
నాగ్పూర్ పేలుడు పదార్థాల కర్మాగారంలో పేలుడు
20 మంది మృతి, 15 మంది పరిస్థితి విషమం
మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలోని పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో ఆదివారం (మార్చి 1) ఉదయం జరిగిన పేలుడులో కనీసం 20 మంది మరణించగా, 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కటోల్ తహసీల్ రౌల్గావ్లోని మైనింగ్, పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ సంస్థ ఎస్బిఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ పేలుడు సంభవించిందని సీనియర్ పోలీసు అధికారి విలేకరులకు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టడానికి జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. కంపెనీ డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్లో ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఎస్బిఎల్ ఎనర్జీ లిమిటెడ్ ప్రతినిధులు పీటీఐకి చెప్పారు. పేలుడు సంభవించినప్పుడు యూనిట్లో దాదాపు 35 మంది కార్మికులు, ఇద్దరు పర్యవేక్షక అధికారులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రులను నాగ్పూర్లోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లా కలెక్టర్ విపిన్ ఇటాంకర్, పోలీసు సూపరింటెండెంట్ హర్ష్ పోదార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో క్రాకర్ యూనిట్లో జరిగిన పేలుడులో 21 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ ఘటన జరగడం గమనార్హం.

