
పిల్లల విషయంలో సోషల్ మీడియా నిషేధం సరైన మార్గమా?
చిన్నారుల పరివర్తనపై చైల్డ్ సైకియాట్రిస్ట్ రాజరత్నం ఏమంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం గురించి పెద్దఎత్తున చర్చ వేడెక్కుతోంది. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్ వంటి దేశాలు ఆంక్షల దిశగా అడుగులు వేస్తున్నాయి. చైనా “మైనర్ మోడ్” అమలు చేస్తోంది. అమెరికా టైం బౌండ్ పరిమితులపై చర్చిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా నిషేధమే సమస్యకు పరిష్కారమా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.
ఈ అంశంపై ‘AI విత్ సంకేత్’ కార్యక్రమంలో బాలల మనస్తత్వవేత్త ఆర్తి సి రాజరత్నం మాట్లాడారు. నిషేధం సమస్యను పరిష్కరించదని ఆమె చెప్పారు. నిషేధిస్తే మరింత ఆకర్షణ పెరుగుతుందని, సోషల్ మీడియా ఖాతాలు లేని పిల్లలకు కూడా తెలుసుకోవాలన్న ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. సమస్య కేవలం సోషల్ మీడియాది కాదని, దాన్ని నడిపించే ఎకానమీ అసలు ప్రమాదమని చెప్పారు.
డిఫాల్ట్ మోడ్తోనే సృజనాత్మకత..
చిన్నారులకు రోజువారీ సామాజికీకరణ అవసరమని స్పష్టం చేశారు. సాధారణ సామాజిక ప్రవర్తనలు నేర్చుకోకుండానే ఆన్లైన్లో ఆరోగ్యకర ప్రవర్తన ఆశించడం తగదన్నారు. మానవ మెదడులో డిఫాల్ట్ ఫోకస్, స్పాట్లైట్ ఫోకస్ అనే రెండు విధానాలు ఉంటాయని చెప్పారు. డిఫాల్ట్ మోడ్లోనే సృజనాత్మకత పుడుతుందని వివరించారు. కానీ రీల్స్, తక్షణ కంటెంట్ మనసును నిరంతరం ఆకర్షిస్తాయని ఫలితంగా పగటి కలలు, స్వేచ్ఛా ఆలోచన తగ్గిపోతుందన్నారు.
కుటుంబ, స్నేహ బంధాలు అలవాటు చేయాలి..
నిషేధం పనిచేయకపోతే పరిష్కారం ఏమిటి? అన్న ప్రశ్నకు రాజరత్నం సమాధానం చెప్పారు. పరిష్కారం సంబంధాలతో మొదలవ్వాలని అన్నారు. బలమైన కుటుంబ, స్నేహ బంధాలు ఉంటే ఫోన్పై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుందన్నారు. ఒంటరితనం వల్లే పిల్లలు సోషల్ మీడియా వైపు పరుగెడుతున్నారని, ఇంట్లోనే ఆరోగ్యకర పునాది నిర్మిస్తే.. సోషల్ మీడియా ప్రభావం నుంచి బయటపడవచ్చని చెప్పారు.
ఇంకా క్లారిటీ రాలేదు..
ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, డెన్మార్క్, స్పెయిన్ వంటి దేశాల్లో సోషల్ మీడియా నిషేధంపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. 2009 తర్వాత స్క్రీన్ వినియోగం పెరిగిందని, 2014 ప్రాంతంలో వర్చువల్ ఆటిజం లక్షణాలు కనిపించాయని గుర్తుచేశారు.
సోషల్ మీడియా ప్రారంభ దశలో హానికరం కాకపోయినా, కాలక్రమేణా మారిపోయిందని వివరించారు. ఫిల్టర్ లేకుండా ఫోటో పోస్ట్ చేసిన అమ్మాయికి AI తక్షణమే కాస్మెటిక్ సూచనలు ఇచ్చే విధానాన్ని ఉదాహరణగా చెప్పారు. అబ్బాయిలకూ తాము సరిపోరనే భావన కలిగించే కంటెంట్ అందుతోందని పేర్కొన్నారు.
టైం బౌండ్ తప్పనిసరి..
2030 నాటికి సోషల్ మీడియాకు బానిసైన తరం, బానిస కాని తరాన్ని పోల్చినప్పుడే అసలు ప్రభావం తెలుస్తుందని అన్నారు. సమయ పరిమితుల విషయంలో కూడా జాగ్రత్త అవసరమని చెప్పారు. వాడకం, వ్యసనం మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఒక్కసారిగా సమయం తగ్గిస్తే ఉపసంహరణ లక్షణాలు రావచ్చని హెచ్చరించారు.
నెమ్మదిగా ప్రభావం..
సోషల్ మీడియాను ఆమె “మానసిక విషం”గా అభివర్ణించారు. విషం నెమ్మదిగా ప్రభావం చూపుతుందని, అది మన మానవ సామర్థ్యాన్ని తగ్గిస్తుందని చెప్పారు. గేమింగ్ల వల్ల మంచి-చెడుల మధ్య తేడా గుర్తించే సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చని పేర్కొన్నారు. రివార్డ్ మెకానిజమ్ల వల్ల భావోద్వేగ అనుభవాలు కుంచించుకుపోతాయని వివరించారు.
చివరిగా సంబంధాలను బలోపేతం చేయడం, ప్రత్యామ్నాయ ప్రవర్తనలను నిర్మించడం అత్యవసరమని ఆమె స్పష్టం చేశారు. ఆంక్షలు మాత్రమే సరిపోవని, సమతుల్య దృష్టికోణం అవసరమని సూచించారు.

