
వైజాగ్ రైల్వే స్టేషన్లో ’నకిలీ‘ నోట్ల కలకలం
ఇద్దరు యువకుల అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
విశాఖ రైల్వే స్టేషన్లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడటం కలకలం రేపింది. రైల్వే పోలీసులు (GRP) నిర్వహించిన మెరుపు తనిఖీల్లో లక్షలాది రూపాయల దొంగ నోట్లు బయటపడ్డాయి.
తనిఖీల్లో దొరికిపోయారు ఇలా..
గురువారం విశాఖ జీఆర్పీ ఇన్స్పెక్టర్ ధనంజయనాయుడు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలు చేపట్టారు. ప్లాట్ఫాంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు యువకులను పోలీసులు ఆపి సోదా చేయగా, వారి వద్ద ఉన్న కరెన్సీ కట్టలు చూసి పోలీసులు షాక్ తిన్నారు. వారి వద్ద ఉన్నవన్నీ రూ. 200 నకిలీ నోట్లుగా గుర్తించారు.
ముఠా గుట్టు రట్టు
అరెస్టయిన వారిని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సునీల్, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన నితీశ్ కుమార్గా పోలీసులు గుర్తించారు. వీరి వద్ద నుంచి మొత్తం రూ. 3,32,200 విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ నోట్లు ఎక్కడి నుంచి తెచ్చారు? వీటి వెనుక పెద్ద ముఠా ఏమైనా ఉందా? అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రయాణికులు నగదు లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

