
భారత విమానయాన చరిత్రలో ఘోర విమాన ప్రమాదాలివే!
1996 తర్వాత అహ్మదాబాద్ విమాన ప్రమాదమే అతి పెద్దదా!
బ్రిటన్ బయలుదేరిన ఎయిరిండియా డ్రిమ్లైనర్ విమానం (బోయింగ్ 787-8) గురువారం ఉదయం (జూన్ 13-2025) అహ్మదాబాద్ లో కుప్పకూలింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైంది. 242 మంది ప్రయాణికులతో లండన్ గాట్విక్ వైపు బయలుదేరిన ఈ విమానం 850 అడుగుల ఎత్తులోనే నియంత్రణ కోల్పోయింది. పైలట్ “మేడే” సిగ్నల్ ఇచ్చిన తర్వతే విమానం నివాస ప్రాంతంలో పడిపోయింది. భారీ పేలుడు, అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దట్టంగా ఎగిసిన మంటలు, నల్లటి పొగతో పరిసరాల రూపురేఖలే మారిపోయాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకే ఒకరు బతికి బయటపడినట్టు ఇప్పటికి అందుతున్న సమాచారం.
ఈ ఘటన దేశంలో గతంలో జరిగిన మరెన్నో ఘోర విమాన ప్రమాదాలను మళ్లీ గుర్తు చేస్తోంది. వాటిలో కొన్ని:
చార్కీ దాద్రీ మిడ్-ఎయిర్ కోలిజన్ (నవంబర్ 12, 1996)
ఇది ఇప్పటికీ భారత విమానయాన చరిత్రలో అతి పెద్ద ప్రమాదంగా రికార్డుల్లోకి ఎక్కింది. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషిన్ Il-76 విమానాలు ఢిల్లీ సమీపంలో గగనతలంలో ఢీకొన్నాయి. కమ్యూనికేషన్ లోపం, పొరపాటు ఎత్తు సూచనలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి. రెండు విమానాల్లోని మొత్తం 349 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటన అనంతరం భారతదేశం అన్ని వాణిజ్య విమానాలపై TCAS (Traffic Collision Avoidance System) తప్పనిసరి చేసింది.
ఇతర విమాన ప్రమాదాలు
కొజికోడ్ ప్రమాదం (ఆగస్టు 7, 2020): వందే భారత్ మిషన్లో భాగంగా దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఫ్లైట్ 1344, కొజికోడ్ విమానాశ్రయంలో కుప్పకూలింది. భారీ వర్షంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రన్వే దాటి 35 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. 21 మంది మృతిచెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
మంగళూరు ప్రమాదం (మే 22, 2010): దుబాయ్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో స్టేబుల్ అప్రోచ్ లేకపోయినా పైలట్ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించాడు. విమానం రన్వే దాటి పేలిపోయింది. 158 మంది మృతిచెందారు.
పాట్నా విమాన ప్రమాదం (జూలై 17, 2000): కోల్కతా నుంచి ఢిల్లీకి వెళ్తున్న అల్లయెన్స్ ఎయిర్ ఫ్లైట్ 7412, పాట్నా సమీపంలో నివాస ప్రాంతంలో కూలిపోయింది. 60 మందికి పైగా మరణించారు. పైలట్ తప్పిదం ప్రధాన కారణం.
ఔరంగాబాద్ ప్రమాదం (ఏప్రిల్ 26, 1993): ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ సమయంలో రన్వే మీద దాటుతున్న ట్రక్కును ఢీకొన్నది. 55 మంది మరణించారు.
ఇంఫాల్ ప్రమాదం (ఆగస్టు 16, 1991): ఇంఫాల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని కొండలోకి విమానం ఢీకొని 69 మంది ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరు ప్రమాదం (ఫిబ్రవరి 14, 1990): ముంబై నుంచి వచ్చిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం రన్వేకు ముందే భూమిని తాకి ముక్కలైంది. 92 మంది మృతిచెందారు.
అహ్మదాబాద్ ప్రమాదం (అక్టోబర్ 19, 1988): ఇంధనం తగ్గిన నేపథ్యంలో దిగే ప్రయత్నంలో 133 మంది మరణించారు.
బాంబే ప్రమాదం (జూన్ 21, 1982): మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి వచ్చిన విమానం రన్వేను దాటి పోయి మంటల్లో కాలిపోయింది.
అరేబియన్ సముద్ర ప్రమాదం (జనవరి 1, 1978): ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న విమానం గగనతలంలోని మార్గంలో తికమక పడి సముద్రంలో పడిపోయింది. 213 మంది మృతిచెందారు.
ఢిల్లీ ప్రమాదం (మే 31, 1973): చెన్నై నుంచి వచ్చిన విమానం తుపాను వాతావరణంలో పాలం విమానాశ్రయం వద్ద హై వోల్టేజ్ వైర్లను తాకడంతో నిప్పులు చెలరేగాయి. విమానానికి మంటలు అంటుకున్నాయి. 48 మంది మృతి చెందారు.
ఈ సంఘటనలన్నీ మనకు ఒక స్పష్టమైన విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. ఆధునిక సాంకేతికత, పలు భద్రతా నియమాలు ఉన్నా ఓ చిన్న తప్పిదం ఎన్ని జీవితాలను బలిగొంటుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రయాణికుల జీవితాలను కాపాడడం కేవలం పైలట్లదే కాదు, గగన మార్గాలను పర్యవేక్షించే వ్యవస్థలదీ, ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణా అధికారులదీ, ప్రతి చిన్న నిబంధనను నిబద్ధంగా పాటించే అన్ని వర్గాలదీ. ప్రమాదం తర్వాత హడావిడి చేసే కన్నా ముందునుంచే జాగ్రత్తలు పాటించడం అవసరాన్ని ఈ ప్రమాదం సూచిస్తోంది.
ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందాలి. బాధిత కుటుంబాలకు శాంతి చేకూరాలి.
Next Story