
ఇవిగో ఉద్యోగుల డిమాండ్లు
ఏపీజేఏసీ అమరావతి నేతలు సీఎస్ను కలిసి వినతిపత్రం.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటి నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఖర్చు లేని 12వ వేతన సంఘం (పీఆర్సీ) కమిషనర్ నియామకంలో జాప్యం ఎందుకని నేతలు ప్రశ్నించారు. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, మధ్యంతర భృతి (ఐఆర్)ను తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన రిటైర్డ్, మరణించిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని, పెండింగ్ డీఏలను అప్డేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
“రిటైర్డ్ ఉద్యోగులు బకాయి డబ్బులు అందుకోకుండానే మృతి చెందుతున్నారు. అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలి. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఔట్సోర్సింగ్, స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అందించాలి” అని నేతలు డిమాండ్ చేశారు.
ప్రభుత్వం మీద ఉద్యోగులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, లేనిపక్షంలో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగి పరిస్థితి మరింత సంక్లిష్టమవుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం సిబ్బంది లేమితో నలుగురి పని ఒక్కరే చేస్తున్నారని, ఆర్థిక ఒత్తిడి, పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతమవుతున్నారని వివరించారు.
పైసా కూడా ఖర్చులేని పిఆర్శీకమిషన్ నియామాకంలో జాప్యం ఎందుకు?
మధ్యంతర భృతి (IR) వెంటనే ప్రకటించాలి.
రిటైర్డ్, మరణించిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి.
డీఏలు పెండింగ్పై ఉద్యోగుల్లో ఆగ్రహం ఉంది.
ఉద్యోగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.
కూటమి ప్రభుత్వం పై ఉద్యోగుల పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి.
రిటైర్డ్ ఉద్యోగులు బకాయిలు డబ్బులు అందుకోకుండానే మృతి చెందుతున్నారని ఆవేదన.
రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ చేయాలి.
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేయాలి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి.
ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు ఆధ్వర్యంలో ఇచ్చిన ఈ వినతిపత్రంపై ప్రభుత్వం స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

