హెచ్చరించారు.
ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. క్షేత్రస్థాయిలో మార్పు కనిపించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే చెత్త డంపింగ్ను ఆపకపోతే, ఇలాంటి ఘటనలు మరిన్ని జరుగుతాయని హెచ్చరించారు.
అసోం రాష్ట్రం దేశంలో ముఖ్యమైన ఏనుగుల ఆవాసాల్లో ఒకటి. ఇక్కడ సుమారు 4వేలకు పైగా ఏనుగులు ఉన్నాయని అంచనా. అయితే, గత నాలుగు దశాబ్దాల్లో అటవీ నిర్మూలన, తేయాకు తోటల విస్తరణ, వ్యవసాయం, మైనింగ్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా దాదాపు 35 శాతం ఆవాసాలు తగ్గిపోయాయి.
దీంతో ఏనుగులు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నాయి. ప్రతిరోజూ 150 నుంచి 200 కిలోల ఆహారం అవసరమైన ఈ జంతువులు, అడవుల్లో ఆహారం దొరకకపోవడంతో చెత్తకు ఆకర్షితమవుతున్నాయి.
ఇదే పరిస్థితి మానవ-ఏనుగు సంఘర్షణను కూడా పెంచుతోంది. ఏనుగులు గ్రామాలు, వ్యవసాయ భూముల్లోకి రావడం, పంటలు నాశనం చేయడం, కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరగడం సాధారణమైంది. అధికారిక గణాంకాల ప్రకారం 2000 నుంచి 2023 వరకు సుమారు 1,200 ఏనుగులు వివిధ కారణాలతో మరణించాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం “గజ మిత్ర” పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఆవాసాల పునరుద్ధరణ, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, స్థానిక బృందాల మోహరింపు వంటి చర్యలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అయితే ఈ ఘటన ఆ పథకం అమలుపై సందేహాలు కలిగిస్తోంది. “ఈ పథకం అమలులో ఉంటే, ఈ ఏనుగు ప్లాస్టిక్ తిని ఎలా చనిపోయింది?” అని దిలీప్ నాథ్ ప్రశ్నించారు.
మొత్తంగా.. ఈ ఘటన ఒక హెచ్చరికలా నిలుస్తోంది. అడవుల్లో చెత్త డంపింగ్ ఆపకపోతే, వన్యప్రాణుల ప్రాణాలు మరింత ప్రమాదంలో పడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్లాస్టిక్ రహిత సమాజం అనే మాటలు మాత్రమే కాదు, ఆచరణలో కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం స్పష్టమవుతోంది.

