
ఐఎఫ్ఆర్ వేళ.. స్వచ్ఛ విశాఖ ఇలా..!
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐఎఫ్ఆర్, మిలాన్, ఐయాన్స్కు సిద్ధమైన విశాఖలో జీవీఎంసీ నిర్లక్ష్యం ప్రభుత్వ ప్రతిష్టను మంటగలుపుతోంది.
పై ఫోటోలను చూశారా? ఆ చెత్త పోగులు ఎక్కడో అనుకుంటున్నారా? కానే కాదు.. విశాఖ నడిబొడ్డులో.. అదీ ఆర్టీసీ కాంప్లెక్స్కు అత్యంత సమీపంలోని ఓ వాణిజ్య సముదాయంలో.. నగరంలో చెత్త సర్వసాధారణమే అనుకోవచ్చు. నిజమే.. ఇప్పుడలా అనుకోవడానికి వీల్లేదు. విశాఖకు పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టే మూడు అంతర్జాతీయ వేడుకలకు వైజాగ్ వేదికైంది. ఈ ఘనమైన వేడుకల కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ విదేశాల నుంచి 400 మందికి పైగా అతిరథ మహారథులు విశాఖకు విచ్చేస్తున్నారు. అందుకోసం దాదాపు రెండు నెలల నుంచి విశాఖ నగరాన్ని అందంగా తీర్చి దిద్దుతున్నారు. రోడ్లను శుభ్రం చేస్తున్నారు. రోడ్డు పక్కన బతికే చిరు వ్యాపారులను ఇదివరకే ఏరి పారేశారు. వారు ఏర్పాటు చేసుకున్న షెడ్లు/దుకాణాలను ప్రొక్లెయిన్లతో నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. సిటీ బ్యూటిఫికేషన్ పేరిట డివైడర్లకు రంగులు బాగున్నా మళ్లీ సరికొత్తగా వేస్తున్నారు. రోడ్ల వెంబడి గోడలపై అందమైన బొమ్మలు వేస్తున్నారు. ఇలా రూ.వందల కోట్లను మంచినీళ్లలా ఖర్చు పెడుతున్నారు.
ఐఎఫ్ఆర్ జరిగే వైజాగ్ బీచ్ రోడ్ లో ఎంగిలి ఆకుల సోయగం
ఐఎఫ్ఆర్కు అతిరథ మహారథులు వస్తున్న వేళ..
నగరంలో ఈనెల 16 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్), మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజెస్ (మిలాన్), ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం (ఐయాన్స్) సిటీ పెరేడ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 18న జరిగే ఐఎఫ్ఆర్లో పాల్గొనడానికి సాక్షాత్తూ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ మంగళవారం విశాఖ విచ్చేస్తున్నారు. ఇంకా సుమారు 50 దేశాలకు చెందిన అతిథులు, ఆయా రక్షణశాఖల ప్రతినిధులు వస్తున్నారు. ఈ అతిథులు విశాఖ సహా, సమీపంలోని పర్యాటక ప్రాంతాల్లో సందర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా జీవీఎంసీ సిబ్బంది, అధికారుల తీరు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి స్టేషన్ రోడ్డుకు వెళ్లే దారిలో కుళ్లిన చెత్త ఇలా..

