
PNGకి మారని ఇళ్లకు LPG నిలిపివేత
కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఎల్పీజీ కొరత నేపథ్యంలో పైపుల ద్వారా సరఫరా అయ్యే సహజ వాయువు (PNG) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. PNG కనెక్షన్ అందుబాటులో ఉన్నా.. వినియోగించని ఇళ్లకు మూడు నెలల తర్వాత LPG సరఫరా నిలిపివేస్తామని హెచ్చరిస్తూ మార్చి 24న సర్కులర్ రిలీజ్ చేసింది. ‘PNG అందుబాటులో ఉన్న వారు తప్పనిసరిగా PNGకి మారాలి. లేకపోతే LPG సరఫరా నిలిపేస్తాం.’ అని లేఖలో స్పష్టంగా పేర్కొ్ంది.
PNG కనెక్షన్ అందుబాటులో ఉన్నప్పటికీ, కనెక్షన్కు దరఖాస్తు చేసుకోకపోతే ముందుగా వినియోగదారుడికి నోటీసు ఇస్తారు. ఆ తర్వాత మూడు నెలల గడువు పూర్తయ్యాక LPG సరఫరా నిలిపివేస్తారు.
PNG ద్వారా వంటగ్యాస్ నిరంతరాయంగా పైపుల ద్వారా సరఫరా అవుతుంది. దీంతో సిలిండర్ రీఫిల్ అవసరం ఉండదు. అందుకే ప్రభుత్వం గృహాలు, వాణిజ్య వినియోగదారులు PNGకి మారాలని కోరుతోంది.
PNG అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో LPG వినియోగాన్ని తగ్గించి, ఆ సరఫరాను ఇతర ప్రాంతాలకు మళ్లించాలన్నది ప్రభుత్వ ఆలోచన. PNGకి దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనూ కనెక్షన్ ఇవ్వాలని ఏజెన్సీలకు కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఎవరికి మినహాయింపు..
సాంకేతిక కారణాల వల్ల PNG కనెక్షన్ ఇవ్వడం సాధ్యం కాని ఇళ్లకు ఈ నిబంధన వర్తించదు. అలాంటి సందర్భాల్లో సంబంధిత సంస్థ NOC జారీ చేస్తుంది. ఆ ఇళ్లకు LPG సరఫరా కొనసాగిస్తారు.
ఇరాన్, ఇజ్రాయిల్- అమెరికా దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో LPG కొరత ఏర్పడుతుండడంతో దేశంలో ఇంధన వినియోగాన్ని సమతుల్యం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.

