రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమరావతి చట్టబద్ధత బిల్లు
x

రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న అమరావతి చట్టబద్ధత బిల్లు

ఎటువంటి సవరణలు లేకుండానే ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలపాయి.


ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు-2026 సోమవారం రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంది. లోక్‌సభ సచివాలయం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడంతో, ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడనుంది.

పార్లమెంట్‌లో ఏకగ్రీవ ఆమోదం
ఇటీవల పార్లమెంట్‌లో ఈ బిల్లుపై సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. లోక్‌సభ, రాజ్యసభల్లో వివిధ పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయగా, కేంద్ర ప్రభుత్వం అమరావతి ప్రాధాన్యతను సభకు వివరించింది. ఎటువంటి సవరణలు లేకుండానే ఉభయ సభలు ఈ బిల్లుకు ఆమోదం తెలపడం విశేషం. ప్రజాస్వామ్యబద్ధంగా సాగిన ఈ చర్చ అనంతరం లోక్‌సభ సచివాలయం తుది ప్రక్రియను పూర్తి చేసి రాష్ట్రపతికి నివేదించింది.
రాష్ట్రపతి సంతకమే తరువాయి
ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి పరిశీలనలో ఉంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రాష్ట్రపతి ఈ బిల్లుపై ఆమోద ముద్ర వేయనున్నారు. సోమవారం సాయంత్రం లోపు లేదా రేపటిలోగా రాష్ట్రపతి సంతకం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందిన వెంటనే ఈ బిల్లు చట్టరూపం దాల్చుతుంది.
త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్
రాష్ట్రపతి సంతకం పూర్తయిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం హిందీ , ఆంగ్ల భాషల్లో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనితో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు అమలులోకి వస్తాయి. అమరావతికి చట్టబద్ధమైన రక్షణ లభించడంతో పాటు, రాజధాని నిర్మాణ పనులకు మరింత ఊతం లభిస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
Read More
Next Story