వైసీపీ క్రెడిట్ వార్కు చెక్ పెట్టండి..మంత్రులకు బాబు మాస్టర్ ప్లాన్
x

వైసీపీ 'క్రెడిట్ వార్'కు చెక్ పెట్టండి..మంత్రులకు బాబు మాస్టర్ ప్లాన్

రూ. 19,391 కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


పాలనలో వేగం పెంచడమే కాదు.. ప్రత్యర్థుల విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పడంలోనూ పదును పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కేబినెట్ సహచరులకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాల కంటే రాజకీయ వ్యూహాలే హైలైట్‌గా నిలిచాయి. 'వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను కేవలం ఖండించడమే కాదు.. వాస్తవాలతో వారి నోళ్లు మూయించాలి' అని సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న క్రెడిట్ వార్‌పై మంత్రులు అగ్రెసివ్‌గా స్పందించాలని, ప్రభుత్వ విజయాలను ప్రతి గడపకూ చేరవేయాలని ఆయన పిలుపునిచ్చారు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు 35కు పైగా అంశాలపై చర్చించిన కేబినెట్, ప్రజలకు ఆర్థిక ఊరటనిచ్చేలా విద్యుత్ చార్జీల విషయంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన రూ. 4,490 కోట్ల విద్యుత్ ట్రూ-అప్ చార్జీల భారాన్ని సామాన్య ప్రజలపై వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని కేబినెట్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, యూనిట్ విద్యుత్ ధరను రూ. 5.19 నుంచి రూ. 4.90కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించే లక్ష్యంతో, స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) ప్రతిపాదించిన రూ. 19,391 కోట్ల పెట్టుబడులకు కేబినెట్ తుది ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14 భారీ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేయనున్నాయి, ఫలితంగా వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అమరావతిలోని కృష్ణా నదీ తీరాన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు 'మెరీనా వాటర్‌ఫ్రంట్' ప్రాజెక్టుకు భూ కేటాయింపులను ఆమోదించింది. సూర్యలంక వంటి సముద్ర తీర ప్రాంతాల్లో కొత్త హోటళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వచ్చే విద్యాసంవత్సరం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేసే స్కూల్ కిట్ల కొనుగోలుకు రూ. 944 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి రూ. 15,000 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే పనులకు కేబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. వరల్డ్ బ్యాంక్ మరియు ఏడీబీ (ADB) నిధులతో సీడ్ యాక్సెస్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన నిరుద్యోగ యువతకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందించే 'యువశక్తి' పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు 'తల్లికి వందనం' పథకాల అమలు తీరుపై కేబినెట్ సంతృప్తి వ్యక్తం చేసింది. సంక్రాంతి కానుకగా పేదలకు ప్రత్యేక రేషన్ కిట్‌లను పంపిణీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'లో భాగంగా సింగిల్ విండో విధానాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. విశాఖపట్నంలో త్వరలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ (GIS) ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో విద్వేషపూరిత పోస్టులు, సోషల్ మీడియా వేధింపుల అదుపునకు సైబర్ క్రైమ్ విభాగంలో అదనపు సిబ్బంది నియామకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో జల రవాణా బలోపేతానికి 'ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్' ఏర్పాటుకు, MSME క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 7,500 మందికి ఉపాధి కల్పనకు, ఎక్సైజ్ ట్యాక్స్ సవరణలు, మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది.

Read More
Next Story