
రేపు భారత్ బంద్: ఏవి తెరిచి ఉంటాయి? ఏవీ మూతపడతాయి?
నాలుగు కొత్త కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు
కార్మిక సంఘాలు, రైతు సంఘాలు రేపు (ఫిబ్రవరి 12న) భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. బంద్ కారణంగా రవాణా, బ్యాంకింగ్, ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే అన్ని సేవలు పూర్తిగా నిలిచిపోవని అధికారులు చెబుతున్నారు.
బ్యాంకింగ్ సేవలు:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 12ను అధికారిక సెలవుగా ప్రకటించలేదు. అందువల్ల బ్యాంకు శాఖలు సాధారణంగా తెరిచి ఉండే అవకాశం ఉంది. అయితే ఉద్యోగ సంఘాలు సమ్మెలో పాల్గొనడం వల్ల కౌంటర్ సేవలు, చెక్కుల క్లియరెన్స్, డిపాజిట్లు, ఉపసంహరణల్లో ఆలస్యం జరగవచ్చు. ఆన్లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు సాధారణంగా పనిచేస్తాయని భావిస్తున్నారు. ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువగా యథావిధిగా పని చేసే అవకాశం ఉంది.
పాఠశాలలు, కళాశాలలు:
దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు అధికారిక సెలవు ప్రకటించలేదు. కానీ కేరళ, కర్ణాటక, ఒడిశా వంటి కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను బట్టి పాఠశాలలు మూసివేసే అవకాశం ఉంది. రవాణా సౌకర్యానికి ఇబ్బంది ఏర్పడితే కొన్ని స్కూళ్లు సెలవు ప్రకటించవచ్చు.
రవాణా:
కొన్ని ప్రాంతాల్లో బస్సులు, ఆటోలు, టాక్సీలు పరిమితంగా నడిచే అవకాశం ఉంది. రోడ్లపై నిరసనలు చేపడితే వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశముంది. రైల్వేలు, విమాన సర్వీసులు సాధారణంగా కొనసాగుతాయని చెబుతున్నా ప్రయాణికులు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలని సూచిస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు:
ఉద్యోగుల పాల్గొనడాన్ని బట్టి హాజరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని కార్యాలయాల్లో పనితీరు మందగించవచ్చు కానీ పూర్తిగా మూసివేయరని చెబుతున్నారు.
ముఖ్య సేవలు:
ఆసుపత్రులు, అంబులెన్స్ సేవలు, విద్యుత్, నీటి సరఫరా వంటి అత్యవసర సేవలు యథావిధిగా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
బంద్కు కారణాలేంటి?
నాలుగు కొత్త కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చాయి. ఉద్యోగ భద్రత తగ్గుతోందని, ప్రైవేటీకరణ పెరుగుతోందని, సామాజిక భద్రతా చర్యలు తక్కువగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. రైతు సంఘాలు కూడా వాణిజ్య ఒప్పందాలు, వ్యవసాయ విధానాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ మద్దతు తెలిపాయి.
మొత్తం మీద భారత్ బంద్ రోజున పూర్తి స్థాయి మూసివేత ఉండకపోయినా, కొన్ని సేవల్లో అంతరాయం, ట్రాఫిక్ జాప్యాలు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

