
పాకిస్థాన్లో ట్రైన్ హైజాక్.. బందీలుగా వంద మంది ప్రయాణికులు..
గుర్తుతెలియని దుండగులు జాఫర్ ఎక్స్ప్రెస్పై కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్రగాయాలు కాగా.. కొంతమంది ప్రయాణికులకు గాయలయినట్లు సమాచారం.
క్వొత్తా (Quetta) నుంచి పేషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ట్రైన్ డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. కొంతమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గుడాలార్ - పీరు కోనేరి ప్రాంతాల గుండా రైలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూట్ కథనం మేరకు..ట్రైన్ మచ్ (Mach) పర్వత ప్రాంతంలో ట్రైన్ను బలవంతంగా ఆపించేందుకు దుండగులు కాల్పులు జరిపారు. రైలు ఆగిపోయిన తరువాత వంద మంది ప్రయాణికులను బంధించారు. ఈ విషయాన్ని భద్రత బలగాలు నిర్ధారించాయి. కాల్పుల ధాటికి భయాందోళనకు గురయ్యామని, రైలు ఆగేదాకా దుండగులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనను రైల్వే పోలీసులు ధృవీకరించారు. ట్రైన్లో 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే ప్రయాణికులకు అయిన గాయాలపై స్పష్టత రావాల్సి ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఘటనపై విచారణ చేపట్టామని చెప్పారు.
సహాయక బృందాలు రంగంలోకి..
ఘటన గురించి తెలిసిన వెంటనే సమీపంలోని ఆసుపత్రుల్లో అత్యవసర ఏర్పాట్లను సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకున్నాని, సిబి (Sibi) నుంచి అంబులెన్స్లను రైలు నిలిచిన ప్రాంతాలకు పంపామని రైల్వే డివిజనల్ సూపరింటెండెంట్ (DS) అధికార ప్రతినిధి చెప్పారు. ఇటు మచ్ పర్వత ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ప్రయాణికులను కాపాడేందుకు కృషి చేస్తున్నాయి.
రైలు పట్టాల ధ్వంసానికి కుట్ర?
దుండగులు కాల్పులు జరిపే ముందు.. పేలుడు పదార్థాలతో రైలు పట్టాలను ధ్వంసం చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బెలుచిస్తాన్(Balochistan)లో ఇటీవల తీవ్రవాద దాడులు ఎక్కువయ్యాయి. జాఫర్ ఎక్స్ప్రెస్పై దాడి తామే చేశామని ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఇంకా ప్రకటించలేదు.