ఇజ్రాయిల్ - ఇరాన్ వైరం ఏనాటిదో!?
x

ఇజ్రాయిల్ - ఇరాన్ వైరం ఏనాటిదో!?

2023 అక్టోబర్ 7వ తేదీన హమాస్ అనే సాయుధ మిలిటెంట్ సంస్థ ఇజ్రాయిల్ పైన మిస్సైళ్ళ తో దాడి చేయడంతో ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం మొదలైంది. అయితే ఈ వైరం ఈనాటిది కాదు.


-రాఘవ శర్మ


శనివారం అర్ధ రాత్రి ఇజ్రాయిల్ పై ఇరాన్ పెద్ద ఎత్తున మిస్సైళ్ళతో విరుచుకుపడింది. ఈ నెల మొదట్లో డెమాస్కస్, సిరియాలో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయాలపై ఇజ్రాయిల్ చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడి చేసింది. దీంతో మధ్య ఆసియాలో పెద్ద ఎత్తున యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.

ఇరాన్ చేసిన ఈ దాడిపై ఇజ్రాయిల్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది. దీన్ని అమెరికా కూడా తీవ్రంగా పరిగణించింది. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడాడు. కానీ, ఇరాన్ పై జరిగే యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనదని ఆ దేశ మిలిటరీ అధికారులు స్పష్టం చేశా రు.

ఇరాన్- ఇజ్రాయిల్ వైరం ఈ నాటిది కాదు. ఇరాన్ లో పహల్వి రాజవంశం 1925 నుంచి 1979 వరకు పాలించింది. ఇరాన్ లో 1979లో వచ్చిన తిరుగుబాటుతో షా ప్రభుత్వం కూలిపోయి, అయతుల్లాహ్ రుహొల్లాహ్ ఖొమైనీ నాయకత్వంలో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడింది.

ఇరాన్ లో ఈ అధికార మార్పు జరగడానికంటే ముందు కొన్ని పరిణామాలు జరిగాయి. పాలస్తీనా నుంచి 1947లో బ్రిటన్ వైదొలిగిన సందర్భంగా, ఐక్య రాజ్యసమితి పాలస్తీనాను విభజించడానికి చేసిన ప్రతిపాదనను వ్యతిరేకించిన మూడు దేశాల్లో ఇరాన్ ఒకటి. అయినప్పటికీ 1948లో ఇరాన్ ఇజ్రాయిల్ ను గుర్తించిన రెండవ అతిపెద్ద ముస్లిం దేశంగా గుర్తింపు పొందింది. పశ్చిమ దేశాలకు అనుకూలమైన ఇజ్రాయిల్ తో సత్పంబంధాలు నెలకొల్పడానికి ఇరాన్ ప్రయత్నించింది.

ఇజ్రాయిల్ కు ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన భూభాగాన్ని దాటి పాలస్తీనా భూభాగాన్ని అది ఆక్రమిస్తుండడంతో ఇరాన్ పాలస్తీనాకు మద్దతుగా నిలిచింది. దీంతో మధ్య ఆసియాలో ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య శత్రుత్వం పెరిగిపోయింది. మధ్య ఆసియాలో అమెరికా సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని, అక్కడ ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఇరాన్ వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇరాన్ తో సంబంధం ఉన్న సాయుధ దళాలు ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తూ వచ్చాయి.

ఇలా ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య చాలా కాలం నుంచి ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. తాజాగా గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ అనే సాయుధ మిలిటెంట్ సంస్థ ఇజ్రాయిల్ పైన మిస్సైళ్ళ తో దాడి చేయడంతో మధ్య ఆసియాలో ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది.

ఇరాన్ , సిరియాలలో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ మద్దతు దారులు దాడులు చేశారు. అమెరికా మద్దతుతో గాజాపై ఇజ్రాయిల్ చేసే యుద్ధం ఆపే వరకు తమ దాడులు కొనసాగుతాయని ఇరాన్ నాయకత్వం హెచ్చరించింది. సిరియాలోని తమ రాయబార కార్యాలయాల పైన ఇజ్రాయిల్ ఈనెల మొదట్లో బాంబు దాడులు చేయడంతో ఈ ప్రాంతంలో యుద్ధవాతావరణం అలుముకున్నట్టు భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపైన ఇజ్రాయిల్ చేసిన ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు చెందిన అత్యున్నత కమాండర్ మహ్మద్ రీజా జహేది, సీనియర్ కమాండర్ మహమ్మద్ హడి హాజి తో పాటు ఏడుగురు అధికారులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా ఖొమైనీ హెచ్చరించాడు.

