గీతం యూనివర్శిటీ మీద అంత ప్రేమ ఎందుకు?
x

గీతం యూనివర్శిటీ మీద అంత ప్రేమ ఎందుకు?

యూనివర్శిటీ ఆక్రమించిన 55 ఎకరాల భూమిని రెగ్యలరైజ్ చేసేందుకు నిర్ణయం. దీని వేల కోట్ల విలువైన భూమిలివి? మాజీ ఐఎఎస్ అధికారి ఆక్షేపణ


విశాఖపట్నం సమీపాన రుషికొండ, ఎండాడ గ్రామాల్లో గీతం యూనివర్శిటీ అక్రమించుకున్న వేలాది కోట్ల రూపాయల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే స్వాదీనం చేసుకోవాలని మాజీ ఐఎఎస్ అధికారి డాక్టర్ ఇఎఎస్ శర్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

స్వాదీనం చేసుకోకపోవడం కాదు, గీతం కు అనుకూలంగా ఇటీవల జరిగిన సమావేశంలో,ఆ భూమి ఆక్రమణను "క్రమబద్ధీకరణ" చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారని వార్త లు వెలువడటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రాజకీయనేతల మద్దతు ఉండడం కారణంగా, స్థానిక రెవిన్యూ అధికారులు కాని, జీవీఎంసీ అధికారులు కాని, ఆ సంస్థను ప్రశ్నించి, ప్రభుత్వ భూమిని వెనక్కి తీసుకోవడం జరగలేదని ఆయన ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , చీఫ్ కమీషనర్ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్)లకు ఒక లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

BSO 24 కింద కాని , రెవిన్యూ శాఖ 14-9-2012 లో జారీచేసిన GOMs No 571 కింద కాని , ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదన్న నియమాన్ని గుర్తు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు.

" 28-1-2011 న, జగపాల్ సింగ్ (CA No 1132/2011) కేసులో , స్థానికసంస్థల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు కేటాయించకూడదని, సుప్రీమ్ కోర్టు వారు, అన్ని రాష్ట్రాలను ఆదేశించారు. స్థానిక రెవిన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు, అటువంటి సుప్రీమ్ కోర్టు వారి ఆదేశాలను ఉల్లంఘిస్తే, న్యాయస్థానాన్ని ధిక్కరించినట్లు అవుతుంది," అని ఆయన లేఖ లో పేర్కొన్నారు.
"రాష్ట్ర రిజిస్ట్రేషన్ శాఖ వారు సూచించిన భూముల ధరల ప్రకారం, రుషికొండ, ఎండాడ ప్రాంతంలో, ఎకరం భూమి విలువ 22 కోట్ల రూపాయలు ఉందని ప్రభుత్వం గుర్తించాలి. అటువంటి విలువైన భూమిని, లాభాలు గణించే ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తే, సుప్రీమ్ కోర్టువారు 2జీ స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం కేసులలో ఇచ్చిన తీర్పులను అనుసరించి, అటువంటి నిర్ణయాలతో సహకరించిన అధికారులమీద, రాజకీయ నేతలమీద Prevention of Corruption Act, 1988 కింద చర్యలు తీసుకోవడం అవసరం, " అని ఆయన వాఖ్యానించారు.
ప్రభుత్వ భూములను చవకగా ప్రైవేట్ ఆస్పత్త్రులకు, విద్యాసంస్థలకు ఇస్తే, ఆ సంస్థలు, పేదలకు, తమ సేవలను 25% వరకు ఉచితంగా ఇవ్వాలని సుప్రీమ్ కోర్టువారు ఎన్నో సందర్భాల్లో ఆదేశించారని రాష్ట్ర ప్రభుత్వం అటువంటి ఆదేశాలను, ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలమీద వ్యామోహం కారణంగా అమలు చేయకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు.
"గతంలో కూడా రుషికొండ, ఎండాడ గ్రామాల్లో, ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ భూములను అక్రమించుకోవడమే కాదు, పేదలకు కేటాయించిన డీ పట్టా భూములను కూడా, AP Assigned Lands (Prohibition of Transfers) Act, 1977 ను ఉల్లంఘించి కొనడం జరిగింది. విచారణ చేపట్టి ఆ ప్రైవేట్ సంస్థలమీద చర్యలు తీసుకుని, అటువంటి కొనుగోలులను రద్దు చేయడం అవసరం," అని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయం, పెద్దలకు మరొక న్యాయం అమలుఅవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తూ, ‘‘అదే ఉన్నత రెవిన్యూ అధికారులు, జీవీఎంసీ అధికారులు, నగరానికి జీవనోపాధి కోసం వలస వచ్చి, నగరప్రజలకు సదుపాయాలు కలిగిస్తూ, ప్రభుత్వ భూముల్లో గుడిసెలు కట్టుకున్న చిన్నకారు ప్రజలను, పోలీస్ బలగాల సహాయంతో, ప్రొక్లైన్ లను తీసుకువచ్చి, నిర్వాసితులు చేయడం, ప్రజలకు సేవలు అందిస్తున్న వీధి వ్యాపారులను కూడా అదే విధంగా నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరుగుతున్నది,’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Read More
Next Story