హోం స్టేల నిర్వహణకు సంబంధించి రేటింగ్ కూడా పెట్టాలని దిశానిర్దేశం చేశారు. అరకు, చింతపల్లి, ముంచింగిపుట్టు, గాంధీవనం, మారేడుమిల్లి తదితర ప్రాంతాలతో పాటు కనీసం 10-15 ప్రాంతాల్లో కారావాన్ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. కారావాన్లను పార్కింగ్ చేసుకుని కుటుంబంతో సురక్షితంగా ప్రకృతిని ఆస్వాదించేలా ఆయా పార్కుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్స్ పీరియన్స్ కేంద్రాల వద్ద కూడా ఈ తరహా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. తిరుపతి, విశాఖలలో అమ్యూజ్ మెంట్ పార్కుల ఏర్పాటుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం సూచనలు జారీ చేశారు. అటవీ, దేవాదాయ శాఖల సమన్వయంతో ఎకో, టెంపుల్ టూరిజానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం పేర్కొన్నారు. ప్రసాద్, స్వదేశ్ దర్శన్ పథకాల కింద వివిధ దేవాలయాలు, దర్శనీయ స్థలాల అభివృద్ధికి చేపట్టిన ప్రాజెక్టులను 2026 మే నాటికి సిద్ధం చేయాలని అన్నారు. దీనికి సంబంధించి మరో రూ.663 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్టు పర్యాటక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గండికోట, సూర్యలంక, అరకు బొర్రా గుహలు తదితర ప్రాంతాలను ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలన్నారు. గోదావరి పుష్కరఘాట్‌ను ఆగస్టు నాటికి, హావ్ లాక్ బ్రిడ్జిపైకి పర్యాటకులను అనుమతించేలా ఈ ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు.
పర్యాటక ప్రోత్సాహానికి సీఎస్ అధ్యక్షతన కమిటీ
రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఓ బోర్డు లేదా కమిటీ ఏర్పాటు చేసి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పర్యాటకశాఖ, అటవీ, దేవాదాయ, పోలీసు, మెరైన్ ఇలా వేర్వేరు శాఖల సమన్వయం కోసం సీఎస్ అధ్యక్షతన దీనిని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. హౌస్ బూట్లు, హెలీ టూరిజంతో పాటు ఉడాన్ పథకం కింద సీ ప్లేన్‌లను కూడా ప్రోత్సహించాలని అన్నారు. విశాఖ, విజయవాడ, శ్రీశైలం, గండికోట, కంభం చెరువు లాంటి చోట్ల వాటర్ ఏరో డ్రోమ్స్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించాలని సూచించారు. సముద్ర విహారాన్ని ప్రోత్సహించేలా విశాఖ, నెల్లూరులోని కృష్ణపట్నం పోర్టుల నుంచి క్రూజ్ నౌకలను కూడా నిర్వహించేలా చూడాలన్నారు. తెలంగాణా లాంటి ల్యాండ్ లాక్డ్ రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు దీనికి పెద్ద ఎత్తున ఆకర్షితులు అవుతారన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసే టెంట్ సిటీలను కేటగిరీలుగా విభిజించి ప్రోత్సహిస్తే అందరికీ అందుబాటులోకి వస్తాయన్నారు. కనీసం వెయ్యి టెంట్ సిటీలను గోదావరి పుష్కరాల నాటికి అందుబాటులోకి తేవాలని సీఎం సూచనలు జారీ చేశారు.
క్రియేటివ్ ఎకనామినీ ప్రోత్సహించేందుకు కంటెంట్ క్రియేషన్ పెద్ద ఎత్తున జరగాలన్నారు. క్రియేటివ్ ఎకానమీని సృష్టించేలా అమరావతి క్రియేటివ్ సిటీగా ఎదగాలన్నారు. బాలివుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా క్రియేటివ్ ఎకనామీ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపించారన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఐకానిక్ డెస్టినేషన్ స్కీమ్ కింద విశాఖ, తిరుపతి నగరాలను అభివృద్ధి చేయాలని.. ప్రతీ ఐకానిక్ డెస్టినేషన్ కు రూ.500 కోట్ల వరకూ వెచ్చించేందుకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. గత ఏడాదిలో పర్యాటక ప్రాంతాలకు 30.92 కోట్ల మంది పర్యాటకుల ఫుట్ ఫాల్ నమోదైందని ఈ ఏడాదిలో 9 నెలల కాలానికి గానూ 21 శాతం మేర వృద్ధి కనిపించిందని.. ఇది మరింత పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన ఆలయాలను అనుసంధానించి టెంపుల్ టూరిజం కూడా ఇంటిగ్రేట్ చేయాలని సీఎం సూచించారు. సూర్యలంక బీచ్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. వీటితో పాటు తిరుపతిలో ఉన్న చెరువులు, అమరావతి ప్రాంతంలోని కాలువలు, విశాఖ సహా వేర్వేరు ప్రాంతాలను సుందరీకరణ చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు.