
బెంగళూరు మెట్రో టికెట్ ధరల పెంపు వాయిదా..
కర్ణాటకలో తలొగ్గిన కేంద్రం..
ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడం, కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP), జేడీఎస్(JDS) పార్టీల మధ్య రాజకీయ వివాదం చెలరేగడంతో ఫిబ్రవరి 9 నుంచి అమలు చేయాలనుకున్న టికెట్ ధరల పెంపును వాయిదా వేశారు. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి అమలులోకి రావాల్సిన మెట్రో టికెట్ ధరల పెంపుపే వాయిదా వేస్తున్నట్లు అందులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 5న విడుదల చేసిన మీడియా ప్రకటనలో ఫిబ్రవరి 9 నుంచి ధరల పెంపు ఉంటుందని చెప్పిన విషయాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు BMRCL పేర్కొంది.
ఏటా 5 శాతం పెంపు..
ప్రతి సంవత్సరం 5 శాతం టికెట్ ధరలు పెంచాలని ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల వివిధ విభాగాల్లో రూ.1 నుంచి రూ.5 వరకు ధరలు పెరగనున్నాయి. ఈ ప్రకటనతో ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్షాలైన బీజేపీ , జేడీఎస్లకు మధ్య రాజకీయ వాగ్వాదం మొదలైంది.
కాంగ్రెస్పై బీజేపీ ఎంపీ నిప్పులు..
ఆదివారం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మెట్రో ప్రయాణికులతో మాట్లాడి టికెట్ ధరల పెంపుపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తరచూ టికెట్ ధరలు పెంచడంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. అలాగే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు కేంద్రాన్ని నిందిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. మెట్రో టికెట్ ధరల పెంపునకు కేంద్రాన్ని నిందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకుంటోందని సూర్య ఆరోపించారు. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. టికెట్ ధరల నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో లేదని స్పష్టం చేసింది.

