
బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్య..
తల్లి సంరక్షణలో పెరిగిన పిల్లలకు తండ్రి పేరు తప్పనిసరి కాదు
ముంబయి హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. తల్లి సంరక్షణలో మాత్రమే పెరిగిన పిల్ల లేదా పిల్లవాడికి తప్పనిసరిగా తండ్రి పేరు, ఇంటిపేరు లేదా కులాన్ని స్కూలు రికార్డులో కనపర్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పాఠశాల రికార్డుల్లో తన పేరు, కులం మార్చుకునేందుకు 12 ఏళ్ల బాలికకు కోర్టు అనుమతి ఇచ్చింది.
కేసు నేపథ్యం..
తన పాఠశాల రికార్డుల్లో పేరు సవరణతో పాటు, కులాన్ని ‘మరాఠా’ నుంచి ‘షెడ్యూల్డ్ కాస్ట్ – మహార్’గా మార్చాలని కోరుతూ ఓ బాలిక విద్యాశాఖ అధికారులకు దరఖాస్తు పెట్టుకుంది. అయితే పాఠశాల అధికారులు ఇది మార్చడం కుదరదని చెప్పడంతో బాలిక హైకోర్టును ఆశ్రయించింది. బాలిక తండ్రిపై లైంగిక దాడి ఆరోపణలున్నాయని, అనంతరం పరస్పర అంగీకారంతో తల్లి సంరక్షణలోనే పెరిగినట్లు ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఇలాంటి సందర్భాల్లో తండ్రి పేరు తప్పనిసరి అని పట్టుబట్టడం తల్లిపై, పిల్లలపై సరికాదని ఔరంగాబాద్ బెంచ్కు చెందిన న్యాయమూర్తులు విభా కాంకణవాడి, హితెన్ వేణుగావ్కర్ సూచించారు. తల్లి సంరక్షణలో పెరిగిన బాలికకు ఆమె అభ్యర్థన ప్రకారం పాఠశాల రికార్డుల్లో అవసరమైన మార్పులు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు తల్లి సంరక్షణలో పెరిగిన పిల్లల హక్కుల విషయంలో కీలక మార్గదర్శకంగా నిలుస్తుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి.

