న్యాయమూర్తులతో నిండిపోయిన అమరావతి
x

న్యాయమూర్తులతో నిండిపోయిన అమరావతి

అమరావతిలో హైకోర్టు జడ్జీల నివాస గృహ సముదాయాన్ని ప్రారంభించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి న్యాయమూర్తులతో నిండిపోయింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ రాకతో జస్టిస్ లతో అమరావతి కళకళలాడింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్మించిన హైకోర్టు న్యాయమూర్తుల నివాస గృహాల సముదాయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం ప్రారంభించారు. సి.ఆర్.డి.ఏ ఆధ్వర్యంలో రూ.210 కోట్ల వ్యయంతో 33.20 ఎకరాల విస్తీర్ణంలో 36 మంది హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఆధునిక సౌకర్యాలతో నివాస గృహాలను నిర్మించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అదనంగా మరో 13 బంగాళాలను నిర్మించేందుకు తగిన స్థలాన్ని కూడా కేటాయించారు.

ప్రతి నివాస గృహాన్ని 7,841 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ నమూనాలో నిర్మించారు. న్యాయమూర్తుల అవసరాలకు అనుగుణంగా ఆఫీసు గది, వెయిటింగ్ హాల్ తదితర వసతులతో ఈ గృహాలను సమగ్రంగా రూపొందించారు. బి.ఎస్.ఆర్. ఇన్ఫ్రాటెక్ సంస్థ నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో నివాస సముదాయ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు ఆవిష్కరించారు. అనంతరం జడ్జిల బంగ్లాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఎస్.వి.ఎస్. భట్టి, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు శ్యామల రావు, సురేష్ కుమార్, సి.ఆర్.డి.ఏ కమిషనర్ కన్నబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్.పి. వకుల్ జిందాల్ పాల్గొన్నారు.
ప్రారంభోత్సవం అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. చంద్రబాబు నాయుడు, ఇతర న్యాయమూర్తులతో కలిసి ఒక నివాస గృహాన్ని సందర్శించారు.
Read More
Next Story