దాడిని చంద్రబాబు,లోకేష్‌లు మోనిటర్‌ చేశారుః అంబటి
x

దాడిని చంద్రబాబు,లోకేష్‌లు మోనిటర్‌ చేశారుః అంబటి

గత 19 రోజులుగా రిమాండ్‌లో ఉన్నఅంబటి సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బుధవారం విడుదలయ్యారు.


తనపై. తన కుటుంబంపైన, తన నివాసంపైన, తన కార్యాలయంపైన గంటల తరబడి టీడీపీ మూకలు చేసిన దాడిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల ఆధ్వర్యంలోనే జరిగిందని, అంతేకాకుండా దాడిని మోనిటర్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత 19 రోజులుగా రిమాండ్‌లో ఉన్న ఆయనకు, సత్తెనపల్లి సంక్రాంతి లక్కీ డ్రా కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదల ప్రక్రియ పూర్తయింది. జైలు వెలుపల వేచి ఉన్న వైసీపీ శ్రేణులు ఆయనకు పూలమాలలతో ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అంబటి, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ కక్షసాధింపుపై ధ్వజం

జైలు నుంచి బయటకు రాగానే అంబటి రాంబాబు నేరుగా కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ స్వయంగా నాపై జరిగిన దాడులను, పెట్టిన కేసులను మోనిటర్ చేశారు అని ఆయన సంచలన ఆరోపణ చేశారు. తనపై అక్రమ కేసులు బనాయించడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్య అని, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తన ఇంటిపై దాడి చేసి, తన కుటుంబ సభ్యులను మానసిక వేధించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కేసుల నేపథ్యం.. కోర్టు తీర్పు

అంబటి రాంబాబుపై ప్రధానంగా మూడు అంశాలపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు, పోలీసుల విధులకు ఆటంకం, 2023లో సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి లక్కీ డ్రాలో అవకతవకల ఆరోపణలపై ఆయనను జనవరి 31న అరెస్ట్ చేశారు. అయితే, బుధవారం ఉదయం గుంటూరు కోర్టు లక్కీ డ్రా కేసులో బెయిల్ మంజూరు చేయడంతో పాటు, పోలీసులు కోరిన కస్టడీ పిటిషన్‌ను కూడా తోసిపుచ్చింది. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, అందుకే నేడు న్యాయబద్ధంగా బయటకు వచ్చానని ఆయన పేర్కొన్నారు.

పోరాటం ఆగదు: అంబటి హెచ్చరిక

ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైలులో ఉంచినా అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదు అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. సంక్రాంతి లక్కీ డ్రాతో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలనే వివాదం సృష్టించారని ఆయన మండిపడ్డారు. తనపై జరుగుతున్న ఈ దాడులు తనను మరింత బలోపేతం చేస్తాయని, జగన్ మోహన్ రెడ్డి సైనికుడిగా కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తన పోరాటం కొనసాగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ అణచివేత చర్యలకు వైసీపీ భయపడబోదని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

Read More
Next Story