ఇజ్రాయిల్ పై శనివారం ఇరాన్ చేసిన దాడి సాధారణమైంది కాదు. నూట డెబ్బై డ్రోన్లు, 120 బ్యాలిస్టిక్ మిస్సైళ్ళు సహా మొత్తం 300 పైగా మిస్సైళ్ళతో విరుచుకుపడింది. ఇరాన్, ఇరాక్, యెమెన్, లెబెనాన్, హెచ్ బుల్లాల నుంచి 350 రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది.

ఈ దాడితో ఇజ్రాయిల్ రక్షణ రంగం పెద్ద ఎత్తున దెబ్బతిన్నదని ఇరాన్ వర్గాలు చెపుతుండగా, పెద్దగా నష్టమేమీ జరగలేదని ఇజ్రాయిల్ నమ్మబలుకుతోంది. ఇజ్రాయిల్ కు చెప్పుకోదగ్గ నష్టం ఏమీ జరగలేదని దాని మద్దతు దారైన అమెరికా మిలటరీ వర్గాలు కూడా అంటున్నాయి.

ఈ దాడి సందర్భంగా తూర్పు మెడిటరేనియన్ సముద్రంలో ఇజ్రాయిల్ పైన ఎక్కు పెట్టిన ఇరాన్ కు చెందిన ఆరు బాలస్టిక్ మిజైళ్ళను అమెరికా యుద్ధ నౌక ధ్వంసం చేసిందని, డెబ్బై ఇరాన్ ఏక ధృవ యూఏవి హెడ్లను తమ వైమానిక శక్తి ధ్వంసం చేసిందని అమెరికా అంటోంది.

ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణ నేపథ్యం


గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన గాజాలోని హమాస్ మిలిటెంట్ సంస్థ ఇజ్రాయిల్ పై మిస్పైళ్ళతో దాడి చేయడంతో పాలస్తీనాపై ఇజ్రాయిల్ సాయుధ దాడి మొదలు పెట్టింది. ఈ సందర్భంగా గాజా నుంచి తప్పించుకోవడానికి అనుగుణంగా గాజా-ఈజిప్టు మధ్య ఉన్న సరిహద్దును గత ఏడాది నవంబర్ లో ఒక మేరకు తెరిచారు.

పాలస్తీనా లో ఉండే ఆస్పత్రుల ను అడ్డం పెట్టుకుని హమాస్ యుద్ధం చేస్తోందని ఆరోపిస్తూ ఇజ్రాయిల్ ఆస్పత్రులపైన దాడులు చేసింది. దీంతో అనేక మంది పిల్లలు, రోగులు మరణించారు. హమాస్ మాత్రం ఆస్పత్రులను యుద్ధానికి వాడుకోవడం లేదని స్పష్టం చేసింది. గత నవంబర్ లో ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య నెల రోజుల పాటు యుద్ధ విరమణ జరిగింది. ఈ సమయంలో పరస్పరం యుద్ధ బందీల మార్పిడి కూడా జరిగింది.

గత డిసెంబర్ లో ఇజ్రాయిల్ మళ్ళీ పాలస్తీనా పై యుద్దాన్ని తీవ్రతరం చేసింది. ఐక్యరాజ్య సమితి కూడా ఇజ్రాయిల్ దాడిని తీవ్రంగా ఖండించింది. యుద్ధంలో మృతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా పసిపిల్లలు పెద్ద సంఖ్యలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో గాజాకు మద్దతుగా నిలిచిన ఇరాన్ కు, ఇజ్రాయిల్ మధ్య ఈ యుద్ధవాతావరణం మరింత పెరిగింది.

Read More
Next Story